కూసుమంచి, ఆగస్టు 22 : ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటికి ప్రజల మద్దత్తు పూర్తిగా లభిస్తున్నది’ అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మరో నాలుగు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారని పేర్కొన్నారు. పాలేరు టికెట్ తనకు కేటాయించిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు కందాళ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రశ్న : ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా?
జవాబు : తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో అందుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలన్నీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆ పథకాలే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయి. విమర్శలు చేసే వారు ఒక్కసారి జరిగిన అభివృద్ధిని కూడా చూడాలి.
ప్ర : టికెట్ రావడంపై ఎలా ఫీల్ అవుతున్నారు?
జ : పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా టికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నా. సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తా.
ప్ర : వచ్చే ఎన్నికల్లో మీ విజయానికి అవకాశాలు ఏమిటి?
జ : స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరాలకు తగినట్లుగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఆయా పథకాలతో ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరుతోంది. భవిష్యత్లో ఆ పథకాలన్నీ కొనసాగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది.
ప్ర : ఇంకా మీ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా?
జ : అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దానిని ఎప్పటికీ కొనసాగించాలి. ఎప్పుడూ కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇంకా కొన్ని మిగిలిపోయిన చిన్నచిన్న పనులు ఉన్నాయి. వాటిని కూడా వెంట వెంటనే పూర్తి చేస్తా.
ప్ర : వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే అంశం?
జ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు. ప్రతి పేదవాడే లక్ష్యంగా చేపట్టిన పనులు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో చేస్తున్న అభివృద్ధి పనులు. సొంతంగా తాను చేపట్టిన సేవా, అభివృద్ధి కార్యక్రమాలు.
ప్ర : మీ పదవీ కాలంలో చేపట్టిన పనుల్లో ముఖ్యమైనవి?
జ : కరోనాతో రెండున్నరేళ్లు ఇబ్బందులు పడ్డాం. మళ్లీ ఏడాది కాలంగా పనులు గాడిలో పడ్డాయి. వాటిలో ముఖ్యంగా నాలుగు మండలాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం, చెక్డ్యాంలు, జేఎన్టీయూ కాలేజీ, తిరుమలాయపాలెం ఆస్పత్రి వంద పడకలకు అప్గ్రేడ్, నర్సింగ్, మత్స్య పాలిటెక్నికల్ కళాశాల, ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు సొంత ఖర్చుతో అన్ని కులాలు, మతాలకు మందిరాలు, పేద విద్యార్థుల చదువుకు సాయం అందిస్తున్నా.
ప్ర : ఓటర్లకు మీరేమి చెప్పదల్చుకున్నారు?
జ : ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోండి. ఎన్నికల సమయంలో వచ్చే వారితో జాగ్రత్త. ఇతర పార్టీల వారు చెప్పేవన్నీ మాటలనే విషయాలను ప్రజలు గ్రహించాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నా.