నేలకొండపల్లి, జనవరి 9: ఎనిమిదేళ్ల క్రితం పాలేరు నియోజవర్గ రైతులు సాగునీటి సమస్యను ఎదుర్కొనేవారు. ఎక్కువగా వర్షాధార పంటలు పండించేవారు. చెరువులు జలకళను కోల్పోయి, వ్యవసాయ బావులు అడుగంటి దర్శనమిచ్చేవి. బోర్లలో నీరు ఇంకిపోయి ఉండేవి. దీంతో రైతులు రూ.లక్షలకు లక్షలు వెచ్చించి వ్యవసాయ బోర్లు వేయించేవారు. ఎన్ని పరిష్కార మార్గాలు చూసినా ఏడాదిలో ఒక పంట పండించడం గగనమయ్యేది. వానకాలంలో పాలేరు నుంచి ఏటా వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోయేది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం జల వనరులపై ప్రత్యేక దృష్టి సారించింది. వాగులు, నదులపై వీలైన ప్రతిచోట చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. దీనిలో భాగంగా నేలకొండపల్లి సెక్షన్ పరిధిలో మూడు చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో మూడు నిర్మాణాలకు సర్కార్కు ప్రతిపాదనలు వెళ్లాయి. పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా కోదాడ సెక్షన్ పరిధిలోనూ రెండు చెక్డ్యాంలు పూర్తయ్యాయి. ప్రస్తుతం చెక్డ్యాంల వద్ద నీరు నిలిచి జల నిధులను తలపిస్తున్నాయి.
చెక్డ్యాంలు ఇవే..
నీటిపారుదలశాఖ అధికారులు మండలంలోని సుర్థేపల్లి వద్ద రూ.28 కోట్లతో చెక్డ్యాం కం వంతెన నిర్మించారు. రామచంద్రాపురం వద్ద రూ.3.68 కోట్లు, బుద్దారం వద్ద రూ.3.53 కోట్లు, కోదాడ సెక్షన్ పరిధిలో పైనంపల్లి వద్ద రూ.3.53 కోట్లు, అనంతరగిరి మండలం పాలారం వద్ద రూ.3.53 కోట్లతో చెక్డ్యాం నిర్మాణాలు పూర్తయ్యాయి. సదాశివపురం వద్ద రూ.2.64 కోట్లు, పైనంపల్లి వద్ద రూ.4.53 కోట్లు, కట్టుకాసారం వద్ద రూ.4.63 కోట్లతో చెక్డ్యాంల నిర్మించేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే స్థలాలను గుర్తించారు. సర్కారు నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు.
పెరిగిన భూగర్భ జలాలు..
చెక్డ్యాంలతో మండలవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయి. పాలేరు పరివాహక ప్రాంతంలో చెన్నారం, సుర్థేపల్లి, రామచంద్రాపురం, పైనంపల్లి, బుద్దారం, కొంగర, కట్టుకాసారం గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో గతంలో కంటే ఇప్పుడు భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. బోర్లలో కేవలం కొన్ని అడుగుల దూరంలో జలాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గృహావసరాలు సులభంగా తీరుతున్నాయి. పశువులకు వేసవిలోనూ వ్యవసాయ క్షేత్రాలు, వాగులు, చెక్డ్యాంల వద్ద తాగునీరు లభిస్తున్నది. నీటిపారుదలశాఖ అధికారులు ఒక్కో చెక్డ్యాంను ఆరు మిలియన్ల క్యూబిక్ ఫీట్ సామర్థ్యంతో నిర్మించారు.
భూగర్భజలాలు పుష్కలం..
గతంలో వానకాలంలో వరద నీరంతా వృథాగా పోయేది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చెక్డ్యాంలు నిర్మించడంతో నీటికి అడ్డుకట్ట పడింది. దీంతో మండలవ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయి. ఏటా మాకు రెండు పంటలకు సాగునీరు అందుతున్నది. మా ప్రాంతంలో ఇప్పటికే యాసంగి నాట్లు ప్రారంభమయ్యాయి. ఎండాకాలంలోనూ పశువులకు తాగునీటికి ఢోకా లేదు.
– సామినేని వాసు, రైతు, బుద్దారం
కొత్తగా మూడు చెక్డ్యాంలు..
ఇప్పటికే ప్రభుత్వం వీలైన ప్రతిచోట చెక్డ్యాంలు నిర్మించింది. నేలకొండపల్లి మండలవ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయి. కొత్తగా మూడు ప్రదేశాల్లో చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభిస్తాం. చెక్డ్యాంల నిర్మాణం పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తప్పుతాయి. ఒక చెక్డ్యాం నిర్మిస్తే అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు భూగర్భజలం నిలిచి ఉంటుంది.
– మన్మథరావు, డీఈఈ, నీటిపారుదల శాఖ, నేలకొండపల్లి