భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం, జూన్ 27: రైతుబంధు పంటల సాయం పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో రెండు రోజుల్లోనే 2,07,514 మంది రైతుల ఖాతాల్లో రూ.132.40 కోట్లను జమ చేసింది. తొలి రోజున ఎకరంలోపు భూమి కలిగిన 1,18,126 మంది రైతులకు రూ.36.90 కోట్లు జమ చేయగా.. రెండో రోజు మంగళవారం 1-2 ఎకరాలు భూమి కలిగిన 89,388 మంది రైతులకు రూ.95.50 కోట్లను జమ చేసింది. వెంటనే ఆ నగదును తీసుకున్న కర్షకులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. దీంతో సాగు పనులు కూడా జోరందుకున్నాయి. ఇదే సమయంలో వరుణుడు కూడా కరుణించడంతో సాగు పనులు వేగిరమయ్యాయి.
భద్రాద్రి జిల్లాలో 20,816 మందికి..
భద్రాద్రి జిల్లాలో మంగళవారం రెండో రోజు మరో 20,816 మందికి రైతుబంధు పంటల పెట్టుబడి సాయం సొమ్ము జమ అయింది. తొలి రోజు 65,051 మంది రైతులకు రూ.36,69 కోట్లు చెల్లించగా.. రెండో రోజు 20,816 మంది ఖాతాల్లో రూ.40 కోట్లను ట్రెజరీ ద్వారా జమ చేశారు. మొత్తమ్మీద రెండు రోజుల్లో 85,867 మంది రైతులకు రూ.76,69 కోట్ల సొమ్ము జమ అయినట్లయింది.
సకాలంలో సాయం అందింది
రైతులకు సకాలంలో పెట్టుబడి సాయంగా సీఎం కేసీఆర్ రైతుబంధు నగదు అందిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేయడానికి ఈ డబ్బులు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. సన్న, చిన్నకారు రైతుల ఇబ్బందులు తొలిగిపోయాయి. అన్నంపెట్టే రైతు అప్పులపాలు కాకుండా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఐదేళ్లుగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పంటల పెట్టుబడి కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున జమ చేయడం రైతులకు ధైర్యాన్నిచ్చింది.
– సాధినేని వెంకటేశ్వర్లు, రైతు, తూటికుంట్ల గ్రామం, బోనకల్లు మండలం
పెట్టుబడి సాయం రైతులకు వరం..
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రారాజు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు వరమైంది. సీజన్కు ముందే ప్రభుత్వం రైతుబంధు సొమ్ము అందిస్తున్నది. రైతులకు ఆర్థిక భరోసా ఇస్తున్నది. వానకాలం సీజన్ సొమ్ము నా ఖాతాలో జమ అయింది. ఇక సాగు పనులు మొదలు పెడతా.
– గోళ్ల శ్రీను, రైతు, బూర్గంపహాడ్
సాగు పనులు మొదలు పెడతా..
ఐదేండ్ల నుంచి నాకు రైతుబంధు సాయం అందుతున్నది. ఈ వానకాలం సీజన్కూ సొమ్ము అందింది. దానితో వ్యవసాయ పనులు మొదలు పెడతా. మొబైల్కు మెసేజ్ రాగానే బ్యాంక్కు వెళ్లాను. నగదు తీసుకున్నాను. సీఎం కేసీఆర్ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ముత్యాల ఉమ, మహిళా రైతు, టేకులపల్లి