ఖమ్మం కమాన్బజార్, జూన్ 17 : పిల్లలు రావడం లేదనే సాకుతో పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. దీంతో విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అనంతరం సంఘ నాయకులను పోలీసులు టూ టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు ప్రభుత్వ విధానాలతో ఇప్పుడు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల విద్యారంగానికి ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. విద్య హకు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 25 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు మాగం లోకేశ్, బుర్ర మనోజ్, పవన్, గోపి, రాము, ఉమేశ్, నరేందర్, సాయి, అభిరామ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.