దళితుల జీవితాల్లో కొత్త వెలుగు ప్రకాశిస్తున్నది.. ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబాలను ఆత్మబంధువై ఆదుకున్నారు. దశాబ్దాలుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వారి బతుకులను ‘దళితబంధు’తో సమూలంగా మార్చేశారు. ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.10 లక్షలు మంజూరు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించారు. దీంతో సరికొత్త జీవనం ఆరంభమైంది. నాడు కూలీలుగా పనిచేసి కూటికి వెళ్లేసుకునే రోజుల నుంచి.. నేడు యజమానులుగా మారి ఆర్థికంగా ఎదుగుతున్నారు.. ఖమ్మం జిల్లాలో నియోజకవర్గానికి 100 చొప్పున ఐదు నియోజకవర్గాల్లో 483 మందిని, పైలట్ ప్రాజెక్టు చింతకాని మండలంలో 3,280 మందిని ఎంపిక చేసి యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి చేశారు. మొదటి, రెండు విడతల్లో 3,945 కుటుంబాల ఖాతాలకు రూ.394.50 కోట్లు విడుదల చేయడంతో లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దర్జాగా కాలరెగరేసి తిరుగుతున్నారు.
– ఖమ్మం, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రైవేట్ ఉద్యోగం మానేసి.. నాన్నతో కలిసి..
చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన కన్నెపోగు పెద్దపుల్లయ్య దళితబంధు సాయంతో డ్రోన్ కొనుగోలు చేశాడు. పెద్దపుల్లయ్య చిన్నకుమారుడు వీరబాబు గత సంవత్సరం బీటెక్ పూర్తిచేసి ప్రైవేట్ కంపెనీలో చాలీచాలని జీతంతో పని చేస్తున్నాడు. తండ్రికి డ్రోన్ ఆపరేట్ రాకపోవడంతో వీరబాబు ఉద్యోగం మానేసి డ్రోన్ ఆపరేటింగ్ నేర్చుకొని సాగులోకి దిగాడు. తండ్రికి ఆసరాగా ఉంటూ పలు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి డ్రోన్ ద్వారా వరి, మొక్కజొన్న, మామిడి, అపరాలు, మిర్చి తదితర పంటల్లో పురుగు, కాంప్లెక్స్ మందులు స్ప్రే చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.
డ్రోన్ పరికరంతో సరాసరి నెలకు రూ.60 వేలు, సీజన్లో రోజుకు రూ.10 వేల వరకు సంపాదిస్తున్నట్లు ఆనందంగా పేర్కొన్నాడు. దళితబంధు తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలిపిందని చెప్పాడు. తన పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు సైతం దళితబంధు సాయంతో కొణిజర్లలో రక్తపరీక్షల కేంద్రం నెలకొల్పి నెలకు రూ.20 వేలకు పైగా సంపాదిస్తున్నట్లు పెద్దపుల్లయ్య సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ను జీవితాంతం మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దళితుల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదు… దేశాన్ని 75ఏండ్లుగా పాలించిన పాలకులు, ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన నాటి పాలకులు దళితుల ఆర్థిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. దళితుల జీవితాలు చీకట్లు ముసిరిన వెన్నెల మాదిరి మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారు. మదిలో ఉన్న ప్రతి ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా రాష్ట్ర అభివృద్ధిని కొనసాగిస్తూ సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీనిలో భాగంగా దళితుల జీవితాల్లో కొత్త కాంతులు విరబూయాలని తలచిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.10 లక్షలు మంజూరు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించారు. దళిత కాలనీల్లో ప్రగతి బాటలు వేసి కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్రను తిరగ రాశారు. దీంతో నేడు దళితులు ఆర్థిక స్వాలంబన సాధించారు.
దళితబంధుతో సరికొత్త జీవనం
దళితబంధుతో జిల్లాలో లబ్ధిపొందిన దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతున్నాయి. జిల్లాలో దళితబంధు పథకం తొలి విడతగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఆ మండలంలోని దళితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం కేసీఆర్ దళిత సాధికారత అమలు పైలట్ ప్రాజెక్టులో చింతకాని మండలం ఎంపిక చేయడంతోపాటు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే చేసి లబ్ధిదారులను గ్రామాల వారీగా 3,280 మందిని గుర్తించారు. గ్రామంలో నివసిస్తున్న ప్రతి దళిత కుంటుంబానికి వారికి ఆసక్తి ఉన్న రంగంలో యూనిట్ను ఎంచుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే వివిధ రంగాల్లో నైపుణ్యాలు ఉన్నవారికి ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించి యూనిట్ల స్థాపన చేశారు.
