సత్తుపల్లి, మార్చి 27 : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తల్లాడ మండలం గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మిట్టపల్లి, మల్సూర్తండా తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ఆయా గ్రామాల్లో తాగునీటి సరఫరా, బోర్లు, ఓపెన్ బావులు, నీటి వనరులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త బోర్లు, పైపులైను మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. మిట్టపల్లిలో పల్లె దవాఖానను తనిఖీ చేసి.. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వ్యాధి నిరోధక టీకాలు కచ్చితంగా ఇవ్వాలని, చిన్నారులకు ప్రతినెలా టీకాలు సక్రమంగా వేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి వసతుల కల్పన, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రహరీలు లేని పోలింగ్ కేంద్రాలకు ఫెన్షింగ్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం హెచ్ఎంలతో సమావేశమై విద్యార్థులు, ఉపాధ్యాయుల నమోదును అడిగి తెలుసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మల్సూర్తండాలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు, విద్యాశాఖ ఈఈ నాగశేషు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు ఉన్నారు.