ఖమ్మం, అక్టోబర్ 30: కరోనా సమయంలో కానరాని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడొచ్చి ఖమ్మం ప్రజలపై కపట ప్రేమను చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. మరి మొన్న వచ్చి మున్నేరు వరదలప్పుడు ఆయన ఏమయ్యారని, ఎక్కడున్నారని ప్రశ్నించారు. అదే వరదల సమయంలో తాను అర్ధరాత్రి వేళ నడుములోతు నీళ్లలోకి దిగి త్రీటౌన్లోని పరీవాహక ప్రాంత ప్రజలను ఒడ్డుకు చేర్చానని గుర్తుచేశారు. కానీ తుమ్మల ఆ సమయంలో ప్రాణభయంతో హైదరాబాద్లో ఏసీ రూములో కూర్చున్నారని విమర్శించారు. మళ్లీ ఆయనను గెలిపిస్తే ఉదయం హైదరాబాద్కు, రాత్రి సత్తుపల్లికి వెళ్లిపోతాడని విమర్శించారు. ఖమ్మం ప్రజలు ఆలోచించాలని, వారి కోసం నిలబడే మనిషికి ఆదరించాలని కోరారు. మీ ఆపదలో అండగా నిలిచిన తనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో సోమవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. 42వ డివిజన్ నిజాంపేటలో మైనార్టీ నాయకులు శంషుద్దిన్, ముజాహిద్, నయిం, షబ్బీర్ మజీద్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో, 52వ డివిజన్ మైనార్టీ నాయకుడు ఫకృద్దిన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల్లో మాట్లాడారు. ఖమ్మం ప్రజల కోసమే తాను రాజకీయాల్లో ఉన్నానని, ఇతరులకు అమ్ముడు పోయే సరుకు తనకు అవసరం లేదని, నిఖార్సైన సరుకు తనకు చాలని అన్నారు. ఖమ్మం నగరాభివృద్ధి కోసం తాను పడిన కష్టం మీకు తెలుసని అన్నారు. అదే సమయంలో ప్రజలు కష్టాల్లో కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ వచ్చి పలుకరించలేదని అన్నారు. పైగా తాను చేసిన అభివృద్ధిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఖాసిం రజ్వీతో పోల్చడం విచారకరమని అన్నారు. అయినా తనకేమీ కాదని, తాను అందరి మన్ననలూ పొందిన వాడినని అన్నారు. ఖమ్మ ప్రజలు ఈ సారి కూడా తనను గెలిపిస్తే ఐదింతల అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, ఖమర్, మక్బూల్, షౌకత్ అలీ, ఇస్సాక్, మజీద్, బబ్లు, బద్రి, గురుమూర్తి, లింగరాజు, నాని, పాషా, షబ్బీర్, డాక్టర్ పువ్వాడ నరేన్, పగడాల నాగరాజు, దోరేపల్లి శ్వేత, బుర్రి వెంకట్కుమార్, బత్తుల తిరుమల రావు, సూత్రాల శ్రీనివాస్, బుర్రి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మానికి చెందిన పలువురు ప్రముఖులను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రేఖల భాసర్, జహీర్ అలీ, మందడపు బ్రహ్మరెడ్డి తదితరులను కలిసి మద్దతు కోరారు.
బీఆర్ఎస్ నాయకులు సరుపుడి సతీశ్, సరిపుడి గోపి సందేశ్ల నాయనమ్మ సరిపుడి తులిశమ్మ మృతి పట్ల మంత్రి అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిరుమామిళ్ల లక్ష్మి, కొత్తపల్లి నీరజ, పైడిపల్లి రోహిణి, జాబిశెట్టి శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.