తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఇస్తున్న విద్యుత్పై కాంగ్రెసోళ్లు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడంపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. మేము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తాం.. 10హెచ్పీ మోటర్లు కొనుక్కొని పంటలు పండించుకోవచ్చని ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహించింది. సీఎం కేసీఆర్ ఇస్తున్న ఉచిత విద్యుత్తో రంది లేకుండా రెండు పంటలు పండించుకుంటుంటే.. కాంగ్రెస్ నాయకులు రైతులపై కక్షసాధింపు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ధరణి పోర్టల్తో రైతుల భూములు మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే.. కన్నుకుట్టిన కాంగ్రెసోళ్లు దాని స్థానంలో భూమాత పోర్టల్ను తెచ్చి కౌలుదారుల కాలం పెడతామని చెప్పడం మమ్ముల్ని ముంచేందుకు చేసే కుట్రే అంటున్నారు. కాంగ్రెసోళ్లను ఎప్పటికీ నమ్మేది లేదని, రైతుల పక్షాన నిలిచిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు.
ఖమ్మం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగుభూమిలో నాగలిపట్టి.. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు తెలుస్తుంది కష్టమంటే. ఖద్దరు చొక్కాలేసుకొని పొలం గట్లపై కూర్చొని మాట్లాడే కాంగ్రెసోళ్లకు ఏం తెలుసు వ్యవసాయమంటే. విత్తు నాటినప్పటి నుంచి వడ్ల గింజలు ఇంటికి చేరే వరకు రైతు ఎంత యాతన పడుతాడో చెమటోడ్చినోళ్లకే తెలుసు. సాగు షురూ కావాలంటే నీటితోనే పని.. బావులున్నా, బోర్లున్నా కరెంటుతోనే తతంగమంతా ముడిపడి ఉంది. మునుపు కాంగ్రెసోళ్లు కరెంటిచ్చినప్పుడు పంటకు గ్యారెంటీ లేదు. వేళాపాళా లేని కోతలు.. కరెంటు వచ్చినా లో వోల్టేజీ సమస్యలు.. ఓవర్ లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం.. మోటరు పెట్టగానే మడి తడవకముందే మళ్లీ కరెంటుపోవడం నిత్యకృత్యం. కంటిమీద కునుకు లేకుండా రైతులు పొలాలకాన్నే జాగారాలు.. చీకట్లో పాములు, విషపురుగులు కరిచినా దిక్కులేని పరిస్థితులు.
ఆనాటి కరెంటుతో ఎకరం పొలం తడవాలంటే రోజులతరబడి పంట పొలాలకాన్నే పడిగాపులు. కానీ.. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో అంతా మారింది. 24 గంటలు ఇస్తున్న ఉచిత విద్యుత్తో రైతులు రెండు పంటలు సంబురంగాపండించుకుంటున్నరు. ధరణి పోర్టల్ను తీసుకొచ్చి రైతుల భూములకు రక్షణ కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లను సులభతరం చేసింది. దీనిపై కన్నుకుట్టిన కాంగ్రెసోళ్లు మళ్లీ పాత పాట పాడుతున్నరు. మూడు గంటల కరెంటుతో రైతులను ముప్పుతిప్పలు పెడతామని, 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని, ధరణి స్థానే భూమాతను తెస్తామని అవగాహన, పొంతన లేని మాటలు మాట్లాడుతున్నరు. ఇది నచ్చని రైతాంగం కాంగ్రెసోళ్ల తీరుపై కన్నెర్రజేస్తోంది. అవగాహన లేని నాయకుల మాటలు నమ్మితే నట్టేట మునుగుతామని ముక్తకంఠంతో నినదిస్తున్నది. రైతులను పక్షాన నిలిచిన బీఆర్ఎస్కే మా మద్దతు అంటూ నొక్కి చెబుతున్నది.
మన రాష్టంలో ఉన్న లక్షలాది మంది రైతుల భూములకు భద్రత కల్పించి ఒక్కపైసా తీసుకోకుండా పట్టా పాసు పుస్తకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అప్పట్లో కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొత్త పుస్తకాలకు రైతులు లంచాలు కట్టాల్సి వస్తుందన్నారు. ధరణి రావడం వల్లనే కొత్త పుస్తకాలు వచ్చాయి. భూములు భద్రంగా ఉన్నాయి. రేవంత్రెడ్డి పూటకు ఒక మాట చెప్పి రైతులను ఆయోమయం చేసుడు తప్ప మరేం లేదు. సీఎం కేసీఆర్ దయతో ఇప్పుడిప్పుడే దేశంలో మాన రాష్టం గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. పదేండ్ల సంది అడ్రస్లేని నాయకులు ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడడం మంచి పద్దతి కాదు. రైతుల కోసం కేసీఆర్ ఉన్నాడు.. ఆయన ఉన్నంతకాలం సాగుకు ఎలాంటి బాధ లేదు. బీఆర్ఎస్కే మా మద్దతు.
రైతులకు పంటల పెట్టుబడి సాయం ధరణి ద్వారానే అందుతుంది. ఇంతమంచి పనికి కాపలాగ ఉంటున్న ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎట్ల వస్తది.. అసలు రైతులకు ఎంత భూమి ఉంది అనేది దాని ద్వారానే తెలుస్తుంది. మళ్లీ కాగితాలు, పహణీ నకల్ విధానం అంటే దళారులకు బారులు తీసినట్టే. మాకు ధరణి వలన ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పట్టా పాసుపుస్తకం ఇచ్చారు. అసలు ధరణి తీసివేయాలని ఏ రైతు చెప్పిండో కాంగ్రేసోళ్లు తేల్చి చెప్పాలి. ఉన్నది నాశనం చేసుడు తప్ప.. మరేం లేదు.
భూములు పట్టాలో ఎక్కాలి అంటే చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు అలాంటి సమస్య లేదు. పైరవీలు లేవు. కేసీఆర్ వచ్చిన తరువాత పాస్ పుస్తకాలు ధరణిలో అవుతున్నాయి. ఎవరికీ లంచం ఇవ్వకుండా రైతు సొంతంగా ఎలాంటి పైరవీలు లేకుండా పని అయిపోతుంది. గతంలో ఏండ్ల తరబడి ఇక్కట్లు పడ్డం. ఇప్పుడు సులువుగా అవుతున్నాయి. ధరణితో భూములకు భద్రత వచ్చింది. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా నేరుగా పట్టాపాస్ పుస్తకాలు వస్తున్నాయి. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ధరణి రైతులకు వారి భూములకు భద్రతతో పాటు పట్టాపాస్ పుస్తకాలు ఇండ్లకు వస్తున్నాయి. ధరణి ఉండాలి. 24 గంటల కరెంట్ ఉండాలి. మళ్లీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమే రావాలి. బీఆర్ఎస్కే మా మద్దతు.
కరెంట్ కష్టాలతో వ్యవసాయం వదిలి పోయిన వాళ్లు ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తరువాత కరెంట్ కష్టాలు పూర్తిగా తీరాయి. కాంగ్రెస్ రాత్రుళ్లు కరెంట్ ఇచ్చిన రోజుల్లో అక్కడే జాగారం చేసే వాళ్లం. ఇప్పుడు పూర్తిగా కరెంట్ అందడంతో మిరప తోట, పొలం వేశాను. ఇప్పుడు చాలా బాగా ఉంది. సాగునీరు కూడా బాగా అందుతుంది. రైతులకు కరెంట్ ముఖ్యం 24 గంటల కరెంట్ ఉండాల్సిందే.. లేకపోతే మళ్లీ వ్యవసాయం కష్టంగా మారుతుంది. కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు.
