కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 7 : కాంగ్రెస్.. సింగరేణిని సంస్థను నిర్వీర్యం చేస్తే, స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లనేలను ప్రగతిబాట పట్టించి.. మా బతుకుల్లో వెలుగులు నింపారని కార్మికులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్ల బోనస్ ప్రకటించడంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తూ ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లోకి వెళ్లిందని, చివరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చిన అప్పులు కట్టలేక 49 శాతం వాటా రాసిచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ ఆ పని చేయకపోతే ఈ రోజు బీజేపీ బొగ్గు గనులను వేలం వేసేదే కాదంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి టర్నోవర్ కేవలం రూ.12 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.33 వేల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు దసరా, దీపావళి బోనస్ రూ.83 కోట్లు ఇస్తే.. తెలంగాణ వచ్చాక అది రూ. వెయ్యి కోట్లు దాటిపోయిందని కొనియాడారు. ఈ సారి రూ.1000 కోట్ల బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం గొప్పవిషయమంటున్నారు. సింగరేణి కార్మికుల బోనస్ పెంచడంతో పాటు కార్మికుల పిల్లల ఉన్నత చదువులకు రిజర్వేషన్లు, ఇండ్లు కట్టుకునేందుకు లోన్లు, కార్మికుల తల్లిదండ్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్న మహానుభావుడు కేసీఆర్ అని పొగుడుతున్నారు. నిన్న అసెంబ్లీలో సింగరేణిపై సీఎం చెప్పిన ప్రతి మాట అక్షర సత్యాలని చెబుతున్నారు. బోనస్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న సింగరేణి కార్మికుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ప్రత్యేకమైన అభిమానం..
సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు అడుగకముందే సర్వీసును 60 నుంచి 61 ఏండ్లకు పెంచారు. సింగరేణి కార్మికులపై ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన నికర లాభాల్లో వెయ్యి కోట్లను చెల్లించేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం సంతోషంగా ఉంది. కార్మికుల ముఖాల్లో సంతోషాలు చూడడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
– శ్రీనివాస్రెడ్డి, ఫిట్టర్, సెంట్రల్ వర్క్షాప్, కొత్తగూడెం కార్పొరేట్
సింగరేణికి ఢోకాలేదు..
సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ సింగరేణికి ఢోకాలేదు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ, హక్కులు కల్పిస్తూ, బోనస్ చెల్లిస్తున్నరు. ఏ కార్మిక సంఘం గెలిచినా వారితో ఏమీ కాదు. మంచి పారిశ్రామిక సంబంధాలు కొనసాగుతున్నాయి. కార్మికులకు వాటాను బోనస్గా, దీపావళి బోనస్ చెల్లించడంపై కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. గత పాలకులు సంస్థను ఆప్పుల పాలు చేశారు. తెలంగాణలో సింగరేణి అభివృద్ధి చెందుతోంది.
– పరష సంపత్, కోల్కట్టర్, శ్రీరాంఫూర్
కార్మికులపై అమితమైన ప్రేమ..
సింగరేణి కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అమితమైన ప్రేమ. అందుకే అనేక హక్కులు కల్పించారు. దీపావళి, దసరా పండుగ పురస్కరించుకొని కార్మికులకు వెయ్యి కోట్ల బోనస్ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నది. సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించడంతో పాటు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం.
– గోలెం గట్టయ్య, ఎంవీ డ్రైవర్, గోలేటి సీహెచ్పీ(బెల్లంపల్లి ఏరియా)
సంస్థను కాపాడే శక్తి కేసీఆర్కే ఉంది..
సింగరేణి సంస్థను కాపాడే శక్తి సీఎం కేసీఆర్కు మాత్రమే ఉంది. తెలంగాణ సాధించుకున్న కార్మికులకు ఆయన ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమ వసతులు కల్పిస్తున్నారు. పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు ఇస్తున్నారు. మాకు ఆయనపై పూర్తి విశ్వాసం ఉంది. ఒకవైపు సమస్యలు పరిష్కరిస్తూనే, మరోవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే వెయ్యి కోట్లు ప్రకటించడం అంటే అదృష్టంగా భావించాలి.
