తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కారు. పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాలను అవహేళన చేస్తూ మాట్లాడిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు సాయం చేయకపోగా.. అపహాస్యం చేస్తారా.. అని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విభజన సరిగా జరుగలేదని పదే పదే అనడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు. మోదీ వ్యాఖ్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబసభ్యులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి అన్యాయం చేయలేదా అని నిలదీశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన విశ్వవిద్యాలయంపై నోరుమెదపని బీజేపీ తెలంగాణను అవమానించడం సరికాదని విద్యార్థులు, యువత పేర్కొంటున్నారు.
– ఖమ్మం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణపై అదే ఏడుపు..
అభివృద్ధిని జీర్ణించుకోలేక అక్కసు
ప్రగతిని ప్రోత్సహించాల్సింది పోయి అపహాస్యం చేయడం
ఎంత వరకు సమంజసం..?
అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షపై నిప్పులు పోయడం..
తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి జరుగుతుంటే ఓర్పు అవసరమంటారా?
బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీపై
నోరుమెదపని బీజేపీకి తెలంగాణపై మాట్లాడే అర్హత ఉందా?
అరవై ఏళ్ల పోరాటాన్ని అవహేళన చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం లేదా..?
ఎన్నాళ్లీ మౌనం..?
ప్రజలు, యువత, విద్యార్థులు,
యువజన, ప్రజా, కులసంఘాల నాయకులు, మేధావుల్లారా ఇకనైనా మేల్కోండి.. తెలంగాణపై దాడిని గమనించండి.
కుట్రలకు దీటైన సమాధానం ఇవ్వండి..
ఖమ్మం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తీరు గురించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణపై ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అక్కసు వెళ్లగక్కడంపై తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పలువురు తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాని మోదీకి ఏమాత్రమూ ఇష్టం లేనట్లు ఆయన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లు అయిన తరువాత రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదని, సుఖ ప్రసవం జరగలేదని మోదీ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజలను, అమరులను అవమానించడమేనని అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ను మించి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక్క ఓటు – రెండు రాష్ర్టాలు’ అంటూ 1999లో కాకినాడలో తీర్మానం చేసిన బీజేపీ.. ఆ తరువాత ఆ ఊసే లేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఏర్పడి ప్రత్యేక పరిపాలనకు ఏర్పాట్లు జరిగే సమయంలో అప్పటికే అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న అప్పటి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ‘పోలవరం’ పేరుతో ఆంధ్రాకు అప్పగించడం నిజం కాదా? అంటూ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో విద్యుత్కాంతులు వెదజల్లే లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఆంధ్రాకు అప్పగించిందని, తెలంగాణకు కష్టాలను మిగిల్చిందని మండిపడుతున్నారు. ఘనమైన ఉద్యమ చరిత్ర కలిగిన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావాన్ని పెప్పర్ స్ప్రేయర్లతో ఏర్పడిందని వ్యాఖ్యానించడం ప్రధాని స్థాయికి తగినది కాదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సినవి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిప్పులు గక్కడంపై విద్యార్థులు, యువకులు మండి పడుతున్నారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ.. మాటల్లో మాత్రం ‘శ్రీరంగ నీతులు..’ చెబుతుండడం పట్ల జిల్లా మహిళా సంఘాల నాయకులు, ఉద్యమకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం వంటివి మంజూరు చేయాలన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని మోదీ.. రాష్ర్టానికి మరింత అన్యాయం చేసే విధంగా మాట్లాడడం దారుణమని అన్నారు. తెలంగాణ ఏర్పాటు వెనుక అనేకమంది అమరుల త్యాగాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. సుదీర్టకాలం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణపై ఎవరు అక్కసు వెళ్లగక్కినా చూస్తూ ఊరుకోబోమని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు గర్జిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు చేపట్టాలని మంత్రి అజయ్కుమార్.. టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని దిష్టిబొమ్మలను, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలపాలని కోరారు.
పార్లమెంటు సాక్షిగా జరిగిన తెలంగాణ ఏర్పాటు, రాష్ట్ర విభజన తీరుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణకు సీఎం కేసీఆర్ బంధువైతే.. మోదీ రాబందులా తయారయ్యారు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంటును, సంతకం పెట్టిన రాష్ట్రపతిని అవమానించారు. తెలంగాణ వ్యతిరేక డీఎన్ఏ తనలో ఉందని ప్రధాని నిరూపించుకున్నారు. బీజేపీ నేతలు ఇక ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారు?
– పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
అమరుల త్యాగాల పునాదిపై గూడుకట్టుకున్న తెలంగాణపై ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు వారి ఆత్మలు క్షోభించేలా ఉన్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత పార్లమెంటులో తెలంగాణ బిల్లు చట్టంగా మారింది. ఉద్యమ చరిత్రను పెప్పర్ స్ప్రేయర్, కాగితాలతో పోల్చడం మోదీకి తగదు. తెలంగాణ రాష్ట్రం సకలజనుల ఆకాంక్ష, ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం అమరుల కుటుంబాలను కలిచివేసింది. ఆత్మబలిదానాలను అవమానపరిస్తే చూస్తు ఊరుకోం.. – యలమందల బాబు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుడు
తెలంగాణపై ప్రధాని మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పార్లమెంట్లో తెలంగాణపై అనుచిత ప్రస్తావన తేవడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం. దశాబ్దాల ఉద్యమాన్ని, ప్రాణత్యాగాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణం. తెలంగాణ ప్రజలపై బీజేపీకి ఉన్న గౌరవానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ. పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ను చూసి భరించలేకనే ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేని బీజేపీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
-రేగా కాంతారావు, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రాష్ర్టాన్ని అవహేళన చేసేలా వ్యాఖ్యానించడం ద్వారా ప్రధాని తన హుందాతనాన్ని తగ్గించుకున్నారు. తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమించి ఆకాంక్షలు నేరవేర్చుకున్న ప్రజలను అవమానపరిచే హక్కు ప్రధానికి లేదు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించని కేంద్రం.. అన్నింటిలో మేటిగా ఉంటున్న తెలంగాణపై అక్కసుతో ఉంది. అందుకే తెలంగాణపై చిన్న చూపు చూస్తోంది. ప్రధాని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
-తాతా మధు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్రమోదీ తన అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని పార్లమెంటు సాక్షిగా అవమానించారు. 60 ఏళ్ల కలను సకారం చేసుకున్న తెలంగాణ ప్రజానికానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి.
-లింగాల కమల్రాజు, జడ్పీ చైర్మన్, ఖమ్మం
ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ కోసం నిరంతరం మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, ఎల్కే అద్వానీలను అవమానపరిచేలా ఉన్నాయి. 1200 మంది అమరుల కుటుంబాలు, తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. బీజేపీ భూస్థాపితం ఖాయం.
-గుండ్లపల్లి శేషగిరిరావు, తెలంగాణ ఉద్యమకారుడు
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమాన పరిస్తే చూస్తూ ఊరుకోం. తెలంగాణపై వివక్షను ప్రదర్శిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణ ఆకాంక్షలకు ఉద్యమ సమయంలో బీజేపీ అగ్రనేతలు అద్వానీ వంటి వారు అండగా నిలిచిన విషయాన్ని విస్మరించడం శోచనీయం.
-పగడాల నరేందర్, తెలంగాణ ఉద్యమకారుడు