రామవరం, ఏప్రిల్ 10 : పవిత్ర రంజాన్ మాసంలో చేసిన 30రోజుల ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో గురువారం రంజాన్ పండుగ జరుపుకోవాలని మతగురువులు నిర్ణయించారు. దీంతో ఈద్-ఉల్-ఫితర్ నిర్వహించుకునేందుకు ఈద్గాలను ముస్తాబు చేశారు.
నెలరోజులు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్ మాసపు మొదటి రోజు జరుపుకునే పండుగే ఈద్- ఉల్- ఫితర్ అంటారు. నమాజ్ చేసిన అనంతరం ఇష్రాఖ్ సమయం ప్రారంభమైన తర్వాత ఈద్- ఉల్ – ఫితర్ రెండు రకాత్గా నమాజ్ చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఈద్- ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్యను పాటిస్తారు. తామంతా ఒకే భావన, ప్రేమాభిమానాలను నెలకొల్పడంలో ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
షవ్వాల్ మాసపు మొదటిరోజు ఈద్ – ఉల్ – ఫితర్ పండుగ నాడు నమాజ్ ప్రార్థనలకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా… అందుకే ఈ పండుగకు ఈద్- ఉల్ – ఫితర్ అని పేరు వచ్చింది. షరియత్ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాల పరమార్ధం చేసేదే ఫిత్రాదానం. సమాజంలోని నిరుపేదలు, దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి ఈ దానం చేస్తారు. పావు తక్కువ రెండుకిలోల గోధుమల తూకానికి సరిపడా పైకాన్ని కడు పేదలకు దానం చేయాలి. ఈద్ నమాజ్ కోసం ఈద్గాకు వెళ్లేటప్పుడు అల్లాహ్ అక్బర్, లాయిలాహా ఇల్లాల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ మిలిల్లాహిల్ హమ్ద్ అనే తక్బీర్ను పఠించాలి. అంతేకాకుండా ఈద్గాకు వెళ్లేటప్పుడు కాలినడకన ఒక దారిన వెళ్లి వచ్చేటప్పుడు మరో దారిలో రావడం ఉత్తమం.
ఈద్- ఉల్- ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలు ముస్తాబు చేశారు. ఫజర్ నమాజ్ అనంతరం ఇష్రాఖ్ నమాజ్ సమయం ప్రారంభమైన తర్వాత ఈ నమాజ్ చేస్తారు. నమాజ్ కోసం ఆజాన్, ఆజాఖత్ చెప్పనవసరం లేదు. ఇమామ్లు ఈద్- ఉల్ – ఫితర్ గురించి ఉపదేశించి నియమాలు వివరిస్తారు. నమాజ్ అనంతరం ఖుద్బాను పఠిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. హితులు, స్నేహితులను ఇంటికి పిలిపించి షీర్ఖుర్మాను అందజేస్తారు.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం, ఏప్రిల్ 10 : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముస్లింలకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా మంత్రు లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు ఉన్నారు. ముస్లింలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచానికి ఆదర్శమని, ప్రతిఒక్కరూ ఆయన చూపిన శాంతిమార్గంలో పయనించి, శాంతిని నెలకొల్పేందుకు కృషిచేయాలన్నారు. సమాజంలో శాంతి సామరస్యం, కరుణ పెంపొందాలని అందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరారు.