తెలంగాణ రైతులను కేంద్రమంత్రి పీయూష్ అవమానించారు
రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు
అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఖమ్మం జడ్పీ చైర్మన్
ముదిగొండ, ఏప్రిల్ 16: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరితే.. మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించండంటూ ఆయన అవమానించారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు గుర్తుచేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారని స్పష్టం చేశారు. రైతును రాజు చేయాలని కంకణం కట్టుకున్న కేసీఆర్.. అన్నదాతలకు అన్ని వనరులూ సమకూర్చారని అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనకున్నా ఆయనే కొనేందుకు ముందుకొచ్చారని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండలంలోని గోకినేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.మూడు నాలుగు వేల కోట్లు నష్టం వచ్చినా ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చిందని అన్నారు.
రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ సామినేని హరిప్రసాద్, సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీఎం చిన్న వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ వేములు శ్రీనివాసరావు, ఎంపీటీసీ రాంబాబు, రైతుబంధు సమితి కన్వీనర్ పోట్ల ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, తోట ధర్మారావు, మీగడ శ్రీనివాస్, చావా శరత్, మందరపు ఎర్ర వెంకన్న, చెరుకుపల్లి భిక్షం, నానబాల కిరణ్, నీరుకొండ సతీశ్, చిరుమర్రి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 12 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.