CM KCR | తెలంగాణ ఉద్యమ లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు.. కొట్లాడి కొత్త రాష్ట్రం సాధించుకున్నాం.. ఉద్యమ రథసారథి కేసీఆర్ తెలంగాణ పగ్గాలు అందుకున్నారు. ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా ఏ లక్ష్యాల కోసం పోరాటం చేశామో వాటిని సాధించి తీరారు. ప్రధానంగా రాష్ట్రంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా అద్భుత ప్రగతిని సాధించి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచింది. నెర్రలుబారిన బీడుభూములు సస్యశ్యామలమయ్యాయి. పాలేరు పాత కాలువ, పాలెంవాగు ప్రాజెక్టు ప్రారంభమైంది. దశాబ్దాల నాటి పాత కాలువల్లో సాగునీరు ప్రవహిస్తున్నది. కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధానంగా ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై బుధవారం ఉమ్మడి జిల్లా ప్రజలు సంబురాలు జరుపుకోనున్నారు. ఖమ్మం మున్నేరు వద్ద జరిగే వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
-ఖమ్మం, జూన్ 6
ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ), జూన్ 6: కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంపై ఫోకస్ పెట్టి విజయవంతంగా ప్రగతిని సాధించారు. ఒకవైపు పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూనే మరోవైపు చిన్ననీటి పారుదలరంగాన్ని పునర్వ్యవస్థీకరించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీడు భూములు సైతం సాగులోకి వచ్చి సస్యశ్యామలమయ్యాయి.
కిన్నెరసానికి మహర్దశ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని ప్రాజెక్టు కాలువల నిర్మాణం పనులు ఏళ్ల తరబడి పూర్తికాకుండా ఉన్నాయి. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 8.4 టీఎంసీలు. 2006లో ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు పూర్తి చేయలేదు. పనులన్నీ లోపభూయిష్టంగా జరిగాయి. 2012లో ఈ ప్రాజెక్టు కుడి కాలువ నుంచి కేవలం 2వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. ప్రాజెక్టును పూర్తిచేసి ఆయకట్టు 10వేల ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతాంగానికి కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ నుంచి సాగునీరు అందిస్తున్నారు. లెఫ్ట్ కెనాల్ 20.06 కిలోమీటర్ల పొడవునా నిర్మించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కుడి కాలువ నుంచి 3 వేల ఎకరాలకు, లెఫ్ట్ కెనాల్ నుంచి కొత్తగూడెంలో 2100, పినపాకలో 4,900 ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
కొత్త చెక్డ్యామ్లు
ఖమ్మం జిల్లాలో 8 చెక్డ్యామ్ల ద్వారా 2,678 ఎకరాలు సేద్యంలోకి వచ్చాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.48.59 కోట్ల ఖర్చు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 చెక్డ్యామ్లను నిర్మించారు. వీటికోసం ప్రభుత్వం రూ. 235.30 కోట్లు ఖర్చు చేసింది.
119 పెరిగిన సాగు విస్తీర్ణం 2014 తర్వాత రైతుల పంటలకు భరోసా కల్పించేందుకు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. దీంతో నీటి వనరులు పుష్కలమయ్యాయి. తరువాత అమాంతంగా 119 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 2,849 చెరువులు ఉండగా అందులో ఫస్ట్ ఫేజ్లో 558 చెరువులను రూ.94.29 కోట్ల నిధులతో మరమ్మతులు చేయించారు. సెకండ్ ఫేజ్లో 636 చెరువుల మరమ్మతులకు రూ.137.80 కోట్ల నిధులను వెచ్చించారు. థర్డ్ ఫేజ్లో 279 చెరువులను రూ.59.85 కోట్ల నిధులతో తీర్చిదిద్దారు. ఫోర్త్ ఫేజ్లో 187 చెరువులకు రూ.75.14 కోట్లతో మరమ్మతులు చేయించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,660 చెరువుల్లో రూ.362.77 కోట్ల నిధులతో పూడిక తీయించి ఆయకట్టు స్థిరీకరణ చేయించారు. దీనివల్ల భూగర్భజలాలు 7.93 మీటర్ల ఎత్తుకు వచ్చాయి.
సీతమ్మ బరాజ్..