– రేగుంట అశోక్, ఎస్డీఎల్ ఆపరేటర్, శ్రీరాంఫూర్
కార్మికులు రుణపడి ఉన్నారు..
తెలంగాణ వచ్చిన 9 ఏండ్లుగా కార్మికులు అన్నివిధాలా సంతోషంగా ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమం, వసతులు కల్పిస్తున్న కేసీఆర్ సార్కు కార్మికులు రుణపడి ఉన్నారు. రాష్ట్రం తెచ్చుకొని లాభాలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆయన అండగా ఉంటున్నారు. కార్మికులు కూడా కేసీఆర్ సార్కు అండగా ఉండాలి. కార్మికుల కష్టం తెలుసు కాబట్టే అడుగక ముందే వెయ్యి కోట్ల బోనస్ ప్రకటించారు. ఆయనది చల్లని మనసు.
– సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు, శ్రీరాంపూర్
స్వరాష్ట్రంలో లాభపడుతున్నం..
సమైక్య రాష్ట్రంలో సింగరేణిలో హక్కులన్నీ కోల్పోయాం. స్వరాష్ట్రంలో కోల్పోయినవాటితో పాటు, కొత్తగా హక్కులు కల్పించారు కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ సార్. సకల జనుల సమ్మెలో కార్మికుల పాత్రను గుర్తించి తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడమే కాకుండా యేటా లాభాల వాటా పెంచుతూనే పోయారు. లాభాల వాటాతో పాటు దసరా, దీపావళి బోనస్ను కూడా అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద సంస్థ సింగరేణిని ముందుకు తీసుకెళ్తూ ఊహించని లాభాల్లో నడిపిస్తూ ఆ లాభాల్లో వాటాను ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరే.
– మహ్మద్ జానీ, వెల్డర్, ఆర్సీహెచ్పీ, కొత్తగూడెం ఏరియా
కోలిండియాలో లేని హక్కులు..
కోల్ ఇండియాలో సైతం లేని అనేక హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో అమలు చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనాస్ కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించడంపై కార్మికలోకం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ అనేక హక్కులు కల్పించి, అమలు చేయడం వల్ల కార్మికులు అనందంగా ఉన్నారు.
– మల్రాజు శ్రీనివాసరావు, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్
కార్మికుల పక్షపాతి కేసీఆర్..
సీఎం కేసీఆర్ సార్ సింగరేనిణి కార్మికుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. గతేడాది సంస్థ సాధించిన నికర లాభాలపై వాటా అడుగకముందే అసెంబ్లీలో ప్రకటించి, కార్మికుల పక్షపాతిగా నిలిచారు. లాభాలా వాటా యేటేటా పెంచుకుంటూ పోతున్నారు. మా కోసం ఇప్పటికే ఎన్నో చేశారు. దసరా, దీపావళి పండుగలకు ఉపయోగపడేలా చెల్లిస్తున్నారు. దీంతో పండుగలు ఘనంగా జరుపుకుంటాం.
– ఎండీ రబ్బాని పాషా, పంప్ ఆపరేటర్, సివిల్ డిపార్ట్మెంట్, కొత్తగూడెం కార్పొరేట్
టర్నోవర్తో బతుకులు టర్న్..
కాంగ్రెస్ హయాంలో సింగరేణి సంస్థ టర్నోవర్ 12 వేల కోట్లు ఉంటే ఇప్పుడు 33 వేల కోట్లు పెరిగింది. ఆ ఘనత కేసీఆర్ సార్దే. అంతేకాకుండా రూ.419 కోట్లు ఉండే సింగరేణి లాభాలను రూ.2,222 కోట్లకు పెంచిన ఘనతా ఆయనదే. లాభాల వాటాను యేటా పెంచుతూ మా బతుకుల టర్నోవర్ను మార్చిన మహనేత. వారసత్వ ఉద్యోగాల ద్వారా యువతకు జీవగంజి పోసిన మహనీయుడు.
– నరేశ్, జనరల్ మజ్దూర్, పీవీకే-5 ఇైంక్లెన్, కొత్తగూడెం ఏరియా