జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనున్నది. 1,456 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,456 మంది ప్రిసైడింగ్, 1,456 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.
ఖమ్మం, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,456 పోలింగ్ కేంద్రాల్లో గురువారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఉదయం 6 గంటలకే రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ఉంటుంది. పోలీస్శాఖ గుర్తించిన 195 గ్రామాల పరిధిలోని 392 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. ఇవేకాక మరో 594 పోలింగ్ కేంద్రాలం సీసీ కెమెరాలు నిఘా ఉంచుతాయి. పోలింగ్ సందర్భంగా జిల్లాఅంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
ప్రతి నియోజకవర్గంలో ఈసీ ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాలను ఆకర్షణీయంగా అలంకరించింది. బుధవారం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది ఎలక్షన్ సామగ్రి తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించి సిబ్బందికి పలు అంశాలపై సూచనలిచ్చారు. సిబ్బందికి టూత్ పేస్ట్ నుంచి ఇతర అవసరాలకు సంబంధించిన వస్తువులను ఈసీ ఒక కిట్లా అందజేసింది. ఎక్కడైనా ఈవీఎంలు మోరాయించినా అరగంట వ్యవధిలోనే వాటి స్థానంలో మరొక ఈవీఎంలు సమకూర్చేలా టెక్నీషియన్లు నియమితులయ్యారు. ప్రత్యేక మెనూ ప్రకారం ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఏర్పాట్లను గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల అధికారులు ఈవీఎంలను అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తల్లంపాడు శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. సాయుధ బలగాలు డిసెంబర్ 3 వరకు ఈవీఎంల భద్రతను పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ప్రభుత్వం పోలింగ్ నిర్వహణపై శిక్షణ పూర్తయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం 12,16,796 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇద్దరు సహాయకులతో విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు మరో 10శాతం మంది ఉద్యోగులు, అధికారులను జిల్లా ఎన్నికల అధికారి రిజర్వ్ చేశారు. వీరిని అత్యవసర సమయాల్లో వినియోగించుకోనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,456 మంది ప్రిసైడింగ్, 1,456 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోస్ 2,911 మంది విధులు నిర్వహిస్తారు.
మామిళ్లగూడెం, నవంబర్ 29: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ నెం-239, ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు మోమినాన్లో మహిళల మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. పోలింగ్ స్టేషన్ నెం-317, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్ర నగర్లో దివ్యాంగుల కేంద్రం ఏర్పాటైంది. పోలింగ్ స్టేషన్ నెం-146, 156, ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధరణ, యూత్ మోడల్ పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. పాలేరు నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ నెం-134, గుర్రాల పాడు ప్రాథమికోన్నత పాఠశాల ఖమ్మం రూరల్ మహిళలకు ఏర్పాటైంది. పోలింగ్ స్టేషన్ నెం-80 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోల్లపాడు దివ్యాంగుల కోసం సిద్ధమైంది. పోలింగ్ స్టేషన్-177 పాలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాధారణ ఓటింగ్కు సిద్ధమైంది.
మధిర నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ -228లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మధిరలో మహిళలకు, పోలింగ్ స్టేషన్ నెం-130, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జానకీపురంలో దివ్యాంగుల కోసం ఏర్పాటయ్యాయి. పోలింగ్ స్టేషన్ నెం-115 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోనకల్లో సాధరణ, యూత్ మోడల్ పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. వైరా నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ నెం-153, మండల పరిషత్ కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాల తనికెళ్లలో మహిళలకు, పోలింగ్ స్టేషన్-186, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల చిన్నగోపతిలో దివ్యాంగులకు, పోలింగ్ స్టేషన్-205, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వైరాలో సాధారణ, యూత్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్-134, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పశ్చిమ బ్లాక్, వీఎం బంజరలో మహిళలకు, పోలింగ్ స్టేషన్-203, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కిష్టారంలో దివ్యాంగులకు, పోలింగ్ స్టేషన్-95, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నారాయణపురంలో సాధారణ, యూత్ మోడల్ పోలింగ్ స్టేషన్లు పోలింగ్కు సిద్ధమయ్యాయి.