సత్తుపల్లి రూరల్, జనవరి 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ఈ ఏడాది గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంటలో జరుగుతున్న సీతారామ టన్నెల్ పనులను సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారే ఆదినారాయణతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం యాతాలకుంటలోని సీతారామ ప్రాజెక్టు క్యాంపు శిబిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ రూ.13 వేల కోట్ల అంచనాతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటివరకు 60శాతం మేరకు పూర్తవ్వగా రూ.7,500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు మెయిన్ కెనాల్ 192 కిలోమీటర్ల మేర, ట్రంక్ కెనాల్ 116 కిలోమీటర్ల మేర ప్రవహిస్తాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అతిత్వరలో పూర్తిచేసి బేతుపల్లి, లంకాసాగర్, వైరా, నాగార్జునసాగర్ కెనాల్ ద్వారా ఉమ్మడి జిల్లాలకు సాగునీరు అందిస్తామన్నారు.
గండుగులపల్లిలో నాల్గవ పంపుహౌస్ పనులు పూర్తవుతున్నాయని, ఆ పనులు పూర్తయితే దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు సైతం గోదావరిజలాలు అందుతాయన్నారు. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట టన్నెల్ ప్రధానమైందని, ఇది పూర్తయితేనే బేతుపల్లి, లంకాసాగర్, వైరా ప్రాజెక్టులకు సాగునీరు అందుతుందని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం, సత్తుపల్లి మండలం యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తవుతున్నాయన్నారు. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణపనులు సైతం వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలన్నారు. తన రాజకీయ జీవితంలో లక్ష్యంగా పెట్టుకున్న సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి ఆ గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాకు పారించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుమ్మల స్పష్టం చేశారు. భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం సైతం వెంటనే చెల్లించేవిధంగా ఏర్పాట్లు చేయాలని అక్కడి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు.
సీతారామ కాలువను నాగార్జునసాగర్ కెనాల్లో కలిపేందుకు ఆరేడు కిలోమీటర్ల మేర కాలువ తవ్వేందుకు టెండర్లు పిలవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని, ఆ పనులు కూడా త్వరలో పూర్తయితే ఈ నీటిని నాగార్జునసాగర్ కెనాల్ ద్వారా మధిర నియోజకవర్గానికి సైతం పారిస్తామన్నారు. టన్నెల్ నిర్మాణంలో ఎలాంటి ఆటంకం కలగకుండా రెండువైపులా పనులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల విషయంలో ఏ సమస్య తలెత్తినా తన దృష్టికి తేవాలని ఆయన అధికారులు, గుత్తేదారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీవో అశోకచక్రవర్తి, తహసీల్దార్ యోగేశ్వరరావు, ఏసీపీ రామానుజం, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈలు సురేశ్, శ్రీనివాసచారి, హెచ్ఈఎస్ చైర్మన్ కేశవరాజు, డీఈ చంద్రశేఖర్, ఏఈలతోపాటు నాయకులు మట్టా దయానంద్ విజయ్కుమార్, చల్లగుళ్ల నర్సింహారావు, కొప్పుల నరేందర్రెడ్డి, పమ్మిన రవి, నరుకుళ్ల అప్పారావు, వెచ్చా రాంప్రసాద్ పాల్గొన్నారు.