– నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
– సున్నిత ప్రాంతాల్లో గణేష్ మండపాల పరిశీలన
నీలగిరి, సెప్టెంబర్ 16 : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్లగొండ పట్టణంలోని కమ్యూనల్గా సున్నితమైన, మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎస్పీ బుధవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. మండపాల వద్ద 24 గంటల పాటు వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని, నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని, మండపం పరిసరాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపాన్ని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు.
అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు, జనరేటర్లు తదితరాలను సురక్షితంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద అవసరమైన అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మైనర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు గైర్హాజరై గణేష్ మండపాల వద్ద ఉండకుండా మండపాల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు గైర్హాజరై గణేష్ మండపాల వద్ద కనిపించే విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, మండపాల నిర్వాహకుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి, విద్య ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలిపారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ను నిబంధనల ప్రకారం మాత్రమే వినియోగించాలని, నిర్ణీత సమయం అనంతరం శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఎస్పీ తెలిపారు. ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి పాటలు, నినాదాలు లేదా కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
మండపాలకు వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాల పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, ఏదైనా సమస్య లేదా అవాంఛనీయ పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, వాటిని ఫార్వర్డ్ చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసుల నిరంతర నిఘా, పెట్రోలింగ్, బందోబస్తు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ కే.శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ నాగరాజు, నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.