ఖమ్మం వ్యవసాయం, జనవరి 9 : మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజులోనే తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.500 తగ్గడంతో అయోమయానికి గురవుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డులో మంగళవారం ఉదయం జరిగిన జెండా పాటలో తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.20,500 పలికింది. సోమవారం ఇదే మార్కెట్లో క్వింటా ధర రూ.21 వేలు పలికింది. సీజన్ ఆరంభంలో క్వింటా ఒక్కంటికి దాదాపుగా రూ.24 వేల వరకు ధర పలకగా..
వారం రోజుల వ్యవధిలోనే రూ.20 వేలకు చేరడంతో మిర్చి సాగు రైతులు నిరుత్సాహానికి లోనయ్యారు. కాగా.. ఉదయం జెండా పాట సమయానికి వివిధ జిల్లాల నుంచి రైతులు దాదాపు 20 వేల మిర్చి బస్తాలను విక్రయానికి తీసుకొచ్చారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట దిగుబడి బాగా తగ్గడంతో ఆశించిన మేర ప్రయోజనం లేకపోయింది. సంక్రాంతి పండుగ తర్వాత ధరల్లో కొంత వ్యత్యాసం వచ్చే అవకాశం ఉన్నదని కొందరు వ్యాపారులు పేర్కొంటున్నారు.