ఖమ్మం, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటినా రైతుబంధు జాడ కానరావడం లేదు. యాసంగి వరి పంట పొట్ట దశకొచ్చినా అన్నదాతలకు పంటల పెట్టుబడిసాయం పూర్తిస్థాయిలో అందలేదు. గడిచిన 60 రోజుల్లో కేవలం మూడు ఎకరాల్లోపు వ్యవసాయ భూమికి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. అది కూడా పాత విధానం ప్రకారం రూ.5 వేల చొప్పున మాత్రమే జమ చేసింది. ఫలితంగా అన్నదాతలంరూ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం కింద పంటల పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఆ పథకంపైనా, ఆ హామీపైనా స్పందించలేదు. ఈ యాసంగిలో పాత పద్ధతిలో ఎకరానికి రూ.5,000 ప్రకారం జిల్లాలో 3,42,803 మంది రైతుల ఖాతాల్లో రూ.370.30 కోట్లను జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ 3 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న 2,58,286 మంది రైతులకు అదే రూ.5,000 వేల చొప్పున రూ.162.48 కోట్లను మాత్రమే జమ చేశారు. దీంతో మిగిలిన రైతులకు రైతుబంధు సాయం అందే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం సాగు విస్తీర్ణంపై కూడా పడింది. పంటల సాగు గణనీయంగా తగ్గింది. కొందరు రైతులు మాత్రం రైతుబంధు సాయం కోసం చూసీచూసీ నిరాశ చెందారు. పాత విధానం ప్రకారం వడ్డీ వ్యాపారులను, కమీషన్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఇంకా రైతుబంధు అందని రైతులు సుమారు లక్ష మంది ఉన్నారు. వారికి మరో రూ.200 కోట్ల వరకూ పంటల పెట్టుబడి సాయం అందాల్సి ఉంది.
సకాలంలో పంటల పెట్టుబడి సాయం చేతికి అందకపోవడంతో ఆ ప్రభావం యాసంగి సాగుపై తీవ్రంగా కన్పిస్తోంది. సాధారణంగా ఏటా యాసంగిలో వరి, మక్క సహా ఇతర పంటలను కలిపి సుమారుగా 3 లక్షల ఎకరాల్లో జిల్లా రైఉలు సాగు చేస్తుంటారు. 2019-20లో 3.02 లక్షల ఎకరాలు, 2020-21లో 3.37 లక్షల ఎకరాలు, 2021-22లో 2.11 లక్షల ఎకరాలు, 2022-23లో 3.15 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు. అయితే 2023-24 సంవత్సరానికి గాను కేవలం 1,56,406 ఎకరాల్లో మాత్రమే రైతులు వివిధ పంటలను సాగుచేస్తున్నారు. వీటిలో వరి 85 వేల ఎకరాలు, మక్క 60 వేల ఎకరాల్లో సాగవుతోంది.
సాగు విస్తీర్ణం తగ్గుదలకు సమయానికి రైతుబంధు సాయం అందకపోవడంతోపాటు సాగునీటి ఎద్దడి కూడా తోడైంది. జిల్లాలో మొత్తం 21 మండలాలుండగా వీటిలో 16 మండలాలు నాగార్జునసాగర్ ఆయకట్టు కిందకు వస్తాయి. ఆయకట్టు రైతులందరూ రెండు సీజన్లలోనూ ఈ నీటి మీదనే ఆధారపడతారు. సుమారు 1.50 లక్షల ఎకరాలను సాగు చేస్తారు. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంతో అక్కడి నుంచి కూడా సాగునీరు అందించే పరిస్థితి లేకుండా పోయింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుంది కాంగ్రెస్ సర్కారు పాలన. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటినా రైతుబంధు జాడ కానరావడం లేదు. యాసంగి వరి పంట పొట్ట దశకొచ్చినా అన్నదాతలకు పంటల పెట్టుబడిసాయం పూర్తిస్థాయిలో అందలేదు. గడిచిన 60 రోజుల్లో కేవలం మూడు ఎకరాల్లోపు వ్యవసాయ భూమికి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. అది కూడా పాత విధానం ప్రకారం రూ.5 వేల చొప్పున మాత్రమే జమ చేసింది. ఫలితంగా అన్నదాతలంరూ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం కింద పంటల పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15,000కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఆ పథకంపైనా, ఆ హామీపైనా స్పందించలేదు. జిల్లావ్యాప్తంగా 1,78,541 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 1,28,520 మంది ఖాతాల్లో మాత్రమే రైతుబంధు జమ అయింది. రైతుల ఖాతాల్లో రూ.269 కోట్లు జమ కావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.121 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. అది కూడా కేవలం రెండు నుంచి మూడు ఎకరాలున్న వారికి మాత్రమే. ఐదు ఎకరాలకు పైగా అంతకు మించి భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందనేలేదు. దీంతో వారంతా పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం సీజన్కు ముందే రైతుబంధు ఇచ్చేది. సరైన సమయంలో పెట్టుబడి సాయం అందడంతో రైతులకు ఇబ్బందులు ఉండేవి కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదును దాటినా సాయం అందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుబంధు అందజేయాలి. నేను వడ్డీకి రూ.20 వేలు అప్పు తెచ్చి పంట ఖర్చులకు వాడుతున్నాను.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ రైతుబంధు ఆలస్యం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంట సీజన్ వెళ్లిపోతున్నా రైతులకు సాయం అందించడం లేదు. నాకు ఐదు ఎకరాలు పొలం ఉంది. రైతుబంధు చేతికి వస్తుందని నేను సాగు ప్రారంభించాను. కానీ సాయం అందలేదు. సాయం ఇవ్వలేమని ముందే ప్రభుత్వం చెప్తే నాకు చేతనైనంతలో సాగు చేసేవాడిని. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తే మంచి జరుగుతుంది. లేదంటే రైతులు ఆగమైపోతరు. అసలుకే మోసం వచ్చి రైతు దివాలా తీస్తాడు.
ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే రైతులకు మేలు చేసింది. ప్రతిసారి సీజన్కు ముందే రైతుబంధు అందేది. ఆ సొమ్ముతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనేవాళ్లు. దీంతో సాగు సాఫీగా జరిగేది. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేదు. మళ్లీ పాత రోజులే వచ్చినట్లు అనిపిస్తున్నది. రైతులు మళ్లీ మిత్తి వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇట్లా అయితే రైతు ఏం వ్యవసాయం చేస్తాడు? ఏం పంటలు పండిస్తాడు ?
నాకు ఆరు ఎకరాల భూమి ఉం ది. దానిలో నేను వరి పండిస్తున్నాను. రాష్ట్రప్రభుత్వం ఈ సీజన్లో కేవలం రెండు మూడు ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే సొమ్ము జమ చేసింది. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు అన్యాయమే జరిగింది. రైతుబంధు సొమ్ము అందక వేలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. సొమ్ము అందదేమోనని, అప్పులు తీసుకురావాలేమోనని ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు మంచి జరుగుద్ది అనుకున్నాం. కనీసం అదునుకు రైతుబంధు ఇస్తది అనుకున్నాం. కానీ మా ఆశలు అడియాశలు అయ్యాయి. చేతిల పైసలు లేకుండా వ్యవసాయం ఎట్ల చేయాలె. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతుల పరిస్థితి మంచిగుండె. టయానికి సొమ్ము అందేది. ఎరువులు, విత్తనాలు.. ఇలా ఏవంటే అవి వెంటనే కొనుక్కునేటోళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటలేదు. పంట సాయం ఇయ్యకుంటే రైతులు ఆగమైతరు.
కేసీఆర్ ప్రభుత్వంలో సాగు పండుగ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాత్రం సాగు దండగ అనిపిస్తున్నది. అదును దాటిపోతున్నా కొందరు రైతులకు మాత్రమే సొమ్ము ఇచ్చింది. మిగిలిన రైతులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేకపోయింది. రైతుబంధు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించకోకపోవడం బాధాకరం. ఎరువులు, కూలీల ఖర్చులకు రైతులు ఎక్కడి నుంచి సొమ్ము తేవాలి? ఎలా సాగు చేయాలి?
ఆరు నూరైనా రైతుబంధు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది. అధికారాన్ని చేపట్టి రెండు నెలలైనా రైతుబంధు అందరికీ ఇవ్వలేదు. సొమ్ము అందిన వాళ్లు సాగు చేసుకుంటున్నారు. మిగతా వాళ్లు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇచ్చేది. సొమ్ము సకాలంలో అందడంతో రైతుల అవసరాలు వెంటనే తీరేవి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తున్నది. పంట సీజన్ అయిపోతున్నా చేతికి పైసలు ఇవ్వకపోతే రైతులు ఎట్లా సాగు చేస్తరు. పెట్టుబడికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తరు.
కేసీఆర్ ప్రభుత్వంలో పంట పెట్టుబడి సాయం అదునుకు ముందే రైతుబంధు అందేది. ఏడాదిలో రెండుసార్లు ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజులైనా రైతుబంధు సొమ్ము అందలేదు. రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతుబంధు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రెండు విడతలుగా రైతుబంధు అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సాగు కాలం దాటిపోతున్నా పైసలు జమ చేయలేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రైతులు సొమ్ము తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకున్న ఆరు ఎకరాలకు రైతుబంధు అందాల్సి ఉన్నది.
కేసీఆర్ ప్రభుత్వం ఏటా సీజన్కు ముందే రైతబంధు సొమ్ము అందేది. రైతులు దర్జాగా, సంతోషంగా వ్యవసాయం చేసుకోనేటోళ్లం. నాడు నేను సకాలంలో పంటలను వేసుకునేవాడిని. పంట పెట్టుబడి కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. నాకు 4.2 ఎకరాల భూమి ఉన్నది. నాకు బొబ్బర్లు, మినుములు, పెసర్లు సాగు చేయాలని ఉంది. కానీ చేతిలో సొమ్ము లేదు. ఏం చేయాలో తెలియడంలేదు. రాష్ట్రప్రభుత్వం వెంటనే రైతుబంధు డబ్బులను విడుదల చేయాలి.