మామిళ్లగూడెం, ఫిబ్రవరి 9: లవ్ స్టోరీ ఆఫ్ 2022గా యువ ఐఏఎస్ అధికారి కథనం సామాజిక మాద్యమాల్లో హోరెత్తుతోంది. వాలంటైన్స్ డేకు ముందు వారు ప్రేమించుకున్న తీరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న తీరును చూసిన పలువురు.. ‘వాహ్.. శెభాష్’ అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్న లవ్స్టోరీ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏమిటి? ఆ యువ ఐఏఎస్ ప్రేమకథ. అప్పటికే సివిల్స్ మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు యాదృచ్ఛికంగా ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. ఎలాగైనా ఆమెనే తన అర్ధాంగిని చేసుకోవాలని డిసైడయ్యాడు. ఆ యువతితో పరిచయం పెంచుకోవాలని తపించిపోయాడు. అందుకోసం నిత్యం ఆమెను ఫాలో అయ్యాడు. ఓ రోజు తన మనసులోని మాటను చెప్పాడు. తర్వాత కొన్నాళ్లకు ఆమె కూడా ఆ యువకుడి మనసును అర్థం చేసుకుంది. తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహం ఖాయం చేసుకున్నారు. ఈ కథలో యువకుడి పేరు రాహుల్. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్. ఆ యువకుడి సొంతూరు నారాయణపేట జిల్లా కేంద్రం. ఆయన ప్రేమించిన యువతి మహబూబ్నగర్ పట్టణానికి చెందిన మనీషా. ఆమె సెకండరీ గ్రేడ్ టీచర్. కులాలు, మతాలు తెలియకుండానే వారు ప్రేమించుకున్నారు. కులాంతర వివాహమైనా ఇరువైపులా తల్లిదండ్రులు పెద్ద మనసుతో అంగీకరించారు.
గురువారం మహబూబ్నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి జరుగుతుంది. అయితే ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా? పెళ్లి కొడుకు తన వివాహ ఆహ్వాన పత్రికను డిజిటల్ విధానంలో సరికొత్తగా తయారు చేసి ఆహ్వానించడమే విశేషంగా మారింది. తను యువతి మనసును గెలుచుకునేందుకు ఏ విధంగా ప్రయత్నించాడో, ఆ యువతిపై తనకున్న ప్రేమను ఎలా వ్యక్తం చేశాడో.. కవితల రూపంలో వర్ణిస్తూ తమ రూపాలను డిజిటల్లో చిత్రీకరిస్తూ వీడియో తయారు చేశాడు. ఆ వీడియోను బంధుమిత్రులకు పంపించి తమ పెళ్లికి ఆహ్వానించాడు. అదే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. యువ ఐఏఎస్ అధికారి తన ప్రేమను వ్యక్తం చేసిన తీరు, పెళ్లికి ఆహ్వానించిన విధానం ప్రస్తుతం మహబూబ్నగర్, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో వైరల్గా మారింది. ప్రేమ కోసం ఓ ఐఏఎస్ అధికారి పడిన తపన, అందులో ఆయన విజయం సాధించడం తీరు అందిరినీ ఆకట్టుకుంటోంది. జీవితంలో ప్రేమ పేరిట కొందరు యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే.. ఎంతో కష్టపడి తన ప్రేమను గెలిపించుకోవడమే కాకుండా కష్టపడి ఐఏఎస్ సాధించిన రాహుల్ నేటి తరం యువతకు ఆదర్శంగా మారాడని పలువురు పేరొంటున్నారు.