గత పాలకుల హయాంలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. కనీస వసతులు లేక అల్లాడిపోయాయి. ఉపాధి లేక ఎంతోమంది పొట్టచేత పట్టుకొని వలస పోయారు. కూలీలకు పని దొరక్క పస్తులున్న రోజులెన్నో.. అలాంటి పల్లెలు నేడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సాగు, తాగునీటి కష్టాలు తీర్చారు. చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసి నీటివనరులను ఒడిసిపట్టారు. తద్వారా రెండు పంటలకూ సాగునీరందుతున్నది. అంతేకాదు, చెరువుల్లో చేపల పెంపకంతో మత్స్య పరిశ్రమకు మంచి రోజులొచ్చాయి. దీంతో పట్టణాలు, నగరబాట పట్టిన పల్లెవాసులకు సొంతూళ్లోనే ఉపాధి లభిస్తుండడంతో గ్రామాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఏ పల్లె చూసినా సాగుతో కళకళలాడుతున్నది. పచ్చందాలతో కనువిందు చేస్తున్నది. రహదారుల నిర్మాణంతో రవాణా మెరుగుపడింది. వాణిజ్య, వ్యాపార సంబంధాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత గ్రామీణ వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
– ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 13
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 13 : పల్లెలకు జవసత్వాలొచ్చాయి. ఉపాధి లేక పట్టణాలు, నగర బాట పట్టిన పల్లెవాసులు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. గ్రామ పరిపాలన గాడిలో పడింది. పచ్చందాలతో పల్లె సీమలు మెరుస్తున్నాయి. ఏటాటే సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. పాడి, మత్స్య, జీవాల పెంపకానికి పూర్వ వైభవం వచ్చింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తర్వాత పోల్చుకుంటే గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఉమ్మడి పాలనలో చేతినిండా పని లేక పట్టణాలు, నగరబాట పట్టిన పల్లెవాసులు నేడు చేతినిండా చేకూళ్లు (ఎవుసం పనులు) దొరకడంతో గ్రామాలకు చేరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఏ పల్లె చూసినా ఊరినిండా జనం, చేతినిండా పని దొరుకుతున్నది.
పల్లెల్లో ఉపాధి పుష్కలం
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన పల్లెలు నేడు ఉపాధికి అడ్డాగా మారాయి. రైతు కుటుంబాలతోపాటు రైతు కూలీలకూ పుష్కలంగా ఉపాధి దొరుకుతున్నది. ప్రస్తుతం మహిళా కూలీలు రోజుకు రూ.400పైగానే సంపాదిస్తున్నారు. పురుషులకు రోజుకు రూ.500 ఇచ్చినా దొరకని పరిస్థితి. పత్తి పాటు చేసినా, గొర్రు తోలినా డిమాండే ఉంది. రోజుకు అరకకు కనీసం రూ.1,500 ధర పలుకుతున్నది. అంతేకాదు, మిర్చి ఏరివేత, వరి కోత సమయంలో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామాలే స్వయం ఉపాధి కేంద్రాలుగా మారడంతో ఇతర జిల్లాల, రాష్ర్టాల నుంచి వలస కార్మికులు వస్తున్నారు.
పట్టణాల్లో పలచబడ్డ అడ్డా కూలీలు
గతంలో ఖమ్మం నగరం, మధిర, సత్తుపల్లి, వైరా పట్టణాల్లో అడ్డా మీద ఎక్కడ చూసినా స్థానికులతోపాటు పల్లెప్రజలు గుంపులుగా కూలీల కోసం ఎదురుచూసేవారు. ప్రసుత్తం భిన్న వాతావరణం కనిపిస్తున్నది. గ్రామాల్లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. కూలీలకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో అడ్డా పనులకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పల్లెల నుంచి పట్నాలకు వచ్చే భవన నిర్మాణ, ఇతర కార్మికుల రాక గణనీయంగా తగ్గిపోయింది. ఇంతకాలం పట్టణాలు, నగరంలో ఉన్న కార్మికులు సైతం పల్లెలలో పనులు దొరుకుతుండటంతో అక్కడికి వెళ్తున్నారు.
