ఖమ్మం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెసోళ్ల మాటలు వింటున్న రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 2014కు ముందున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ దిగులు చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక వైపు సక్రమంగా సాగునీరు లేక, కరెంటు సరిగ్గా రాక.. తెల్లవారుజామున వచ్చే త్రీఫేజ్ కరెంటు కోసం పడిగాపులు కాస్తూ తడిపెట్టిన పంట పొలాల పరిస్థితిని వారు ఇంకా మర్చిపోలేదు. మరోవైపు ఎరువుల కొరత ఎక్కువగా ఉండడంతో షాపుల వద్ద బారులు తీరిన సందర్భాలు కోకొల్లలు. రైతులు సమావేశాలు పెట్టుకోవాలంటే చెట్ల కిందనే మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఇవన్నీ ఎలా మర్చిపోతామని పలువురు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
గతంలో పాస్ పుస్తకాల కాలం. దీంతో ఎవరి భూమి ఎక్కడుందో తెలియని పరిస్థితి. పాస్ పుస్తకాల్లో కేవలం నెంబర్లు మాత్రమే ఉండేవి. కానీ.. రైతులు మాత్రం మా పొలం మా దగ్గరే ఉందనే నమ్మకంతో సాగు చేసుకుంటున్న పరిస్థితి. అయితే పాస్ పుస్తకాల్లో సర్వే నెంబర్లు మార్పు చేసిన వీఆర్వోలు రైతుల మధ్య పెద్ద పెద్ద గొడవలే సృష్టించారు. ఆమ్యామ్యాలకు అలవాటుపడి ఒకరి పొలం సర్వే నెంబర్లు ఇంకొకరికి పాస్ పుస్తకాల్లో ఎక్కించి రైతుల కుటుంబాలను ఇబ్బందులపాలు చేశారు. ఇవన్నీ పాత రోజులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో నూతన మార్పులు తీసుకురావడంతోపాటు రైతులకు 24 గంటలు కరెంటు రావడంతో రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగింది. దీంతో ధరణిని అందుబాటులోకి తేవడంతో రైతుల పొలాల సర్వే నెంబర్లు ఆన్లైన్ చేశారు. ఎప్పటి నుంచో ఉన్న సర్వే నెంబర్ల సమస్య ఒక కొలిక్కి వచ్చింది. మళ్లీ కాంగ్రెస్ వస్తే పటేల్, పట్వారీ, వ్యవస్థ వల్ల దోపిడీదారుల వ్యవస్థ వస్తుందేమోనని రైతులు భయపడుతున్నారు. దీనిని చాలా మంది మేధావులు, రైతులు, ప్రజలు తిరస్కరిస్తున్నారు.
సక్కపడ్డ వ్యవసాయ రంగంలో మళ్లీ పాత పద్ధతులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. పాత పద్ధతిలో సొసైటీల ద్వారా ఎరువులు ఇవ్వడం వల్ల పెద్ద రైతులకు మాత్రమే ఎరువులు లభించే పరిస్థితి ఉంటుంది. దీంతో చిన్న రైతులు వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. చిన్న కమతాలలో వ్యవసాయం చేయలేక మళ్లీ కూలీలుగా మారే పరిస్థితి ఉండబోతుంది. ధరణిని తీసేస్తే కౌలు రైతులకు రైతుబంధు ఇచ్చే ప్రతిపాదనను కాంగ్రెస్ తీసుకొస్తామంటున్న తరుణంలో రైతులు పొలాలను కౌలుకు ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో సక్కబడ్డ సాగు భూములన్నీ మళ్లీ బీళ్లుగా మారబోతాయని రైతులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల పట్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారులు, గృహిణులు మండిపడుతున్నారు. ఒకవైపు ధరణి తీసివేయడంతోపాటు మరోవైపు మూడు గంటల కరెంట్పై పదే పదే మాట్లాడుతుండడంతో ఆ పార్టీ నాయకులకు ఎన్నికల్లో తగిన రీతిలో సమాధానం చెబుతామని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి రైతుభరోసా అనే పథకం అమలు చేస్తామంటున్నారు. ఏటా ఎకరాకు రైతుకు రూ.15 వేలు, కౌలురైతుకు రూ.15 ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు అసలైన రైతులకు డబ్బులు ఇస్తే కౌలురైతులకు ఇవ్వం. కౌలురైతులకు ఇస్తే అసలైన రైతులకు ఇవ్వమని రేవంత్రెడ్డి అంటున్నారు. రేవంత్రెడ్డికి వ్యవసాయం గురించి ఏ మాతం అవగాహన లేదు. రైతులకు ఎలాంటి పథకాలు అమలు చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. ఆచరణలో సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయాలని చూస్తుంది.
