ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 27 : జిల్లాలో పదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10,148 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 6,429 మంది, ప్రైవేట్గా 279 మంది.. మొత్తంగా 16,577 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు 97 కేంద్రాలను ఎంపిక చేయగా.. 1,983 మంది ఇన్విజిలేటర్లు, 53 జోన్లు, 6 రూట్లు, 5 ఫ్లయింగ్ స్కాడ్స్, 97 సిట్టింగ్ స్కాడ్స్, 97 సీఎస్, డీవోలను ఏర్పాటు చేశామన్నారు. ఇన్విజిలేటర్లకు లాటరీ పద్ధతి ద్వారా గదులు కేటాయించాలని, ప్రశ్నాపత్రంలో ప్రతి పేజీలో విద్యార్థి చేత హాల్ టికెట్ నెంబర్ రాయించాలన్నారు. సమావేశంలో డీఈవో సోమశేఖర శర్మ, ధనా, ఎంఈవో శ్రీనివాసరావు, రాములు, నారాయణ, వీరస్వామి, కార్యాలయ సిబ్బంది జీఎస్.ప్రసాద్, యూసఫ్, సీఎస్, డీవోలు తదితరులు పాల్గ్గొన్నారు.
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 27 : పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్స్, జాయింట్ కస్టోడియన్స్, రూట్ ఆఫీసర్స్తో ఆమె సమీక్షించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని, మొత్తం 12,341 మంది విద్యార్థులు 33 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలను 23 పోలీస్స్టేషన్లలో భద్రపరచనున్నట్లు పేర్కొన్నారు. 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు 73 మంది, 720 మంది ఇన్విజిలేటర్లు, 5 ఫ్లైయింగ్ స్కాడ్స్ బృందాలు విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. సమావేశంలో డీఆర్వో రవీంద్రనాథ్, డీఈవో వెంకటేశ్వరచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.