కొత్తగూడెం సింగరేణి, మే 7 : జెన్కో సీఎల్ కార్మికుడిగా పని చేశానని, జేపీఏగా ఉద్యోగోన్నతి వచ్చినప్పటికీ వదిలేసి ప్రజాసేవ చేస్తున్నానని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని 5 షాప్ట్, ఏరియా వర్క్షాప్, కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం హెడ్డాఫీస్, ప్రధాన ఆస్పత్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 షాప్ట్లో కార్మికులతో మాట్లాడుతూ కార్మికుల కష్టాలు తెలుసునని, సింగరేణి ప్రైవేట్పరం కాకుండా ఉండాలంటే పార్లమెంట్కు తనను పంపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే సింగరేణి ప్రైవేట్పరం కావడం ఖాయమన్నారు. సింగరేణి అంటేనే తెలంగాణ అని, సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎంపీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్న కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీలు నిలదీస్తారన్నారు. సంస్థ వ్యాప్తంగా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు, అధికారులు, సిబ్బందిని ప్రత్యక్షంగా కలిసి కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగరేణి మాజీ ఉద్యోగి, సీపీఐ, ఏఐటీయూసీ నాయకుడు బందెల నర్సయ్యను పరామర్శించారు. ఈ ప్రచారంలో నామా వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరమణ, వనమా రాఘవ, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బదావత్ శాంతి, వైస్ చైర్మన్ దామోదర్, టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు కూసన వీరభద్రం, తొగరు రాజశేఖర్, మోరె భాస్కర్, సంకుబాపన అనుదీప్, కనుకుంట్ల శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, అన్వర్పాషా, నవతన్ పాల్గొన్నారు.