భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (నమస్తే తెలంగాణ) /ఖమ్మం వ్యవసాయం : మొన్ననే తొలకరి పలకరించింది. వానరాకతో పుడమి పులకరించింది. రైతు మనసు తేలికైంది. ఎవుసం షురువైంది. సాగుకు దుక్కులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పంట పెట్టుబడికీ రాష్ట్ర ప్రభుత్వం సాయమూ అందిస్తున్నది. సోమవారం తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎకరా లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అయింది. పది రోజుల్లో పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో సొమ్ము జమ కానున్నది. ఇక వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. సాగు పండుగ చేస్తుంటే ప్రభుత్వం చూసి మురిసిపోనున్నది. రైతుతోపాటు ఇంటిల్లిపాదీ పొలం పనుల్లో బిజీ కానున్నారు.
వానకాలం సీజన్కు సంబంధించిన రైతుబంధు సోమవారం నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నది. తొలిరోజు ఖమ్మం జిల్లాలో ఎకరాలోపు ఉన్న 1,18,126 మంది రైతుల ఖాతాల్లో రూ.36.90 కోట్లు, భద్రాద్రి జిల్లాలో 65,051 మంది రైతుల ఖాతాల్లో రూ.36.69 కోట్లు జమయ్యాయి. సొమ్ము జమ అయినట్లు ఉదయం 11 గంటల నుంచే రైతుల మొబైల్స్కు సందేశాలు రావడం ప్రారంభమైంది. కొందరు రైతులు వెంటనే బ్యాంక్లు, ఏటీఎంలకు పరుగులు తీసి సొమ్ము బయటకు తీశారు. మంగళవారం ఎకరాకు పైగా రెండెకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానున్నది.
ఖమ్మం జిల్లాలో ప్రక్రియ ఇలా..
ప్రక్రియ పదిరోజుల పాటు కొనసాగనున్నది. రెండోరోజు మంగళవారం 85,406 మంది ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున సొమ్ము జమ కానున్నది. మూడోరోజు 3-4 ఎకరాల లోపు భూమి ఉన్న 28,081 మంది, నాలుగో రోజు 4-5 ఎకరాలలోపు భూమి కలిగిన 17,201 మంది, ఐదోరోజు 5-6 ఎకరాలలోపు భూమి కలిగిన 11,015 మంది, ఆరోరోజు 6-7 ఎకరాలలోపు భూమి కలిగిన 5,271 మంది, ఏడోరోజు 7-8 ఎకరాలలోపు భూమి కలిగిన 3,626 మంది, ఎనిమిదో రోజు 8-9 ఎకరాలలోపు భూమి కలిగిన 2,367 మంది, తొమ్మిదోరోజు 9-10 ఎకరాలలోపు భూమి కలిగిన 1,956 మంది, పదోరోజు 10 ఎకరాలకు పైబడి భూమి ఉన్న 5,039 మంది ఖాతాల్లో సొమ్ము జమ కానున్నది.
పొలంలో పనుల్లో బిజీ
నాకు ఎకరా పొలం ఉంది. మొదటి రోజే నా ఖాతాలో రైతుబంధు జమ అ యింది. వచ్చిన సొమ్మును పంటకు పెట్టుబడిగా వినియోగిస్తాను. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నాను. పొలం పనుల్లో నిమగ్నమయ్యాను. సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారు. అన్న మాటను నిలబెట్టుకుంటూ ఐదేండ్ల నుంచి పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
– బోగి స్వామి, రైతు, తిప్పనపల్లి, చండ్రుగొండ మండలం
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
వానకాలం సీజన్ మొదలైంది. సాగుకు వేళ అయింది. సరైన అదునులో సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తున్నారు. తొలిరోజే నాకున్న ఎకరా భూమికి సంబంధించిన సొమ్ము ఖాతాలో జమ అయింది. సొమ్మును పంట పెట్టుబడికి వినియోగిస్తాను. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– కావూరి సరోజిని, మహిళా రైతు, బస్వాపురం, తల్లాడ మండలం
సీజన్కు ముందే పెట్టుబడి సాయం..
ఐదేండ్ల నుంచి సీజన్కు ముందే సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతుబంధు కోసం ఇక ఎవరినీ అడగాల్సిన పని లేదు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడగానే పది రోజుల్లో రైతులందరికీ సొమ్ము అందుతున్నది. సొమ్ము జమ అయినట్లు మొబైల్కు మెసెజ్ రాగానే ఏటీఎంకు వెళ్లి పైసలు తీసుకుంటున్నాం. దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాం.
–పెరుమాళ్ల కృష్ణయ్య, రైతు, చల్లసముద్రం, ఇల్లెందు మండలం
రైతులకు చేసిన సాయం వృథా కాదు..
సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన విధంగానే ప్రతి సీజన్కు ముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ చేయిస్తున్నారు. నాకు ఎకరా భూమి ఉంది. తొలిరోజే నా బ్యాంక్ ఖాతాలో రూ.5 వేల పెట్టుబడి సాయం జమ అయింది. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ సారు రైతుల కష్టాలు చూశారు. రాష్ట్రం వచ్చినంక మాకు సాయం చేస్తున్నారు. రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు. రైతులకు చేసిన సాయం ఎప్పటికీ వృథా కాదు. రైతులంతా కేసీఆర్ పక్షాన నిలబడతారు.
– ఎస్కే రాజా ఖుదాన్బీ, మహిళా రైతు, తాళ్లపెంట, పెనుబల్లి మండలం