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు దానికి దిగువ భాగంలో సీతమ్మ బరాజ్ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తోంది. 36.75 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతోపాటు 320 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. రూ.3,481 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు కాగా.. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పాలేరు నియోజకవర్గంలో భూములు భక్తరామదాసు ప్రాజెక్టుతో సస్యశ్యామలమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా చరిత్రకెక్కిన పాలేరు నియోజకవర్గంలో కేవలం 11 నెలల్లో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేసి చరిత్ర సృష్టించారు. రూ.339.59 కోట్లతో ప్రాజెక్టును నిర్మించి నియోజకవర్గం మొత్తాన్ని కృష్ణా జలాలతో పచ్చని పొలాలుగా మార్చారు. 60 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు, ఎస్సారెస్పీ కాలువల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పాలేరు జలాశయం ఎగువ భాగం నుంచి(బ్యాక్ వాటర్) ద్వారా ఎత్తిపోతల ద్వారా కృష్ణాజలాలను తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వరకు పైపులైన్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇందుకోసం కూసుమంచి మండలంలోని ఎర్రగడ్డ తండాలో భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అక్కడి నుంచి ఎస్సార్సీఎస్పీ డీబీఎం 60 కాలువల్లో నీటిని విడుదల చేస్తున్నారు. 160కిలోమీటర్లపాటు కాలువను పూర్తిచేశారు. ప్రధాన కాలువలతోపాటు మైనర్, మేజర్ కాలువలను నిర్మాణం చేశారు. వాటిపై రహదారుల కోసం వంతెనలను నిర్మించారు.
జిల్లాకు తలమానికం సీతారామ ప్రాజెక్టు..
గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటూ ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బరాజ్లు భద్రాద్రి జిల్లాకు తలమానికంగా నిలిచాయి. రూ.13,057.98 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. భద్రాద్రి జిల్లాలో 1,63,770 ఎకరాల భూములకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే రూ.6,333 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే
ఏడాది కల్లా సీతారామ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది.
సాగునీటిరంగంలో ప్రగతిని ప్రజలకు వివరిస్తాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఈ రోజు వరకు సాగునీటి రంగంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బుధవారం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాం. భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ తొమ్మిదేళ్లలో నీటి పారుదల విషయంలో ఎంతో అభివృద్ధి సాధించాం.
– శంకర్నాయక్, చీఫ్ ఇంజినీర్, నీటి పారుదలశాఖ
పుష్కలంగా సాగునీరు
తెలంగాణ సిద్ధించాక సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మిషన్ కాకతీయ పథకంతో భూగర్భ జలాలు పెరిగాయి. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. మరోవైపు మత్స్య సంపద కూడా పెరిగింది. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బరాజ్ పథకాలు జిల్లాకు వరంగా మారాయి. ఈ ప్రాజెక్టులతో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుంది.
-బీ.అర్జున్, సీఈ, భద్రాద్రి కొత్తగూడెం
నేడు దశాబ్ది సంబురాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి రంగంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రకాశ్నగర్ వద్ద గల మున్నేరు చెక్డ్యామ్ వద్ద జరిగే సభలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొంటారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి నేలకొండపల్లిలోని మార్కెట్ ఆవరణంలో జరిగే సభలో, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వైరా రిజర్వాయర్ వద్ద జరిగే సభలో, పాలేరు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్లూరులోని ఎస్ఈ కార్యాలయ స్థలం వద్ద జరిగే సభలో, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మధిరలోని రైతువేదిక వద్ద జరిగే సభలో పాల్గొంటారు. వీరితోపాటు కలెక్టర్, ఇరిగేషన్శాఖ అధికారులు పాల్గొంటారు. ఆయా సభలో ప్రగతి నివేదికలను చదివి ప్రజలకు వివరిస్తారు.
పాలేరు పాత కాలువకు పునర్జీవం
ఖమ్మం జిల్లాలో నైజాం కాలంలో నిర్మించిన పాలేరు పాత కాలువ పునరుద్ధరణ పనులను పూర్తి చేసి 25వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టును ప్రభుత్వం వేగంగా పూర్తి చేసింది. దీనిద్వారా వెంకటాపురం మండలంలోని 32 గ్రామాలు వాజేడు మండలంలోని 7గ్రామాల్లో 10,132 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూ.228 కోట్లతో పనులను పూర్తి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు మహర్దశను తీసుకొచ్చారు. 11 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. పాత కాలువ పునరుద్ధ్దరణ కోసం రూ.64 కోట్ల నిధులను ఖర్చు చేశారు.
రూ.70 కోట్లతో పాలెంవాగు పూర్తి
వెంకటాపురం మండలంలో 32 గ్రామాలు, వాజేడు మండలంలో 7 గ్రామాల్లో 10,132 ఎకరాలకు పాలెం వాగు ద్వారా సాగునీరు అందుతున్నది. అటవీశాఖ ప్రాజెక్టు అనుమతులు సాధించి యుద్ధప్రాతిపదికన పనులు సాగించడంతో పాలెంవాగు పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూ.228 కోట్లతో పనులు పూర్తి చేయించింది. పాలెంవాగు ప్రాజెక్టు 2005లో రూ.70 కోట్ల వ్యయంతో ప్రారంభించారు.