కరెంట్ కోతలతో రాత్రిళ్లు జాగారం చేసినం. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. కేసీఆర్ వచ్చిన తరువాత ధరణితో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాస్ పుస్తకాలు చేసుకుంటున్నారు. రాత్రి కరెంట్తో అక్కడే ఉండే వాళ్లం. పోలాలకు పోవాలంటే భయం అయ్యేది. రాత్రి పూట కరెంట్ కష్టాలు కేసీఆర్ సారు వచ్చినాక తీరినయ్. 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల ఇబ్బంది లేకుండా పంటలు పండించుకుంటున్నారు. 10 హెచ్పీ మోటర్లు మేము కొనలేం.. అంతభారం మోయలేం.. కరెంట్ 24 గంటలకు ఉండాలి, ధరణి లేకపోతే మళ్లీ పైరవీకార్లదే రాజ్యం అవుతుంది. అందుకే కేసీఆర్కే మా ఓటు
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, ధరణీ పోర్టల్ ప్రారంభంతో రాష్ట్రంలోని రైతులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. ఈ మధ్యనే నేను కొంత పొలం, ప్లాటు కొనుగోలు చేసి ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా మీ సేవలో స్లాటు బుక్ చేసుకొని తహసీల్ కార్యాలయంలో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. రైతులు జిల్లా కేంద్రానికి కాకుండా సొంత మండల కేంద్రంలోనే సమయాభావం లేకుండానే పూర్తి పారదర్శకతతో మేలు జరగడం సంతోషంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర జాతిపిత సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతులకు 7 గంటల సరఫరా నుంచి 24గంటలకు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరాతో రైతులంతా పగటిపూటనే వ్యవసాయం చేస్తున్నాము. మరో 30 ఏళ్లు సీఎం కేసీఆర్ అధికారంలో ఉంటూ రైతులకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. ఆయనకే మా మద్దతు.
కాంగ్రెస్ను, కాంగ్రెస్ నాయకులను మూడు గంటల కరెంట్ అడిగింది ఎవరు. మూడు హెచ్పీ కాకుంటా పది హెచ్పీ పెట్టుకుంటామని మేము ఆయనకు చెప్పామా.. అంతపెద్ద మోటార్ కొనాలంటే డబ్బులు ఎవరిస్తారు. ఒకవేళ కొనుక్కున్నా ఆ మోటర్ నుంచి వచ్చే నీళ్లను ఆపలేం. మిర్చితోటలకు నీళ్లు కట్టేదెట్టా. ఒకసారి మూడు గంటల కరెంట్ అని కాంగ్రెస్ వాళ్లు చెప్పారు. మళ్లీ అందరూ రైతులు తిట్టగానే పది హెచ్పీ ఇంజన్లు అని మాట మార్చారు. అసలు కరెంట్ ఇచ్చే శక్తి వాళ్లకు లేదు. గతంలో వాళ్లు కరెంట్ ఇవ్వలేక పోవడం వలనే పంట పొలాలు ఎండిపోయాయి.
కాంగ్రీసోల్లు ఏలినప్పుడు కోతలు తప్ప కరెంటు యాడున్నది? కరెంటు ఎప్పుడొస్తదా అని లైటు వేసి చూసుడే సరిపొయ్యేది. అప్పట్లనే ఆరు గంటల కరెంటని మూడు గంటలు కూడా ఇచ్చెటోల్లు కాదు. మల్లా కరెంటెప్పుడు పొతదేమోనని భయపడేటోల్లం. కరెంటున్నప్పుడే పొలానికి నీల్లు కట్టాలనే ఊరికేటోల్లం. అందరం ఒక్కటేసారి మోటర్లు ఏసేటోల్లం. అట్ట ఏసినమో లేదో ఇట్ట ట్రిప్ అయ్యేది. మల్లా కరెంటు వచ్చిందాక గోసే. ఇన్ని కష్టాలల్ల యగసాయం చేస్తె సగం పంట కూడా చేతికొచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏ రందీ లేదు. బాయిల నీళ్లు పుష్కలంగున్నయి. ఎప్పుడు తడి పెట్టాలంటె అప్పుడే మోటరేస్తున్నం. పగటి పూట్నే పొలానికి నీళ్లు కట్టి పొద్దుగూక ఇంటికి పోతన్నం. ఆయల్ల ఇట్టుండెనా? పొద్దుందాక ఇంటికాడుండి.. రేత్రిపూట పొలానికొచ్చెటోల్లం. అప్పటి కాంగ్రీసోల్లు అర్ధరాత్రి కరెంటిస్తె మేము అప్పుడే నీళ్లు కట్టేటోల్లం. కేసీఆర్ సారు వచ్చినంక రాత్రి పూట పొలానికొచ్చే అక్కెరే లేకుంట పోయింది. బీఆర్ఎస్కే మా మద్దతు.
