‘పార్టీకి కార్యకర్తలే పునాది.. వారికి పార్టీ అండగా ఉంటుంది.. పార్టీ కోసం పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది.. వారిని తగిన సమయంలో పదవులు వరిస్తాయి.. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి.. సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి.. పార్టీ గెలుపు కోసం పనిచేయాలి.. బీజేపీ మత విద్వేషాలు, కాంగ్రెస్ పార్టీ నిష్క్రియపర్వాన్ని ప్రజలకు వివరించాలి.. రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టాలి.. ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం కావాలి..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ వన్టౌన్ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రానున్న ఆరు నెలలు అత్యంత కీలకమని, జిల్లాపై రాజకీయంగా దండెత్తడానికి ఎంతోమంది కాచుకు కూర్చున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామని కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని, అలాంటి వారు మున్ముందు అడ్రస్ లేకుండా పోతారన్నారు.
– ఖమ్మం, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ వన్టౌన్ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ హయాంలోనే దేశంలో మత కల్లోలాలు జరుగుతున్నాయని, ఆ పార్టీ మున్ముందు మరిన్ని విద్వేషాలకు తెరలేపే అవకాశం ఉన్నదని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి పట్టుమని రెండు వేల ఓట్లయినా రాలేదని, అలాంటి పార్టీకి చెందిన నాయకులు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులూ పదే పదే పోటీ చేస్తూ ఓడిపోతున్నారన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్రంపై బీజేపీ కన్నుపడిందన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ తాను అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలాగా చూసుకుంటానని భరోసానిచ్చారు. ఖమ్మం నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అయిందన్నారు. ఇక్కడ ఇతర రాజకీయపక్షాలు తలపడితే పరాభావం తప్పదన్నారు. పార్టీకి కార్యకర్తలే పునాది అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే కార్యకర్తలు, నాయకులను పార్టీ అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు. కార్యకర్త లేకపోతే నాయకులు ఉండరని, పార్టీకి వెన్నెముక పార్టీ కార్యకర్తలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు చైతన్యవంతులని కొనియాడారు. వారి నుంచే ప్రజాప్రతినిధులు పాఠాలు నేర్చుకునే పరిస్థితి ఉందన్నారు.
ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కార్యకర్తలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని, వారికి భరోసానివ్వడమే అధిష్ఠానం ధ్యేయమన్నారు. కార్యకర్తలు ఇచ్చిన అధికారం కార్యకర్తలకేనన్నారు. రానున్న రోజుల్లో ఎంతో మంది నాయకులకు మంచి పదవులు వస్తాయన్నారు. ఎన్నికల సమయం వచ్చేసరికి కొందరు రాజకీయ స్వార్థపరులు బయల్దేరతారని, ప్రజల్లో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామని తలా తోకా లేని మాటలు మాట్లాడతారన్నారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారని, తర్వాత అడ్రెస్ లేకుండా అంతర్థానమవుతారన్నారు. తాను చదువుకున్నది.. బతుకుతున్నది.. ఖమ్మంలోనేనని, కడవరకూ ఇక్కడే ఉంటానన్నారు. ఇదే మట్టిలో కలిసిపోతామని ప్రజలకు చెప్పే దమ్ము ప్రత్యర్థులకు లేదన్నారు. రానున్న ఆరు నెలలు అత్యంత కీలకమని, జిల్లాపై రాజకీయంగా దండెత్తడానికి ఎంతోమంది కాచుకు కూర్చున్నారన్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముస్లిం మైనార్టీలు తనను అజయ్ ఖాన్ అంటారని, క్రిస్టియన్లు సైతం తనను ఆదరిస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడేనన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. ఖమ్మం నియోజకవర్గానికి 1వ టౌన్ గుండె అని, ఇక్కడ ఎప్పుడూ బీఆర్ఎస్కు ఓటమి ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందన్నారు. సమ్మేళానికి మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ కర్నాటి కృష్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, నాయకులు ఖమర్, అశ్రిఫ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అన్నిరంగాల్లో ఖమ్మం అభివృద్ధి..
ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ప్రజలందరూ స్వరాష్ట్రం సాధించిన ఫలితాలను ఆస్వాదిస్తున్నారన్నారు. కానీ కొన్ని రాజకీయ పక్షాలు తమ స్వార్థం కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2014కు ముందు పంటలకు రోజుకు 4 గంటల కరెంట్ ఉండడమే కష్టంగా ఉండేది.కానీ ఇప్పుడు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటుంది. కార్యకర్తలు సంక్షేమ పథకాలను ఇంటింటీకీ తీసుకెళ్లాలి. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించాలి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి.
– ఆత్మీయ సమ్మేళనాల జిల్లా సమన్వయ కర్త, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి
పార్టీ విజయం కోసం పనిచేయాలి
రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి అభివృద్ధి జరుగలేదు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలి. పార్టీ విజయానికి కృషి చేయాలి. పార్టీ కోసం నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను. కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాను. అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను. ఖమ్మం నియోజకవర్గంలో గతంలో కంటే మెజారిటీ మద్దతు ఉంది. పార్టీ విజయం ఖాయం.
– బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మంఎంపీ నామా నాగేశ్వరరావు
ప్రజలతో మమేకం కావాలి..
వచ్చే సాధారణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. ఎన్నికల సమయం ఆసన్నమైంది.ఆత్మీయ సమ్మేళనాలు సాధారణ సమావేశాలు కావు. పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త సమావేశాలకు హాజరుకావాలి. ప్రజలతో మమేకమై పనిచేయాలి. ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించాలి. పార్టీని మరింత బలోపేతం చేయాలి. జనం అలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. వారి నాడి పట్టుకోవాలి. అలా అయితేనే సులభంగా విజయం వరిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవు. అందుకే ఆ పార్టీకి ఈ దుస్థితి.
– బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
అభివృద్ధే ధ్యేయం..
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మరే ఇతర రాష్ట్రంలోనూ జరుగలేదు. ప్రజల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు. మధిర నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్కకు తీరిక లేదు. ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇంటింటికీ వెళ్లి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు తేడా.
– ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు