సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 21 : రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని కొనసాగించాలంటే సీఎంకే కేసీఆర్కే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం ఆయన సత్తుపల్లి పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలలో షాప్ టు షాప్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి షాప్కు వెళ్లి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ అందించిన పథకాలను, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను వ్యాపారులకు అందిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని కోరారు.
సుమారు ఐదు కిలోమీటర్ల మేర జరిగిన ప్రచారంలో వ్యాపారులు సండ్రకు అపూర్వ స్వాగతం పలికారు. వాటర్ బాటిళ్లు, కొబ్బరినీళ్లను అందిస్తూ వ్యాపారులు తమ అభిమానం చాటుకున్నారు. ప్రచారంలో భాగంగా సండ్ర బజ్జీలు వేస్తూ, కొబ్బరిబొండాలు కొడుతూ వ్యాపారులు, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ముస్లిం సోదరుడు ఎమ్మెల్యే సండ్రకు ఇమామి జామీను కట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మచైర్మన్ వనమా వాసు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్పాషా, ప్రవీణ్, రాఘవేందర్రావు, గఫార్, రామిశెట్టి రాజ్యలక్ష్మి,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, నాయకులు మాధురి మధు, సురేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.