సీఎం కేసీఆర్ రైతుల పట్ల చూపిస్తున్న సల్లని సూపుతో వ్యవసాయాన్ని సంతోషంగా చేసుకుంటున్నాం.. నాచిన్నతనంలో మా తల్లిదండ్రులు పంట సాగు చేయటానికి అరిగోసం పడేది. విత్తనాలు, ఎరువులు సరిగ్గా ఉండకపోయేది. తోటకు నీళ్లు కట్టడానికి కరెంట్ లేకపోయేది. భూములకు భద్రత ఉండేది కాదు. కేసీఆర్ సార్ ధరణీని అందుబాటులోకి తీసుకువచ్చి పట్టాభూములుగా మార్చిండు. పెట్టుబడులకు రైతుబంధు సాయం అందుతుంది. ఉచిత కరెంట్ ఇస్తుండు. పండించిన పంటకు ఊర్లల్లోనే కొనగోలు కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర కల్పిస్తుండు… ఇవన్ని అప్పట్లో లేక మా కుటుంబం అప్పుల పాలై పండించిన పంటంతా సావుకార్లకే పోయేది. రైతుబంధువైన కేసీఆర్ సార్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి… రైతులకు మరింత మేలు జరగాలి.
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి పగలు కరెంట్ ఉండేది కాదు. రాత్రి పూట కరెంట్ మోటర్ స్విచ్ వేయడానికి పోయి పొలంలో కాలు కింద పడి కొన్ని రోజులు మంచం మీద నమిశా. ఇచ్చిన కొద్ది సేపు కరెంట్కు మడులు తడిసేది కాదు. పంట వేసిన కాడి నుండి రాత్రంతా నీళ్లు కట్టడానికే సరిపోయేది. అయినా పంట మొత్తం తడిసేది కాదు. కరెంట్ మోటర్లు కాలిపోయేవి. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24గంటల కరెంట్తో మా కష్టాలన్నీ తొలగిపోయాయి. పంట పొలం, మిరపతోట మొత్తాన్ని తడిపేందుకు పొద్దంతా కరెంట్ ఉంటుంది. ఇప్పుడేమో కాంగ్రెసోల్లు మళ్లీ మూడు గంటల కరెంట్ను తీసుకువస్తామని రైతులను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈసారి కూడా కేసీఆర్ సార్నే సీఎంగా గెలిపించుకుంటాం…ఎవరి మాటలు విని మోసపోయేది లేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో కరెంట్ కోసం ధర్నాలు చేసిన రోజులే లేవు. 24 గంటలు కరెంట్ ఉంటుంది. అప్పట్లో మా రైతుల బతుకులు రోడ్ల మీద, మోటర్లు రిపేర్లు చేసే దుకాణాల వద్దే ఉండేవి. కరెంట్ కోసం ఎన్నో బాధలు పడ్డాం. ఆందోళనలు చేశాం. కేసీఆర్ పాలనలో నాటి ఇబ్బందులు తప్పాయి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మూడు గంటలు విద్యుత్ చాలు, ఇంకా 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నారు. ఇప్పటి వరకు 10 హెచ్పీ మోటర్లు వాడినోళ్లు చూడలేదు. కాంగ్రెసోళ్లు ఎందుకు మాట్లాడుతున్నారో వారికే తెలవాలి. వాళ్లు వస్తే వ్యవసాయం కచ్చితంగా ఆగమవుతుంది. రైతు బతుకు మళ్లీ రోడ్డుపై పడుతుంది. కేసీఆరే రావాలి, ఆయనే సీఎం కావాలి.
