ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు జరిగిన జెండాపాటలో క్వింటాల్ రూ. 19,500 ధర పలికింది. గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఇదే మార్కెట్లో క్వింటాల్ 22వేలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఈ సంవత్సరం 19.500 ధర పలకడం ఇదే తొలిసారి.
ఏసీ రకం పంట కోల్డ్ స్టోరేజీలలో పూర్తిగా తగ్గిన సమయంలో ధర మరోమారు పెరగడం నూతనంగా సాగు చేపట్టిన రైతులకు ఊరటనిచ్చింది. ఈ సంవత్సరం గత కొద్ది రోజుల క్రితం కొత్తపంటకు క్వింటాల్ రూ11,500 ధర పలకగా సోమవారం కొత్తపంటకు సైతం ధర మరింత పెరిగి క్వింటాల్ రూ14వేలు పలికింది. కొత్త మిర్చిపంట పూర్తిగా చేతికి వచ్చే నాటికి క్వింటాల్ రూ. 15వేలు పైగా పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.