సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సత్తుపల్లికి చెందిన దొడ్డా సురేష్ ఫైనాన్స్ వ్యాపారి వద్ద రెండు నెలల క్రితం రూ.4వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాడు.
అయినా ఇంకా వడ్డీతో సహా చెల్లించాలని ఈనెల 16న హోటల్ వద్దకు వెళ్లి రవిపై దాడిచేయడంతో మనస్థాపానికి గురై పురుగుమందు తాగాడు. అది గమనించిన కుటుంబసభ్యులు సత్తుపల్లి ప్రయివేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు.
రవి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉండటంతో రవిని ఇంటికి తీసుకువచ్చారు. దీనికి కారణమైన వ్యక్తిపై బాధితుని భార్య జ్యోతి ఫిర్యాదు చేయగా ఈ మేరకు తహశీల్దార్ మీనన్ రవి ఇంటికి వెళ్లి వాంగ్మూలం సేకరించి కేసునమోదు చేశారు.