కూసుమంచి, ఏప్రిల్ 4: కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగర్ జలాలు రావడమేంటని అనుకుంటున్నారా? నిజమే.. పాలేరు చుట్టూ రెండు జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కాలువపై పోలీసులు కాపలా ఉంటున్నారు. ఇరిగేషన్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం సాగర్లో వదిలిన కృష్ణా జలాలు గురువారం తెల్లవారుజామున 5 గంటలకు పాలేరుకు చేరుకున్నాయి. ఖమ్మం ఆర్డీవో గణేశ్ గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ మంగలపుడి వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, ఏసీపీ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ సురేశ్కుమార్ సంబంధిత శాఖల సిబ్బందితో కలిసి రంగుల బ్రిడ్జి వద్ద నీటికోసం వేచి ఉండగా సూర్యాపేట జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, పోలీస్ అధికారులు జిల్లా సరిహద్దు వరకు నీరు వచ్చే దాకా ఉండి జిల్లా అధికారులతో చర్చించి వెళ్లారు. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా సాగర్ జలాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య పాలేరుకు సాగర్ జలాలను చేర్చారు. ఆర్డీవో గణేశ్ పర్యవేక్షణలో పలువురు అధికారులు పాలేరు చుట్టూ ఉన్న గ్రామాల్లోకి వెళ్లి ఎవరైనా నీటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందేమోనని, మోటర్ల ద్వారా నీటిని తోడే అవకాశం ఉందేమోనని పరిశీలించారు. కొన్ని సరిహద్దు గ్రామాలను ఆర్డీవో, ఈఈలు కూడా పరిశీలించారు.
సాగర్లో 4,900 క్యూసెక్కుల నీటిని వదలగా గురువారం తెల్లవారుజామున పాలేరుకు 1,000 క్యూసెక్కుల నీరు చేరుకుంది. క్రమంగా పెరిగి సాయంత్రానికి 3,100 క్యూసెక్కులు వస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పాలేరు మట్టం క్రమంగా పెరగనుంది. 5.50 అడుగుల అట్టడుగు స్థాయికి పడిపోయిన పాలేరు నీటిమట్టం మరో రెండు రోజుల్లో 10 అడుగుల వరకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. పాలేరుకు సాగర్ నుంచి ఎక్కడా ట్యాంపరింగ్లు లేకుండా 2 టీఎంసీల నీటిని తీసుకోగలిగితెనే వేసవి తాగునీటి గండం నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదంటి మళ్లీ మరో నెల రోజుల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యే ప్రమాదమూ లేకపోలేదు.