కొత్తగూడెం అర్బన్, జూన్ 6 : జిల్లాలోని యువతీ యువకులు అవకాశాలను అందిపుచ్చుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నవభారత్లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిశ్రమలు స్థాపించాలంటే కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ తెలంగాణ సిద్ధించాక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సరళీకరణ విధానాల వల్ల నేడు 15 రోజుల్లోనే అన్ని అనుమతులూ మంజూరవుతున్నాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ సులభతరం కావడంతో పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని, టీఎస్ ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు రూ.22, 956 కోట్లతో 429 యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామని, తద్వారా 11,099 మందికి ఉపాధి కల్పించామని వివరించారు. టీ ఐడియా పథకం కింద రాష్ట్ర ఏర్పాటు నుంచి మార్చి మాసాంతం వరకు 274 యూనిట్లకు రూ.26.29 కోట్లు రాయితీ మంజూరైందన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు ఎస్సీలు ఏర్పాటు చేసిన 368 యూనిట్లకు రూ.24.06 కోట్లు, ఎస్టీలు ఏర్పాటు చేసిన 1,010 యూనిట్లకు రూ.47.37 కోట్లు, విభిన్న ప్రతిభావంతులు ఏర్పాటు చేసిన ఒక యూనిట్కు రూ.4 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపన వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక రంగం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా పరిశ్రమలకు నిలయంగా మారిందని అన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. అనంతరం సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్కులు, బెంచీలు అందజేశారు. జిల్లాలో పరిశ్రామిక అభివృద్ధికి తోడ్పడిన సంస్థల అధికారులను సన్మానించారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సీతారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావు, కేటీపీఎస్ 5, 6 దశల సీఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.