ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 26 : జిల్లాలోని ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకుగాను ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగనున్నది. 1,30,230 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. నేడు ఖమ్మంలోని మోమినాన్ పాఠశాలలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న కార్యక్రమాన్ని ఉద్దేశించి శనివారం ఖమ్మంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ వద్ద కలెక్టర్ వీపీ గౌతమ్ జెండా ఊపి ప్రారంభించగా మయూరి సెంటర్, వైరారోడ్ మీదుగా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందరర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలియోరహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ రాజేశ్, పీవో డాక్టర్ సైదులు, డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి, ఎస్డీపీవో నీలోహన, డీఎస్వో పరంధామరెడ్డి, డాక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 26 : జిల్లాలో మున్సిపాలిటీల పరిధిలో అవసరమైన ప్రభుత్వ భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ అర్బన్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్యూఎఫ్ఐడీసీ) రెండవ దశ కింద మంజూరు చేసిన నిధులను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. జిల్లాలో వైరా, సత్తుపల్లి, మధిర, మున్సిపాలిటీల్లో అంబేదర్ భవన్, కమ్యూనిటీ హాల్స్, మోడ్రన్ లైబ్రరీ, వివేకానంద ఎక్స్లెన్స్ సెంటర్, బీటీ, సీసీ రోడ్లు, డ్రైన్స్, షాపింగ్ మాల్, నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఇన్చార్జి డీపీవో వీవీ అప్పారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్కుమార్, మున్సిపల్ కమిషనర్లు సుజాత, వెంకటపతిరాజు, రమాదేవి పాల్గొన్నారు.