తల్లాడ, ఏప్రిల్ 18: డబ్బు, అహంకారంతో రాజకీయాలు చేయలేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తండ్రి లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే అర్హత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేదని స్పష్టం చేశారు. సీఎంను టార్గెట్ చేస్తూ దుష్ట రాజకీయాలు చేస్తే సహించబోమని తేల్చిచెప్పారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. కానీ, విమర్శలు చేసే నాయకులు ఖమ్మం జిల్లాకు ఇప్పటి వరకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
మండలంలో 37 మందికి మంజూరైన రూ.15.67 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తల్లాడ సొసైటీ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనివ్వబోనంటూ కొందరు చేస్తున్న అహంకార రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్వార్థపరులు చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఈ నెల 24న మంత్రి హరీశ్రావుతో తల్లాడ, కల్లూరు మండలాలకు ఉపయోగపడేలా కల్లూరులో 24 గంటల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 21న రామానుజవరంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భధ్రరాజు, గంట శ్రీలత, రవీంద్రరెడ్డి, తాజుద్దీన్, పీ.సురేశ్, దాసురావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బద్ధం కోటిరెడ్డి, కేతినేని చలపతిరావు, నాయుడు శ్రీనివాసరావు, జీవీఆర్ తదితరులు పాల్గొన్నారు.