– నల్సార్ లా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డా.డి.బాలకృష్ణ
రామగిరి, జూలై 25 : నేటి సమాజంలో నేరాల స్వరూపం వేగంగా మారుతుందని, సాంప్రదాయ నేరాలతో పాటు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, డిజిటల్ ఫ్రాడ్లు, కృత్రిమ మేధస్సు దుర్వినియోగం, డీప్ఫేక్లు, డేటా చోరీ, ఆన్లైన్ వేధింపులు, అంతర్జాతీయ నేరాల వంటి సవాళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ ఫ్యాకల్టీ డా.డి.బాలకృష్ణ అన్నారు. కావునా న్యాయవాదులు నిరంతర అధ్యయనపరులుగా ఉంటూ నూతన చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, బార్ అసోసియేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో “ఆధునిక నేరాలు, క్రిమినల్ న్యాయవ్యవస్థ, నూతన సవాళ్లు, న్యాయపరమైన స్పందనలు” అంశంపై నిర్వహించిన న్యాయవాదుల అవగాహన సదస్సుకు ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి అధ్యక్షత వహించగా డా.బాలకృష్ణ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు.
డిజిటల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, మొబైల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా ఆధారాలు, కాల్ డేటా రికార్డులు వంటి ఆధారాలు నేటి క్రిమినల్ ట్రయల్స్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ ఆధారాల సేకరణ, సంరక్షణ న్యాయస్థానంలో వాటి ఆమోదయోగ్యతపై న్యాయవాదులకు సమగ్ర అవగాహన ఉండాలన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ఒకవైపు నేరాల దర్యాప్తుకు సహకరిస్తున్నప్పటికీ, మరోవైపు డీప్ఫేక్ వీడియోలు,డిజిటల్ మోసాలు, వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనలు వంటి కొత్త సవాళ్లను సృష్టిస్తోందన్నారు. అందువల్ల చట్ట అమలు సంస్థలు, న్యాయవ్యవస్థ, న్యాయవాదులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నేరాల నియంత్రణలో కేవలం శిక్షలు విధించడం మాత్రమే కాకుండా, వేగవంతమైన దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, బాధితులకు న్యాయం, నిందితుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, పారదర్శక విచారణ వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. న్యాయవాదులు కాలానుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే ఆధునిక నేరాలను సమర్థంగా ఎదుర్కొని, సమాజానికి న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించగలరన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, మునగాల నారాయణరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకవరపు సతీష్ కుమార్, కార్యదర్శి బి.అశోక్ కుమార్, న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, జి.జవహర్ లాల్, భువనగిరి రవి, గుర్రం వెంకట్ రెడ్డి, నాంపల్లి నరసింహ, ఎన్ భీమార్జున్ రెడ్డి, నాగిరెడ్డి,పందుల సైదులు, నాంపల్లి భాగ్య, బి.వెంకటేశ్వర్లు, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

‘నూతన చట్టాలపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలి’