Rice Price | వర్షాభావ పరిస్థితులు.. సాగర్ ఎడమ కాల్వకు తక్కువ మొత్తంలో సాగు జలాలు.. తుపాన్ ప్రభావం.. తక్కువ మోతాదులో ధాన్యం దిగుబడులు.. ఇలా కారణం ఏదైతేనేం.. బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి.. అమాంతం పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి.. ధరలు గరిష్ఠంగా రూ.800 వరకు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వానకాలంలో రైతులు జిల్లావ్యాప్తంగా 3,10,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది 2,83,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టారు. క్వింటా హెచ్ఎంటీ రకం బియ్యానికి ప్రస్తుతం మార్కెట్లో రూ.5,000 ధర పలుకుతున్నది. అలాగే రా బియ్యం క్వింటాకు రూ. 4,700 నుంచి రూ.4,800 వరకు డిమాండ్ ఉన్నది.
ఖమ్మం, డిసెంబర్ 16: జిల్లాలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల కాకపోవడంతోపాటు వర్షాభావ పరిస్థితులు, తుపాన్ కారణంగా ఈ ఏడాది పంట ఎక్కువగా దెబ్బతిన్నది. దిగుబడులు అమాంతం తగ్గాయి. ఆ ప్రభావం బియ్యం ధరలపై పడినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. గత నెలకు ఈ నెలకు క్వింటా బియ్యం ధరలు గరిష్ఠంగా రూ.800 వరకు పెరిగాయి. గత వానకాలంలో రైతులుజిల్లావ్యాప్తంగా 3,10,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది 2,83, 000 ఎకరాల్లో సాగు చేపట్టారు.
ధరల పెరుగుదల ఇలా..
ప్రస్తుతం మార్కెట్లో జైశ్రీరాం రకం ధాన్యం క్వింటా ధర రూ.3,500 ఉండగా, హెచ్ఎంటీ రకం ధాన్యం రూ.3,200, తెలంగాణ సాంబ (ఆర్ఎన్ఆర్) రూ.3,100 రూ.3200, బీపీటీలు రూ.2,800, జేజే రకం రూ.2,500 పలుకుతున్నది. ఇవే రకాల ధాన్యానికి గత నెలలో రూ.300 వరకు ధర తక్కువగా ఉన్నది. అలాగే హెచ్ఎంటీ రకం బియ్యం ధర క్వింటాకు రూ.5,000 ఉండగా , రా బియ్యం క్వింటా రూ. 4,700 రూ.4,800 పలుకుతున్నది.
సాగునీరు లేక దిగుబడులు తగ్గాయి..
గతేడాది ఖరీఫ్ కంటే కూడా ఈ ఏడాది ఖరీఫ్లో వరి సాగు అంతా ఆశాజనకంగా లేదు. పంట దిగుబడులు తగ్గాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు రాకపోవడంతో పంట వేస్తే నష్ట పోతామనే భయంతో సాగర్ ఆయకట్టు రైతులు వరి వేయలేదు. దీనికి తోడు తుపాన్ కారణంగా కొంత పంట దెబ్బతింది. ఇలా పలు కారణాల రీత్యా ఆశించిన స్థాయిలో ధాన్యం దిగుబడి రాలేదు..
– విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఖమ్మం
బియ్యం ధరలు చూస్తుంటే భయం వేస్తుంది
రోజురోజుకు పెరుగుతున్న బియ్యం ధరలు చూస్తుంటే భయం వేస్తుంది. వ్యాపారులందరూ కుమ్మక్కై బియ్యం ధరలను పెంచుతున్నారనిపిస్తున్నది. ఈ ఏడాదివరి బాగానే పండింది కదా. పేద ప్రజల పొట్టకొట్టడమే వ్యాపారులు పనిగా మారింది. కిలో బియ్యం రూ.60- 70 పెట్టి కొనాలంటే నిరుపేదలకు ఇబ్బందే.
– ఆర్.సోమమ్మ, నగరవాసి, ఖమ్మం
సగం డబ్బులు బియ్యానికే సరిపోతున్నవి
రోజు చేసే కష్టంలో సగం డబ్బులు బియ్యానికే సరిపోతున్నాయి. బియ్యం ధరలు ఇలా ఉంటే ఇక నూనె, పప్పుతోపాటు ఇతర సరుకులు, కూరగాయలు ఏం పెట్టి కొనాలి? పిల్లలను ఎలా చదివించుకోవాలి? ఎలా బతకాలి? ఒకప్పుడు కిలో బియ్యం చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉండేవి. నాడు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
– ఎన్.ప్రేమానందం, నగరవాసి, ఖమ్మం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించాలి..
ప్రస్తుతం పావు క్వింటా బియ్యం బస్తా మార్కెట్లో రూ.1,500 వరకు ఉంది. బియ్యం ధరలు ఇంకా పెరుగుతాయట. రాను రాను ధరలు మరింత పెరుగుతాయని కిరాణ దుకాణా యజమానులు అంటున్నారు. పెరుగుతున్న బియ్యం ధరలతో పేదలకు ఇబ్బందే. పెరుగుతున్న ధరలను వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలి.
– ఎ.సుహాసిని, గృహిణి, ఖమ్మం