కాంగ్రెస్ హయాంలో ఎవుసం చేయాలంటే ఏడుపొచ్చేది. కరెంటు, నీల్లు ఉండేటియి కాదు. కరెంటు ఎప్పుడొస్తదో తెల్వదు, కరెంటోల్లకు ఫోన్ చేస్తే ఎత్తేటోల్లు కాదు. నకిలీ విత్తనాలతో ఎంతో గోస పడ్డం.. చానా ఖర్చుపెట్టి కొని నాటిన విత్తనాలు మొలకెత్తక, పంట ఎదిగాక కాత రాక ఎన్నో ఇబ్బందులు పడ్డం. అధికారులకు చెప్పినా పట్టంచుకునేటోల్లు కాదు. కానీ ఇయ్యాల నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు పెట్టి జైల్లో పెడుతున్నరు. ఎరువుల కోసం అయితే బాధలు చెప్పనలవి కాదు. రైతులను దొంగలను కొట్టినట్లు కొట్టిన్రు పోలీసోల్లు.. ఎరువుల కోసం పోతే. చెప్పులు లైన్లో ఉంచి తీసుకునేటోల్లం. ఇయ్యాల కేసీఆర్ సారు చెయ్యబట్టి హాయిగున్నం కరెంటు, నీల్లు మస్తుగుండి .. ఏ పంట అంటే ఆ పంట పండిస్తున్నం .. మల్లా ఆ చీకటి రోజులు మాకొద్దు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్ సరిపోతుందని చెబుతూ రైతులపట్ల ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు. ఏ రైతు అయినా 10 హెచ్పీ మోటార్లు వాడేందుకు అవకాశం లేదు. 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు మాత్రమే వాడతాం. దీనివల్ల కావాల్సినంత నీళ్లు పొలాలకు చేరుతుంది. 10 హెచ్పీ మోటారు అయితే బోరుల్లో, బావుల్లో నీరంతా ఒకేసారి బయటకు వచ్చి ఉపయోగం లేకుండా పోతుంది. 3 గంటలు కరెంట్ అంటున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో రైతులే ఓడిస్తారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకుంటాం.
పంటలకు సరిపడా నీరు అందించాలన్నా వ్యవసాయం బాగుండాలన్నా నిరంతర విద్యుత్ అనుకూలిస్తుంది. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతు రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయి. ధరణితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిమిషాల్లో పూర్తవడంతో పాటు, పారదర్శకత అవలంభిస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు వేర్వేరుగా ఉండడంతో రికార్డుల నిర్వహణ భారంగా ఉండేది. ధరణి పోర్టల్ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం.
ప్రస్తుతం తెలంగాణ సర్కారు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తో విద్యుత్ వైరింగ్ కాలిపోయే సమస్య తగ్గింది. గతంలో ఎప్పుడు కరెంట్ వచ్చేది, ఎప్పుడు పోయేది తెలియక రైతులు ఆటోమ్యాటిక్ స్విచ్లు వాడకం ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు టపాసుల్లా కాలిపోయేవి. నిత్యం వైరింగ్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్ కొనసాగడంతో రైతాంగానికి ఆ సమస్యలు తీరి ఆర్థిక భారం తప్పింది.
రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలంటున్నారు. ఎట్ల సరిపోతుంది. ఆయన మతి తప్పి మాట్లాడుతున్నాడు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నాం. కాంగ్రెస్ హయాంలో గతంలో కరెంట్ కోసం ఎన్నో సార్లు రైతులంతా రోడ్డెక్కి ఆందోళన చేశారు. కానీ ఏనాడు పట్టించుకోలేదు. కాంగ్రెసోళ్లు ఢిల్లీ లీడర్ల చేతుల్లో కీలు బొమ్మలే. తెలంగాణలో కాంగ్రెస్ రావడం కల. తెలంగాణ నిలబడాలంటే ఇక్కడ ప్రజలను ప్రేమించే లీడర్ రావాలి. అది కేసీఆర్ ఒక్కరితోనే సాధ్యం.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులకు కరెంట్ కష్టాలు తీరాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియకుండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ ద్వారా రైతులను ఆదుకున్నారు. రాత్రుళ్లు పొలాలకు వెళ్లకుండా పగలే పొలాలకు నీళ్లు పెట్టుకునే విధంగా చూసి రైతును రాజును చేశారు. రైతుల సమస్యలు తీరాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలి.
