‘మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాం. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. వర్షాలపై జిల్లా యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం’ అని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులకు అందజేశానన్న సంతృప్తి మిగిలిందని, జిల్లా ప్రజల అవసరాలను తెలుసుకుని తగిన ప్రణాళికతో వ్యవహరించడం వల్ల పలు సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. కలెక్టర్గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, జిల్లా ప్రజల సహకారంపై గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
– ఖమ్మం, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పౌర జీవనానికి అంతరాయం కలుగకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకవేళ ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉంటే తక్షణ సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, వారు 24 గంటలూ విధి నిర్వహణలో ఉంటారని తెలిపారు. వర్షాల దృష్ట్యా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేదని, రైతులు ప్రధానంగా వానకాలంలో సాగు చేసే వరి పంటకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. కలెక్టర్గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో గురువారం ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ధరణితో రైతులకు న్యాయం..
ధరణి ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ప్రయత్నించాం. ఈ పోర్టల్ ద్వారా ఎక్కువమంది రైతులకు పాస్పుస్తకాల జారీ, నిషేధ జాబితాలో నుంచి సర్వే నెంబర్ల తొలగింపు వంటి అంశాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. నేను కలెక్టర్గా బాధ్యతలు చేపట్టే నాటికి జిల్లాలో నిషేధ జాబితాలో తమ భూములు ఉన్నాయంటూ 64 వేల దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగులు, అధికారులు రాత్రింబవళ్లూ శ్రమించడం వల్ల వాటిని పరిష్కరించాం. అలాగే 85 వేల సర్వే నెంబర్లకు కూడా నిషేధ జాబితాలో ఉండడంతో రైతులు ఎవరూ దరఖాస్తు చేయకపోయినా అందులోని 65 వేల సర్వే నెంబర్ల సమస్యను పరిష్కరించాం.
‘మన బడి’లో జిల్లా అగ్రగామి
‘మన ఊరు/ మన బస్తీ – మన బడి కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉంది. ఈ కార్యక్రమం కింద 426 పాఠశాలలు ఎంపిక కాగా.. రూ.190 కోట్లతో అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టాం. దళితబంధు పథకంలో చింతకానిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేయడంతో ఆ మండలంలోని దళిత కుటుంబాలన్నింటికీ రూ.10 లక్షల చొప్పున అందించి ఉపాధి యూనిట్లు మంజూరు చేశాం.
ఎన్నికల కోసం పక్కా ప్రణాళిక రానున్న సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో 1,639 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటిలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను వినియోగించే తీరుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు జిల్లాపవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాం.
జిల్లాకు రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు జిల్లాకు రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు కొత్తగా రానున్నాయి. ఈ సంవత్సరం 12 వేల ఎకరాల్లో కొత్తగా పామాయిల్ సాగు చేస్తున్నారు. వేంసూరు మండలం కల్లూరుగూడెం, కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పూర్తి సంతృప్తినిచ్చింది. ఆధారాలు లేని పేదలకు చట్టబద్ధంగా ఆధారాలు సమకూర్చడం ద్వారా 3,500 కుటుంబాలకు జీవో నెంబరు 58 కింద స్థలాల క్రమబద్ధీకరణ చేసి పట్టాలు అందజేశాం. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం మధురానుభూతినిచ్చింది. మంత్రి అజయ్కుమార్తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పక్షాల నేతలు, జిల్లా అధికారులు పాలనాపరంగా పూర్తి సహాయ, సహకారాలు అందించారు.
పలు అంశాల్లో జిల్లా అగ్రగామి..
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలో అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నించాను. దీనికి జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పూర్తి సహకారం అందించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో రాకపోవడంతో ఉపకార వేతనాలను పొందలేకపోయారు. దీనిని గమనించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నేరుగా ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. దీంతో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరయ్యాయి. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కావడం, అన్ని హంగులతో కొత్త కలెక్టరేట్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రారంభించుకొని.. వారు తనను కలెక్టర్ సీటులో ఆశీనులను చేయడం ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి. దీనిని అదృష్టంగా భావిస్తున్నా.
శరవేగంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులు
జిల్లాలో 4 ఎన్హెచ్ ప్రాజెక్టులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భూసేకరణ సైతం దాదాపు పూర్తయింది. నేషనల్ హైవే అధికారులను ఒప్పించి ఎకరానికి రూ.20 లక్షలు, రూ.22 లక్షలు, రూ.25 లక్షల వరకు పరిహారం ఇప్పించగలిగాం. ఖమ్మం – సూర్యాపేట, ఖమ్మం – కురవి, ఖమ్మం – దేవరపల్లి, ఖమ్మం – అమరావతి జాతీయ రహదారుల పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.