అనుబంధ రంగాల బలోపేతం
వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు పూర్వ వైభవం వచ్చింది. తద్వారా గ్రామాల్లో ఉపాధి మరింత పెరిగింది. సాగు రైతులకు అదనపు ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ అధివృద్ధిపై తొలి విడత ప్రభుత్వంలోనే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ రెండు శాఖలు బలోపేతం అయ్యాయి. తద్వారా గ్రామాల్లో కుల వృత్తులకు ఉపాధి దొరుకుతున్నది. మత్స్యకార్మికులకు, పెంపకందారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత చేపపిల్లల పంపిణీ, 75 శాతం రాయితీపై గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతి పల్లెలో మత్స్యకార్మికులు చేపల పెంపకం ద్వారా మంచి ఫలితాలు పొందుతున్నారు. ఆదాయం పెంపొందించుకుంటున్నారు. పెంపకం దారులకు రాయితీ గొర్రెలతో ఉపాధి పెరిగింది.
పుష్కలంగా పని
ఏటా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రోజువారి కూలీగా వెళ్తాను. రోజుకు 3 నుంచి 4 వందల కూలీ దొరుకుతున్నది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది. ప్రతి సీజన్లో రెండు, మూడు నెలలపాటు కొనుగోలు కేంద్రాల్లో పని దొరుకుతున్నది. మిగిలిన రోజుల్లో వ్యవసాయ పనులకు వెళ్తాం. గ్రామాల్లో పుష్కలంగా ఉపాధి లభిస్తుండటంతో వలసలు తగ్గాయి.
– ఏదుళ్ల అశ్విని, పెనుబల్ల్లి
ఊళ్లోనే ఉపాధి
గ్రామాల్లో నీటి వనరులు పెరిగాయి. సాగు సంబురంగా సాగుతున్నది. పత్తి, వరికోత సీజన్లో ఊళ్లోనే ఉపాధి లభిస్తున్నది. వందరోజుల పనికంటే కూలీ పనికి మంచి గిట్టుబాటు అవుతున్నది ఊరి నుంచి ఖమ్మం పోయేటొళ్లు కూడా తగ్గిండ్రు. పెయింటింగ్, ఇతర పనులకు మాత్రమే పోతున్నారు. వ్యవసాయ కూలీలకు ఊరిలోనే కూలీ పని దొరుకుతుంది.
-కొప్పుల సంతోషం, ఎం వెంకటాయపాలెం, ఖమ్మం రూరల్ మండలం
చేపల సాగు గణనీయంగా పెరిగింది
గతంలో చేపల పెంపకానికి ఎవరూ ముందుకు రాలేదు. చెరువులో నీళ్లులేక, చేపలు పోసేందుకు పైసలు లేక పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. వాటిని అమ్ముకునేందకు మోటార్ సైకిళ్లు, ఆటోలు ఇచ్చింది. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉండటంతో చేపల ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా ఉంది. మత్స్య కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది.
– పందుల ఉపేందర్, మత్స్య సొసైటీ అధ్యక్షుడు, రఘునాథపాలెం
కూలీలకు డిమాండ్
జిల్లా వాప్తంగా సాగు సంబురంగా మారింది. రైతులతోపాటు కూలీలు నిత్యం పొలాల దగ్గర ఉంటున్నారు. ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వాణిజ్య పంటల సాగు రెండింతలు పెరగడంతో అదే తరహాలో కూలీలకు డిమాండ్ పెరిగింది. మిర్చి, వరికోతల సీజన్లో పొరుగు రాష్ర్టాల నుంచి వలస కూలీలు జిల్లాకు వస్తున్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలు బలోపేతం అయ్యాయి.
-ఎం విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి