కల్లూరు, నవంబర్ 6: 60 ఏళ్లలో కాలంలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కేవలం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని కోరారు. ప్రజలకు అవసరమైన పథకాలను అందిస్తూ ప్రజా ప్రభుత్వంగా బీఆర్ఎస్ సర్కారు పేరు పొందిందని గుర్తుచేశారు. కల్లూరు మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. ఓబుల్రావుబంజర్, యజ్ఞనారాయణపురం, ముచ్చవరం, బాలాజీనగర్, కల్లూరు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసందోహం నడుమ డప్పువాయిద్యాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సండ్రకు ప్రజలు, మహిళలు, నాయకులు పూలు చల్లుతూ నీరాజనం పలికారు. ఎమ్మెల్యే సండ్ర కూడా ప్రతి ఇంటికీ, ప్రతి దుకాణానికీ వెళ్లి వెళ్లి ఓటర్లకు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిని గమనించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాల్లో కన్పించేవారని, ఎన్నికలు ముగిశాక పత్తా లేకుండా వెళ్లే వారని విమర్శించారు. తాను మాత్రం స్థానికంగానే ఉంటూ అందరి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నానని గుర్తుచేశారు. మీలో ఒకరిగా ఉంటున్న తనను ఇక్కడి ప్రజలు మూడు ఎన్నికల్లోనూ ఆదరించారని, ఈ సారి కూడా ఆశీర్వదించి మరింత అభివృద్ధికి అవకాశం కల్పించుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో దళితబంధు పథకాన్ని నియోజకవర్గంలోని దళితులందరికీ అందిస్తామని అన్నారు. మ్యానిఫెస్టోలోని పథకాలను కూడా సంక్రాంతి నాటికి అమలు చేయడం ప్రారంభిస్తామని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి మద్దతు తెలపాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు లక్కినేని నీరజ రఘు, మాన్సింగ్, గంగవరపు వెంకటేశ్వరావు, రావి సూర్యనారాయణ, బీరవల్లి రఘు, కట్టా అజయ్బాబు, పాలెపు రామారావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ, బొప్పన రామారావు, మద్దినేని శ్రీనివాసరావు, కాటేపలి రజనీ తదితరులు పాల్గొన్నారు.