ఖమ్మం వ్యవసాయం, మే 17 : వానకాలం సాగుకు సంబంధించిన సమీక్షా సమావేశం ఈ నెల19వ తేదీన నిర్వహించనున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు బి.సరిత, అభిమన్యుడు తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం సమావేశ మందిరంలో డీఏవో సరిత అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయం అధికారి సింగిరెడ్డితోపాటు ఇరు జిల్లాలకు చెందిన వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయశాఖ అధికారులు, జిల్లా ఉద్యానశాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఏవోలు మాట్లాడుతూ వానకాలం సాగుకు సన్నద్ధం, ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ సాగు విస్తీర్ణం పెంపు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొంటారని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానశాఖలకు సంబంధించిన ఏఈవోలు, హెచ్ఈవోలు, ఏవోలు, హెచ్వోలు, డివిజన్ సహాయ సంచాలకులు, జిల్లా కార్యాలయం అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. ఉదయం 10:30 నిమిషాలకు ఖమ్మం నగరం శివారులోని ఎస్ఆర్ కన్వెన్షన్లో సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. సమావేశంలో ఖమ్మం జిల్లా ఉద్యానశాఖ అధికారి జి.అనసూయతోపాటు పలువురు ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.