భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. జనమంతా జాతరవైపే సాగిపోతుండడంతో జిల్లాఅంతటా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడచూసినా మేడారం భక్తులే దర్శనమిస్తున్నారు. ఆటోలు, ట్రాలీలు, టాటామేజిక్లు, లారీల్లో సైతం కుటుంబాల సమేతంగా పయనమవుతున్నారు.దారులన్నీ మేడారంవైపే కనిపిస్తున్నాయి. గత నెలరోజుల నుంచే భక్తులు మేడారానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ మహాజాతరకు లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం సైతం అక్కడే నెలరోజులుగా విధుల్లో నిమగ్నమయ్యారు. గద్దెల మీదకు అమ్మవార్లు రాకముందే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం జాతర ఎప్పుడు జరిగినా ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నాకే జాతరకు పయనమవుతారు. దీంతో బంగారానికి(బెల్లం) బాగా డిమాండ్ పెరిగింది. స్థానికంగా గద్దెలు ఉన్న ప్రాంతాల్లో సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకుని ఇంటివద్దనే నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి అప్పగిస్తారు. స్థానికంగా జరుగుతున్న జాతరలు ఇప్పటికే పూర్తికావడంతో ఇంటివద్ద దేవునికి పెట్టుకుని మొక్కులు ఇచ్చి చెల్లింపులకు మేడారం పయనమవుతారు.
ఇప్పటికే టీఎస్ ఆర్టీసీ మేడారం కోసం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసి ఆయా డిపోల పరిధిలో ప్రారంభించడం కూడా జరిగింది. డిపోల పరిధిలో బస్సులు సరిపోకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులను రప్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చలువ పందిర్లను సమకూర్చారు. కొత్తగూడెం నుంచి 130, ఇల్లెందు 124, పాల్వంచ 45, మణుగూరు 25, భద్రాచలం 50 బస్సులతోపాటు చర్ల 10, టేకులపల్లి 25 బస్సులను ఏర్పాటు చేశారు. మంగపేట, ఏటూరునాగారంలో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. బస్సుల రద్దీ కారణంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణానికి ఆధార్కార్డు అందుబాటులో లేకపోయినా ప్రయాణం చేసే వెసులుబాటు కూడా కల్పించారు. దీంతో మహిళలకు కొంత ఊరట కలిగింది. బస్సుల్లో మేడారం వెళ్లే ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం కల్పించారు ఆర్టీసీ అధికారులు.
మేడారం సమ్మక్క అంటే మాకు నమ్మకం. అందుకే ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటాము. జాతర నాడు బాగా బిజీ ఉంటుందని ముందుగానే వెళ్తున్నాము. ఇప్పటికే చాలా జనం వచ్చారట. అయినా అమ్మ దర్శనం కోసం ఎంత జనం ఉన్నా వెళ్లాల్సిందే.
మేడారం వెళ్లే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేశాం. చలువపందిళ్లను సైతం ఏర్పాటు చేసి సరిపడా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాము. పాల్వంచలో కూడా కౌంటర్ పెట్టాము. బస్సు నిండిన వెంటనే పంపిస్తున్నాం. బస్సులో ప్రయాణం చేయడం వల్ల అందరూ గద్దెల దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. మేడారం వద్ద కూడా ఆర్టీసీ బస్టాండ్ ఉంది. మన జిల్లా బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుగు ప్రయాణం కూడా సులువుగా ఉంటుంది.