ధరణి పోర్టల్ను తీసేస్తమని కాంగ్రీసోల్లు యమచెప్పినా చెప్పున్నరు. మరి ధరణి లేకపోతే రైతులకు పథకాలన్నీ ఎట్టిస్తరంట? అసలు పట్టాబుక్కుల రైతు పేరు లేదనో, రైతుకు పట్టాబుక్కు లేదనో అసలు పథకాలు ఎగ్గొడతరా ఏంది? లేకపోతె మల్లా వీఆర్వోలను తెస్తరా? ఇక వీఆర్వోల చుట్టూ, ఏవోల చుట్టూ తిరగమని చెప్తరో ఏమో. రైతుల పేర్లు, పంట ఇవరాలు ధరణిలోనే ఉన్నయి. ఇప్పుడు వీల్లొచ్చి దాన్ని తీసేస్తె మా పేర్లన్నీ ఏంగావాలె. పేర్లు ఎక్కిచ్చుకోవాల్నంటే ఒకల్ల కాడికి, ఏం పంట ఏసినమో చెప్పుకోవాల్నంటె ఇంకొకల్ల కాడికి తిరగాలె. అప్పట్ల తాసీల్ ఆపీసుకు పొతె యమగోస పడేటోల్లం. వీఆర్వో ఉంటె ఆర్ఐ ఉండెటోడు కాదు. మల్లొకసారి పోతె ఆర్ఐ ఉంటే ఎమ్మారావు ఉండెటోడు కాదు. తిరిగి తిరిగి యాసారి పోయొటోల్లం. ఇప్పుడు కేసీఆర్ సారు ధరణి తెచ్చినంక ఈ తిప్పలేమీ లేవు. ధరణితోనే అన్ని పనులూ అయిపోతన్నై. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ ఎరువులు, వడ్ల డబ్బులు అన్నీ ధరణితోనే అయితన్నై. ఇప్పుడీ కాంగ్రీసోల్లొచ్చి ధరణిని తీసేసి రైతులకు పథకాల్లెవ్వని బందు పెడతరా ఏంది?
కాంగ్రెసోళ్ల మాటలు సోయి ఉన్న మాటలో సోయి లేని మాటలో తెల్వట్లేదు. మూడు గంటల కరెంటంటన్రు. పెద్ద పెద్ద మోటర్లంటన్రు. చిన్న మోటరేస్తె వాళ్లిచ్చే మూడు గంటల కరెంటుతోటి సగం పొలం కూడా తడవదు. పెద్ద మోటర్లు పెట్టాల్నంటే అన్ని డబ్బులు ఎక్కడియి. ఒకాల పెద్ద మోటర్లు పెట్టి వాళ్లిచ్చిన మూడు గంటలప్పుడు అందరూ ఒక్కసారే పెద్ద మోటర్లేస్తె ఊరు ఉంటానికాపోటానికా. ఇప్పుడున్న కరెంటుకు ఏమైందంట? రోజుమొత్తం కరెంటుంటే ఎప్పుడైనా నీళ్లు పట్టుకుంటం. కేసీఆర్ సారు కరెంటు మంచిగనే ఇస్తండు. మాకు రెండెకరాల పొలం ఉంది. ఇంకో రెండెకరాలు కౌలుకు తీస్కున్నం. మంచిగ యగసాయం చేస్తన్నం. పెద్ద మోటర్లు పెట్టి నీళ్లు మొత్తం తోడితే మళ్లీ యాన్నుంచి ఊరతయ్.?
రెవెన్యూ వ్యవస్ధలో సమూల మార్పులు చేసి రైతులకు మేలు చేసే ధరణి పోర్టల్ ప్రక్రియ ప్రారంభంతో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల అంశాల్లో రైతులకు పారదర్శకత లభిస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు ఒకచోట, మ్యుటేషన్లు మరోచోట కాకుండా రైతుకు ఇబ్బంది కలగకుండా ఒక్కచోటునే అన్ని పనులు పూర్తి చేయడమే కాకుండా పాస్ పుస్తకాలు వెంటనే మంజూరి చేయడం రైతులకు వరం లాంటిది. ఎలాంటి అవినీతికి తావు లేకుండా రైతులకు లబ్ధిచేకూర్చే పథకాలు సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యం. రైతు ముఖ్యమంత్రిగా ఉండడం వలన వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు. రైతులకు మేలు చేసే ధరణీ తీసివేస్తాం అని ఎవరైనా అంటే ఓటు రూపంలో తగిన సమాధానం చెప్తాం. మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే.
