– ప్రభుత్వానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచన
ఖమ్మం, జూలై 30 : వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాల్వలు పూడుకుపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. వర్షాకాలంలో పారిశుధ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా మందుల పిచికారీని క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు. వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని పేర్కొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు పని చేయాలని, పారిశుధ్యంపై ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.