Khammam : ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వాసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన మందులు, సిరంజీలు, గ్లోవ్స్, ఇతర ప్రాథమిక వైద్య సామగ్రి కొరత ఉందనే వార్తలు వస్తున్నాయని పువ్వాడ తెలిపారు. సరైన సమయంలో వైద్యులు, నిపుణులైన స్పెషలిస్టులు, నర్సింగ్ సిబ్బంది లేక వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, అవసరమైన సామగ్రి, సిబ్బంది కొరత కారణం రోగులు ఇబ్బందులు పడుతున్నారని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో రోగులు మరణిస్తున్నారని, ప్రజలు ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం దారుణమని మాజీ మంత్రి అన్నారు. వైద్య వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో మౌలిక వసతులను గణనీయంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు పువ్వాడ. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, ఖమ్మం ప్రభుత్వాసుపత్రి గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.