ఎనిమిదో విడతలో 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యం
ఖమ్మం జిల్లాలోని 754 ప్రదేశాల్లో పల్లె ప్రకృతి వనాలు
589 నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసిన అధికారులు
ఊరూరా నర్సరీలతో ఇంటింటికీ మొక్కలు
మొక్కల పెంపకంపై ప్రజల్లో పెరిగిన అవగాహన
పచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారంచుట్టింది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పరుచుకునేలా కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు ఏడు విడతలు కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసింది. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరగడంతోపాటు పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. పాఠశాలలు, పార్కులు, ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, రహదారులు, కాలువల వెంట, చెరువు గట్లపై నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో జిల్లా యంత్రాంగం ఎనిమిదో విడత హరితహారానికి సిద్ధమవుతున్నది. 589 నర్సరీల్లో 93.48 లక్షల మొక్కలు పెంచారు. ఈ సారి జిల్లావ్యాప్తంగా 50 లక్షల మొక్కలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవగానే హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టనున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ సంఘాలను భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక రూపొందించారు.
ఖమ్మం, జూలై 6: హరితహారం.. ఈ పదం గురించి, ఈ పథకం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఏర్పడిన తొలి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారాన్ని ప్రారంభించింది. అడవులు తగ్గిపోవడం, వాతావరణ అ సమతుల్యత ఏర్పడడం, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండేవారు. పరిస్థితి అలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకూ మంచిది కాదని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .ఇప్పటి వరకు 7 విడతలుగా హరితహారం నిర్వహించగా ఈ ఏడాది 8వ విడతకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
ఖమ్మం జిల్లాలో 18 చోట్ల బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేశారు. 603 కిలోమీటర్ల పొడవున 2,73,741 మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. 588 గ్రామ పంచాయతీలు, మరో 166 శివారు గ్రామాలు కలుపుకొని మొత్తం 754 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటిలో 13,30,916 మొక్కలను నాటారు. 250 కిలోమీటర్ల పొడవున మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ కింద 1,63,683 మొక్కలను నాటనున్నారు. వీటిలో జాతీయ రహదారులు 76 కిలోమీటర్లు కాగా, రాష్ట్ర రహదారులు 27 కిలోమీటర్లు, ఆర్అండ్బీ రోడ్లు 147 కిలోమీటర్లు ఉన్నాయి. 589 నర్సరీల్లో 93.48 లక్షల మొక్కలు పెంచారు.
ఏపుగా పెరిగిన మొక్కలు..
హరితహారంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదిగి ఎంతో మందికి నీడనిస్తున్నాయి. అటవీ అధికారులు ఫారెస్టు భూముల్లో నాటిన మొక్కలు పెద్దగా ఎదిగాయి. పాఠశాలలు, పార్కులు, ప్రభుత్వ భూములు, కార్యాలయల్లో, రహదారులు, కాలువల వెంట, చెరువుల గట్లపైన నాటిన కోట్లాది మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో సాధారణ ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. దీంతో సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్లయింది.
పల్లెల ముంగిట్లో 86.38 లక్షల మొక్కలు..
నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలకు తగ్గకుండా పంపిణీ చేయనున్నారు. అడవి తంగేడు, సీమ తంగేడు, ఆకాశ్ మల్లె, అర్కెల్లిఫామ్, అశ్వగంధం, అవిష, బాదం, దేవకాంచన, బ్యాంబూ, రేగు, బూరుగు, చామంతి, చింత, క్రాటన్స్, దిరిశినం, డోల్ కాంచన, గచ్చకాయ, గన్నేరు, గంగరావి, గుమ్మడి టేకు, గులాబీ, జామ, జాస్మిన్, జీడి మామిడి, కాదంబ, కానుగ, కరివేపాకు, కర్జూర, కుంకుడు, లిల్లీ, లెమన్గ్రాస్, మద్ది, మలబార్, మామిడి, మంధారం, మర్రి, మారేడు, గోరింటాకు, బొపంపడి, నీరుడు, పారిజాతం, పగడ, రావి, రేలా, సపోట, సింధూరం, తాని, వేప, వీరుమద్ది, వావిలాకు తదితర మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విడత హరితహారం అమలుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతి రోజూ ప్రజలకు అవసరమయ్యే మొక్కలతోపాటు పండ్లు, టేకు, ఉసిరి తదితర మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలోని 500 నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచారు. అటవీ, డీఆర్డీవో, మున్సిపాలిటీ, ఉద్యానవన శాఖలతోపాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో నర్సరీలను నిర్వహిస్తున్నారు.