ఉమ్మడి కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో నానా అవస్థలు పడ్డాం. ఎకరం, రెండెకరాలకు నీరు పారితే గగనంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో 3హెచ్పీ, 5హెచ్పీ మోటర్లు సరిపోతున్నాయి. 10హెచ్పీ మోటర్లు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఉచిత సలహా ఇస్తున్నారు. దీనికి రూ.లక్ష పైనే ఖర్చవుతుంది. బోర్లు కూడా త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ నాయకులకు సాగుపై అవగాహన లేక అలా మాట్లాడుతున్నారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్కే మా మద్దతు.
కాంగ్రెస్ నాయకులు ఇస్తానన్న మూడు గంటల కరెంటుతో నారుమడులు కూడా తడవవు. మూడు గంటల కరెంటు, 10హెచ్పీ మోటర్లతో రైతులకు ఎలాంటి లాభం ఉండదు. రైతులంతా మోటర్లు ఒకేసారి ఆన్చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయి. మళ్లీ రైతుల గోస మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుండడంతో పంటలు చక్కగా పండించుకుంటున్నాం. 10హెచ్పీ మోటర్లతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి బోర్లు ఎండిపోతాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు రైతులు నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్కే మా మద్దతు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే పొలాలకు నీళ్లు సరిపోక వ్యవసాయం చేయడం కష్టమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు సాగులో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలవుతాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను అందిస్తుండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయాన్ని సాగు చేసుకోగలుగుతున్నాం. మా మద్దతు బీఆర్ఎస్కే. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్యే మళ్లీ అధికారంలోకి రావాలి.
కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూ రికార్డులన్నీ పకడ్బందీగా ఉన్నాయి. ఇటీవల గిరిజన రైతులకు ఇచ్చిన పోడు పట్టాలు సైతం ధరణిలో రికార్డు కావడంతో మాకు రైతుబంధు వర్తించింది. మళ్లీ పాతకాలం పద్ధతిలో రెవెన్యూ పహణీలంటే తహసీల్దార్ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ధరణి కొనగాల్సిందే. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. మా మద్దతు బీఆర్ఎస్కే.
దరణి రద్దు చేస్తే మళ్లీ దళారుల ఆగడాలు మళ్లీ మొదలవుతాయి. గత ప్రభుత్వ హయాంలో వీఆర్వోలు, మధ్య దళారుల ఆగడాలతో భూ రికార్డులు మారి అక్రమలకు గురయ్యేవి. సాగు చేసుకుంటున్న రైతు భూమి రికార్డుల్లో దళారుల పేరున ఎక్కేవి. సీఎం కేసీఆర్ వచ్చాక రైతుల భూములకు రక్షణ ఏర్పడింది. రైతు వేలు ముద్రతో యితరులకు రిజిస్ట్రేషన్ చేయిస్తే తప్ప రికార్డులో భూమి బదిలీ జరగదు. అలాంటి ధరణిని కాంగ్రెస్ రద్దుచేస్తామనడం అన్యాయం. మన భూములు మనకు భద్రంగా ఉండాలంటే ధరణి ఉండాలి.
కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి వ్యవసాయం గురించి తెలియదు. పంటలకు ఎన్ని గంటల కరెంటు అవసరమో తెలిస్తే మూడు గంటలు చాలు అని ఎలా అంటారు. మూడు గంటల కరెంటుకు మూడు మడులు కూడా తడవవు. 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ను కాదని కాంగ్రెస్కు ఓటు వేస్తే రైతులు మళ్లీ కరెంటు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. కాంగ్రెస్ గెలిస్తే అన్నదాతలు అరిగోస పడక తప్పదు. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.
10హెచ్పీ మోటరు పైపులకు ఖర్చు ఎక్కువై ఆర్థిక సమస్య తలెత్తుతుంది. ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. గత ప్రభుత్వాల పాలనలో కరెంటు కోతలతో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ సర్కార్ 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో కష్టాలు తీరాయి. కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయంపై అవగాహన లేక రైతులకు 3 గంటలు చాలు.. 10హెచ్పీ మోటార్లు పెట్టుకోండి అంటున్నారు. ఆ మాటలు వారి అవగాహన లేమికి నిదర్శనం. తెలంగాణ సర్కార్ వచ్చాకే రైతుల దశ, దిశ మారింది. కాంగ్రెస్కు ఓటేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. కాంగ్రెస్ వచ్చుడు లేదు.. సచ్చుడు లేదు. మా మద్దతు బీఆర్ఎస్కే.