రైతు కుటుంబాలను బాధపెట్టే మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తగిన బుద్ది చెపుతాం.. నాచిన్న తనం నుంచి చూస్తున్న రైతులకు ఇంత మంచి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కేసీఆర్ సార్ పాలనలోనే రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేస్తుండ్రు. అట్లాంటి సార్ ఉంటేనే మాలాంటి లక్షలాది కుటుంబాలు సంతోషంగా సాగు చేస్తాం.ఎన్నో సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనను చూశా కబుర్లు చెప్పుడు తప్ప చేతలు ఉండవు. రైతు కష్టాలు గుర్తించిన కేసీఆర్ సార్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ఎవరెన్ని చెప్పినా నా కుటుంబం అంతా కారు గుర్తుకే ఓటు వేస్తుంది.
కాంగ్రెస్ పార్టీని నమ్మితే రైతులకు మొదటికే మోసం వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకోలేదు. రైతుల వ్యవసాయం చేయాలంటే భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల ఫలితంగా వ్యవసాయ రంగం పండుగలా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. రైతులు కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మడం లేదు. ఎన్నికల ఓట్ల కోసం వారు హామీలు ఇస్తున్నారే తప్ప రైతుల మేలు చేయాలని ఉద్ధేశ్యంతో కాదని అర్థమవుతుంది. రైతులకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించుకుందాం.
పట్టాలు చేయించుకునేందుకు కాళ్ల చెప్పులరిగేలా తిరిగా నా భూమికి పట్టాదారు పాసు పుస్తకం చేయించుకునేందుకు ఏళ్ల తరబడి
ఆఫీసులు, అధికారుల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగాను. జేబులో డబ్బులన్నీ ఖాళీ అయ్యాయి కానీ పని మాత్రం కాలేదు. సీఎం కేసీఆర్ సార్ తీసుకవచ్చిన ధరణీ వల్ల పట్టాలయ్యాయి. పెట్టుబడి సాయంగా రైతుబంధు వస్తుంది. పత్తిచేను, మిరప తోటలకు నీళ్లు కట్టేందుకు ఉచిత కరెంట్ వస్తుంది. అప్పుడు పండిన పంటంతా పెట్టుబడులు, అప్పులు కట్టేందుకు సరిపోయేది. ఇప్పుడావసరం లేకుండా పోయింది. ప్రభుత్వమే పెట్టుబడికి సాయం అందిస్తున్నది. సాగుకు కరెంట్ ఇస్తున్నది. ఇంత కంటే ఏం కావాలి రైతులకు .. మళ్లీ సీఎంగా కేసీఆర్ సారే రావాలి.
కాంగ్రెస్ వచ్చి ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్వో వ్యవస్థ వచ్చి రైతులను నట్టేట ముంచడం ఖాయం. డబ్బులిస్తే ఒకరి పట్టా ఒకరికి మార్పులు జరుగుతాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములు భద్రంగా ఉన్నాయి. కానీ ధరణి ఎత్తేస్తే మళ్లీ పాతరోజులు వచ్చి పైరవీలు, కొట్లాటలు, గొడవలు జరుగుతాయి. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాడం ఖాయం. రైతుల మద్ధతు పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వానికే. నా ఓటు బీఆర్ఎస్కే.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక చీకట్లో మగ్గిన రోజులు ఇంకా కళ్లలోనే మెదులుతున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేక అష్టకష్టాలు పడ్డాను. కండ్ల ముందు నీళ్లతడిలేక పంట ఎండిపోతుంటే దుఖఃం ఆపుకోలేపోయాను. లో ఓల్టేజీ కరెంట్ వల్ల మాటమాటకీ మోటర్లు కాలిపోయేవి. వాటిని బాగు చేయించడానికే మస్తు డబ్బులు ఖర్చయ్యేవి. ఒకానొక సందర్భంలో వ్యవసాయం చేసుడు మానేద్దామనిపించింది. మళ్లీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా వచ్చి దండగనుకున్న వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేలా చేసిండు. ఇప్పుడు కరెంట్కు, సాగు నీళ్లకు కొదువ లేదు.మళ్లీ సారే గెలవాలి మూడోసారి ముఖ్యమంత్రి కావాలి. నా ఓటు కారు గుర్తుకే ఓటు వేస్తా…
మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు ఉండవు. పొరపాటున కాంగ్రెస్ వస్తే విద్యుత్ కోతలు, పొలాల్లో ఇసుక మేటలు వేయక తప్పవు. కాంగ్రెస్ నేతలు కరెంటుపై అవగాహన లేక నాలిక పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. అన్నదాతలు గుర్తెరిగి కాంగ్రెస్కు ఓటుతో వాతపెట్టాలి. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాల వల్ల బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. కరెంటు 24 గంటల ఉండడం వల్ల సాగునీటి వాడకం పెరిగి సాగు విస్తీర్ణం పెరిగింది.
కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయం గురించి తెలియదు. మూడు గంటల కరెంటుతో పొలం పారదు. 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటే అంత స్థోమత మాకు లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తుండడంతో రెండు పంటలు పండించుకుంటున్నాం. గత కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు అనుభవించాం. మళ్లీ ఆ పాలన వద్దు. కేసీఆరే మళ్లీ రావాలి.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. దీంతో వ్యవసాయం ప్రశాంతంగా చేసుకుంటూ రెండు పంటలు పండించుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటు చాలు, 10హెచ్పీ మోటర్లు పెట్టుకోండి అంటూ మాటలు చెబుతుంటే వారికి వ్యవసాయంపై అవగాహన లేదనిపిస్తుంది. ఆ పాలన మాకొద్దు. మళ్లీ పాతరోజులు చూడలేం. కేసీఆరే రావాలి.
కాంగ్రెస్ నాయకులు చెప్పే విధంగా మూడు గంటల కరెంట్ ఇస్తే మళ్లీ అందరికి ఇబ్బందే. తెలంగాణ రాక ముందు కరెంట్ సరిగ్గా రాకపోతే చేతిపని చేసుకునే వాళ్లు ఖాళీగా కూర్చునేవారు. కూలీలు సైతం తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. గ్రానైట్ కార్మికులకు పని లేకుండా పోయింది. సుతారీ పనులు చేసుకునే వాళ్లకు కూడా కరెంట్తోనే పని ఉంటుంది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి సమస్య లేదు. పుష్కలంగా కరెంట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి చేతినిండా పని దొరుకుతున్నది. తిరిగి పాత రోజులు తీసుకొస్తామని చెప్పడం ఎంతరవకు కరెక్టు కాదు. మా మద్దతు బీఆర్ఎస్కే ఇస్తాం.
భూములకు రక్షణ కవచంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తెచ్చింది. దీంతో ఎవరి భూమి ఎంత ఉందనేది సెల్ఫోన్లో కనపడుతుంది. గతంలో పహాణీల విధానం ద్వారా రైతుకు తెలవకుండానే అనేక మార్పులు జరిగాయి. మా తండాలో సైతం చాలా పంచాయితీలు వచ్చాయి. వీటిని చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్ ధరణి తీసుకురావడంతో ఎలాంటి గొడవలు లేవు. భూమి కౌలుకు ఇస్తే బాండ్లు రాయించాలని చెప్పడం.. రికార్డుల్లో కౌలు రైతుల పేరు చేర్చడం సరికాదు. దీంతో అసలైన రైతులకు, కౌలు రైతులకు మధ్య పంచాయితీ వచ్చే అవకాశం ఉంది. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ నాయకులకు ఓట్లతో తగిన రీతిలో బుద్ధి చెబుతాం.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేకపోవడంతో పంటలు పండించుకోలేకపోయాం. కోతలతో పంటలు పండించాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. రైతులకు కరెంట్ ముఖ్యం. 24 గంటల కరెంట్ ఉండాల్సిందే. లేకపోతే మళ్లీ వ్యవసాయం కష్టంగా మారుతుంది. కేసీఆర్ దయవల్ల ఇప్పుడు బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. నీరు బాగా దొరుకుతుంది. రెండు పంటలు పడుతున్నాయి. నిరంతరాయంగా కరెంట్ రావడంతో ప్రజలకు, రైతులు, వినియోగదారులకు చాలా మంచి వసతి దొరికింది. వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలు కేసీఆర్ వచ్చిన తర్వాతే లేకుండా పోయాయి. మా మద్దతు బీఆర్ఎస్కే.
ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్కు రైతులు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ధరణి ద్వారా భూములకు రక్షణ కల్పిస్తే.. కాంగ్రెస్ దానిని రద్దు చేసి మళ్లీ భూములను భూస్వాముల పాలు చేస్తామంటున్నది. ధరణి రద్దయితే ఆక్రమణదారుల ఆగడాలు పెరుగుతాయి. మళ్లీ పట్వారీ వ్యవస్థ తెచ్చి రోజుకొకరి పేరున భూమి మారే పరిస్థితులు వస్తాయి. అందుకే కాంగ్రెస్ను రానివ్వొద్దు. ధరణిని రద్దుకానీయొద్దు. మా మద్దతు బీఆర్ఎస్కే.
గతంలో పాస్ పుస్తకాలు కావాలంటే చాలా ఇబ్బందులు పడ్డాం. ధరణి రాక ముందు పైరవీకార్లతో కలిసి వెళితే ఏళ్లతరబడి కాని పని ఒక్క రోజులో ధరణి వచ్చిన తర్వాత అయిపోయింది. ఎవరి అవసరం లేకుండా నేరుగా మీ సేవలో వెళ్లి ఎలాంటి లంచాలు లేకుండా పని పూర్తయింది. సామాన్య రైతులకు ధరణితో చాలా ఉపయోగం. కేసీఆర్ వచ్చిన తర్వాతనే భూములకు రేట్లు వచ్చాయి. ప్రతి రైతుకు ధరణితో ధైర్యం వచ్చింది. రైతుబంధు, రైతుబీమా కూడా వచ్చింది. ధరణితో రైతుల కష్టాలు తీరాయి.
ధరణి రాక ముందు చాలా సమస్యలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం భూములకు పట్టాలు ఇచ్చింది. సొతం భూములు పట్టాలు కావాలంటే ఇబ్బందులు పడిన రైతులకు ధరణి రావడంతో ఎంతో భరోసా వచ్చింది. ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం దొరకని సమస్యకు ధరణి వచ్చిన తర్వాత ఒక్కరోజులోనే పాస్ ఫుస్తకం వస్తున్నది. ఎవరికీ లంచం ఇవ్వకుండా రైతు సొంతంగా ఎలాంటి పైరవీలు లేకుండా పని అయిపోతున్నది. గతంలో ఏళ్లతరబడి తిరిగినా కానీ పని ధరణితో వెంటనే అవుతున్నది. పైరవీకారులు లేరు. కేసీఆర్ వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు ఇవ్వడం.. ధరణితో ఎలాంటి సమస్యలు లేవు.
సీఎం కేసీఆర్ తొమ్మిదేన్నరేళ్లుగా అనేక పథకాలు పెట్టి అమలు చేస్తున్నారు. మా ఇంట్లోనే కాదు.. నాకు తెలిసిన ప్ర తి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందించింది. ఇంతమంచి పనులు చేసిన ఏ ఒక్కరూ కేసీఆర్ పాలనను వదులుకోరు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి ఏ అవసరం ఉంటుందో గుర్తించి వారికి అవసరమైన పథకాలు పెట్టి అందజేశారు. మా గ్రామంలో సీసీ రోడ్లు సైతం బాగా వేశారు. ఇంతమంచి సౌలతులు వదులుకొని మూడు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పే నాయకులకు ఓట్లు ఎలా వేస్తారు. చీకటి తొలగించి వెలుగులు తీసుకొచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్. మేము బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తాం.
సీఎం కేసీఆర్ పాలనను ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల వాళ్లు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి వాళ్లు కాపీ కొడుతున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కరెంట్ కూడా చాలా అవసరం ఉంటుంది. అట్లాంటిది మూడు గంటల కరెంట్ మాట మట్లాడిన కాంగ్రెస్ నాయకులను ఎందుకు నమ్మాలి. వారికి అసలు కరెంట్ అంత వద్దు అనే అర్హత లేదు. ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ చాలా అవసరం. ఇండ్లలో ఇస్త్రీ చేసుకునే వాళ్లు కూడా కరెంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంట్ ఇస్తున్నారు. ఇంతమంచి సౌలతు చేసిన సీఎం కేసీఆర్కు నా మద్దతు ఉంటుంది.