ఇయ్యాల ఎటువంటి బ్రోకర్లు లేకుండా మా పంటను మేము అమ్ముకుంటున్నం. మా ఊల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొంటున్నది. కానీ కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి ఉన్నదా పేరుకే కొనుగోలు కేంద్రాలు కానీ గిట్టుబాటు ధర ఇచ్చేటోల్లు కాదు. ఆ పత్రాలు, ఈ పత్రాలు కావాలని అడిగేటోల్లు కానీ కేసీఆర్ సారు వచ్చినంక తెచ్చిన ధరణి వల్ల ఏ కాయితాలు లేకుండానే మేము మా పంటను అమ్ముకుంటున్నాము. మధ్యలో దళారి లేడు, లంచం లేదు. పట్టాదార్ పాస్పుస్తకం, బ్యాంక్ అకౌంట్ ఇస్తే చాలు మా అకౌంట్లో డబ్బులు పడుతున్నయి. కానీ గతంలో పంటను అమ్మటానికి నానా గోస పడి అమ్మిన తర్వాత డబ్బులు చేతిలోకి రావడానికి ఎంతో కొంత ముట్టజెపితే కాని వచ్చేటియి కాదు. కానీ ఇయ్యాల ఆ పరిస్థితి లేదు. ఇదంతా కూడా ధరణి పోర్టల్ వల్లనే సాధ్యమైంది.
ముదిగొండ, నవంబర్ 27 : ధరణి పోర్టల్ ఉండబట్టి రైతులకు ఏ పని కావాలన్నా క్షణాల్లో అయిపోతున్నది ధరణి తీసేస్తే మల్లా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. గతంలో వీఆర్వోలు ఉన్నప్పుడు కాలం బాగాలేక తుపానో, కరువో వచ్చి పంట నష్టపోతే పరిహారం ఇయ్యటానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేటిది. పై నుంచి పరిహారం వచ్చినా ఈడ రికార్డులో మా పేరు లేక పైసలు ఇయ్యం అనేటోల్లు. పట్టా పుస్తకం ఉన్నా కూడా రికార్డులో నీ పేరు లేదు తహసీల్దార్ రాయించుకు రాపో అనేటోల్లు, వీఆర్వో,, ఆర్ఐ, డీటీ రాసిన తర్వాత కానీ తహసీల్దార్ రాసేటోడు కాదు. ఇయ్యన్నీ అయ్యేసరికి ఎంత సమయం పట్టేదో కూడా తెలియదు ఒక్కోసారి యాష్టకొచ్చి పైసలు రాకపోతే పొయినయిలే అనిపిచ్చేది. కానీ ఇయ్యాల యాడికి పోయినా ఫోన్లో, కంప్యూటర్లో చూసి పని చేస్తున్నరు.. నీకు భూమి లేదు అనేటోడు లేడు ఇయ్యాల.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తో ఏ కష్టం లేకుండా పంటలను పండించుకోగలుగుతున్నాం. 10 హెచ్పీ మోటర్లు వాడకం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాంగ్రెసోళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ రైతులను ఆగంజేస్తున్నారు. 10 హెచ్పీ మోటర్ పరిశ్రమలల్లో వాడుతారు. మోటర్ రైతులు పెట్టాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చులు ఎవరు భరించాలి. కాంగ్రెస్ రైతులను అయోమయంలో పడేస్తుంది. కాంగ్రెస్ నాయకులు రైతులను ముంచేందుకు పూటకోమాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న కరెంట్ మంచిగా ఉంది.