కాంగ్రెస్ వాళ్లు చెప్పినట్లు మూడు గంటలు కరెంటు ఇస్తే మళ్లీ పాత రోజులే తిరిగి వస్తాయి. పొలాలు ఎండిపోయి రాత్రిళ్లు కాపలా కాసే పరిస్థితి మొదలవుతుంది. మరోపక్క 10హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటున్నారు. 10హెచ్పీ మోటర్లతో లోడుపడి మోటర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయి పంట లు ఎండిపోతాయి. రైతులు అప్పుల పాలై మళ్లీ వ్యవసాయం మొదటికొస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటలతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. మళ్లీ ఆ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. మా మద్దతు బీఆర్ఎస్కే.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో దళారులు, మధ్యవర్తుల ప్రమేయంలేదు. ఆన్లైన్ కావడంతో తహసీల్దార్ కార్యాలయంలో క్షణాల్లో పనైపోతుంది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. భూ రికార్డుల సమస్యలు తప్పాయి. కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేస్తామని చెబుతున్నారు. ఇక మళ్లీ పాతరోజులే మొదలవుతాయి. భూ రికార్డులు తారుమారై ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా ప్రతి రైతుకు పట్టాదారు పాస్పుస్తకం చేతికి రావడంతో రైతుబంధు కూడా సక్రమంగా రైతుల ఖాతాల్లో జమవుతుంది. ధరణి వచ్చాక రైతుల భూ సమస్యలు తీరి ప్రశాంతంగా ఉన్నాం. ధరణి తీసేస్తే మళ్లీ పాతరోజులే. మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే.
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా మూడు గంటలు విద్యుత్ ఇస్తే వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం రోజంతా విద్యుత్ సరఫరా ఉండడంతో అవసరమైన సమయంలో బోర్ల పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేస్తున్నాం. మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయితే పంటలు నిలువునా ఎండిపోతాయి. బోర్లలో 3హెచ్పీ, 5హెచ్పీ మోట ర్లకు సరిపడా నీరుంది. 10హెచ్పీతో వ్యవసాయం సాగనేది అసాధ్యం. ఉచిత కరెంటు ఇచ్చే బీఆర్ఎస్కే మా మద్దతు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు రైతులకు తెలియనివి కావు. ఇంటికి కూడా వెళ్లకుండా బావులు, బోర్ల వద్ద కరెంటు కోసం పడిగాపులు కాచిన రోజులు మర్చిపోలేదు. కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోయిద్దో తెలిసేది కాదు. లో విద్యుత్తో మోటర్లు తరుచూ కాలిపోయేవి. సీఎం కేసీఆర్ వచ్చాక కరెంటు కష్టాలు తప్పాయి. 24గంటల కరెంటు ఇస్తుండడంతో ఎప్పుడంటే అప్పుడు చేలకు నీళ్లు పెట్టుకుంటున్నాం. మళ్లీ కాంగ్రెస్ను గెలిపిస్తే కరెంటు కష్టాలు తప్పవు. పాత రోజులు మళ్లీ చూడాల్సి వస్తది. కరెంటు కష్టాలు లేకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ను గెలిపించుకుంటాం. బీఆర్ఎస్కే మా మద్దతు.
రైతులు కాంగ్రెస్ నాయకులను, ఆ ప్రభుత్వాన్ని నమ్మే రోజులు పోయాయి. మళ్లీ రైతులను నమ్మించి మోసం చేయాలని వస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడూ 24 గంటల ఇద్దామన్న ఆలోచనే చేయలేదు. కనీసం రైతు చచ్చిపోతే ఆ కుటుంబం ఎలా ఉంది అని మందలించిన వాళ్లు లేరు. కాంగ్రెసోళ్లకు ఎన్నికలు వచ్చినప్పుడే రైతులు గుర్తుకు వస్తరు. నా బొందిలో పాణం ఉన్నంతవరకు కరెంట్ విషయంలో కాంగ్రెస్ను నమ్మను. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. ఆగమాగమైన కరెంట్ను ఎంతోమంచిగా సీఎం కేసీఆర్ చేసిండ్రు. ఇప్పుడు 24 గంటలూ కరెంట్ ఉంటుంది. రేవంత్రెడ్డి ఎన్ని కథలు చెప్పినా.. సీఎం కేసీఆర్ మరువలేను.