అదేవిధంగా ఎలాంటి అనుభవం లేనివారికి ప్రత్యేక శిక్షణ అందించి వారికి యూనిట్లు మంజూరు చేసి ముందుకు నడిపిస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మరో 100మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపచేసేందుకు నిర్ణయం తీసుకున్నా రు. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ఖమ్మం-100, సత్తుపల్లి-100, పాలేరు-100, మధిర-100, వైరా-83 మందిని ఎంపిక మొత్తంగా 483 మందికి యూనిట్లు మంజూరు చేశారు.
రక్షణ నిధిలో భరోసా
దళితబంధు పథకంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల నుంచి ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి ద్వారా రూ.10 వేలు, ప్రభుత్వం భాగస్వామ్యంతో మరో రూ.10 వేలతో రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. దీనిద్వారా లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి సాయం అందజేసేలా దీర్ఘకాలిక ప్రయోజనాలతో పథకాన్ని రూపొందించడంతో వ్యాపారంలో దళితులకు ఒక భరోసా లభించింది. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు తీరును గమనించేందుకు ఆరుగురితో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళితబంధు కమిటీలు ఏర్పాటు చేసి పథకాన్ని ఎకడా దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించేలా రూపొందించి నిబంధనలు కఠినతరం చేశారు. దీంతోపాటు మంజూరు చేసిన యూనిట్లతో లబ్ధిదారులు వ్యాపారం కొనసాగించేలా నిరంతరం వారికి ప్రోత్సాహం, మార్గదర్శకం చేస్తున్నారు.
కేసీఆర్ సార్ సల్లంగుండాలే..
చింతకాని మండలం నరసింహాపురంకాలనీ గ్రామానికి చెందిన కర్లపుడి రవి గతంలో సుతారి మేస్త్రీగా పనిచేసేవాడు. ఇప్పుడు దళితబంధు పథకం రూ.10 లక్షలతో డోజర్కు ఓనరయ్యాడు. సుతారి మేస్త్రీగా రోజుకు రూ.800 కూలి వచ్చేది. పని లేనిరోజు వ్యవసాయ కూలి పనికి వెళ్లేవాడు. రెండునెలల క్రితం డోజర్ ఇంటికి రావడంతో అతడి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డోజర్ యజమానిగా ఎక్కడ పనిఉంటే అక్కడికి వెళ్లి అన్సీజన్లో సైతం నెలకు రూ.25 వేలు సంపాదిస్తున్నాడు. సీజన్లో రోజుకు ఆదాయం రూ.8 వేలకు పైమాటే. దీంతోపాటు తనకున్న కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. ఇప్పటివరకు ఒకరి వద్ద కూలి పనికి వెళ్లిన అతడు నేడు డోజర్ ఓనర్గా గౌరవంగా జీవిస్తున్నానని గర్వంగా చెప్పాడు. తమ కుటుంబం తలరాత మార్చిన సీఎం కేసీఆర్ సార్.. సల్లంగుండాలని ఆ దేవున్ని వేడుకుంటున్నాడు.
హార్వెస్టర్తో అదరిపోయే ఆదాయం..
చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు తండ్రి చాట్ల వెంకటేశ్వర్లు, కుమారులు సురేశ్, నాగరాజు కలిసి హార్వెస్టర్ యూనిట్ను దళితబంధు పథకంలో ఆరునెలల క్రితం పొందారు. అప్పటినుంచి తిరుగులేకుండా జిల్లాలోని పలు మండలాలు తిరుగుతూ ఎక్కడ పనిఉంటే అక్కడకు వెళ్తూ ఆదాయం గడిస్తున్నారు. ఆరునెలల్లో మొత్తం సుమారు రూ.5 లక్షల నిఖర ఆదాయం రాగా హార్వెస్టర్ ఖర్చులు పోను రూ.3 లక్షల 60వేలు మిగిలింది. అంటే ఒక్కో కుటుంబం రూ.1.20 లక్షల ఆదాయం పొందింది. సీఎం కేసీఆర్ దయ వల్ల నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నామని వారు తెలిపారు. దళితబంధు దళితులకు లభించిన వరంలా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒక్క నిర్ణయంతో లక్షాధికారులు..
అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి తిరిగి చెల్లింపులు లేకుండా పూర్తిగా రాయితీతో ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించడంతో సీఎం కేసీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో నిరుపేద దళితులు ఒకసారిగా లక్షాధికారులయ్యారు. ఇలా మొదటి రెండు విడతల్లో 3,945 కుటుంబాల ఖాతాలకు రూ.394.50 కోట్లు విడుదల చేయడంతో ఈ లబ్ధి చేకూరింది. ఇలా దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో త్వరలోనే జిల్లావ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలకు అందనుండడంతో ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దళితబంధుకు అర్హత సాధించిన దళిత యువతకు చేపల ఉత్పత్తి, మారెటింగ్, వ్యవస్థాపకతలో నైపుణ్యాభివృద్ధిపై 15రోజులపాటు శిక్షణ ఇచ్చారు. తమకు వచ్చే దళితబంధు నిధుల్లో శిక్షణలో నేర్చుకున్న మెళకువలతో ఫిషరీస్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని, చేపల ఉత్పత్తి, పెంపకం చేస్తున్నారు. అదేవిధంగా డెయిరీ యూనిట్లు, ట్రాన్స్పోర్టు, కిరాణం, తయారీ రంగాల్లో యూనిట్ల స్థాపన చేయించారు.
దళితులకు ఒకసారిగా ఇంతస్థాయిలో ఆర్థిక సాయం గత ప్రభుత్వాలు అందించిన దాఖలాల్లేకపోవడంతో ప్రస్తుతం ఈ పథకంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద చింతకాని మండలం ఎంపిక చేసి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 3,462 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిలో ఇప్పటికే 3,280 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. త్వరలోనే మరో 85 యూనిట్లు గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో 97 యూనిట్లు గ్రౌండింగ్ కోసం లబ్ధిదారులకు ఆసక్తి ఉన్నరంగాల్లో మరింత నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ప్రకటించిన నియోజకవర్గాన్ని 100యూనిట్ల స్థాపనలో అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో యూనిట్ల గ్రౌండింగ్ను అధికారులు పూర్తి చేశారు.
దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు
మామిళ్లగూడెం, జనవరి 21 : రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఖమ్మం జిల్లాలో అమలవుతున్న తీరుపై ‘నమస్తే’తో శనివారం ముఖాముఖి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
నమస్తే : జిల్లాలో దళితబంధు పథకం ఎలా అమలవుతున్నది?
ఏలూరి : దళితబంధు పథకం జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్ గౌతమ్ సారధ్యంలో సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం.
నమస్తే : యూనిట్ల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఏలూరి : ప్రధానంగా లబ్ధిదారులకు బ్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి రాయితీతో ఇస్తున్న రుణంతో వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన యూనిట్లను ఎంపిక చేస్తున్నాం. లబ్ధిదారులు ఏదైనా రంగంలో ఇప్పటికే అనుభవం ఉంటే వారిని అదే రంగంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రోత్సహిస్తున్నాం. అనుభవం లేనివారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇచ్చి యూనిట్లను మంజూరు చేస్తున్నాం.
నమస్తే : లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పారదర్శకత ఉంది?
ఏలూరి : ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపికలో పూర్తి బాధ్యతగా స్థానిక శాసనసభ్యులకు ప్రభుత్వం అప్పగించింది. వారి నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు కలెక్టర్ అనుమతితో యూనిట్లు మంజూరు చేస్తున్నాం. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు అవసరమైన నిధులు మంజూరులో నేరుగా ఆయా వస్తువులు విక్రయించిన సంస్థలకు బ్యాంకు ద్వారా మంజూరు చేస్తున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకతను పాటిస్తున్నాం.
నమస్తే : ఇప్పటివరకు జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు, ఎన్ని నిధులు విడుదలయ్యాయి?
ఏలూరి : జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన విధానాల ప్రకారం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన చింతకాని మండలంలో 3,462 మంది లబ్ధిదారులను గుర్తించాం. వారిలో ఇప్పటికే 3,280 మందికి యూనిట్లు గ్రౌండింగ్ చేశాం. మరో 85 మందికి త్వరలో గ్రౌండింగ్ చేస్తున్నాం. మరో 97మందికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. వీరికి రూ.346.20 కోట్లు వారి వారి ఖాతాలో సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 100మందికి చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో 400మందికి, వైరా నియోజకవర్గంలో 83మందికి మొత్తంగా 483 యూనిట్లు మంజూరు చేసి గ్రౌండింగ్ చేశాం. వీరికి రూ.48.30 కోట్లు నిధులు మంజూరు చేశాం. మొత్తంగా జిల్లా ఇప్పటివరకు 3,945 మందికి రూ.394.50 కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.
నమస్తే : ఈ నిధులు ఆర్థిక సంవత్సరం మార్చిలో మురిగిపోయే అవకాశం ఉందా?
ఏలూరి : దళితబంధుకు కేటాయించిన నిధులు ఎస్సీ సబ్ప్లాన్ నుంచి విడుదల అవుతున్నాయి. ఇవి ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చిలో మురిగిపోయే అవకాశం లేదు. ఈ నిధులు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.