పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. నిస్సారమవుతున్న భూమిని ఈ వ్యర్థాలతో తిరిగి సారవంతంగా మార్చుకోవచ్చు. పామాయిల్ పండ్ల గెలలను గానుగ ఆడే క్రమంలో వచ్చే వ్యర్థాలను ఆయిల్పామ్ పంటలకు సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. పశువుల ఎరువుకు మించి పోషకాలు ఉండడంతో ఈ ఎరువుల వినియోగం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఈ సేంద్రియ ఎరువుతో భూసారం పెరుగుతోంది. మొక్కల పెరుగుదలకు దోహదపడుతోంది. అతితక్కువ కాలంలోనే సూక్ష్మజీవుల అభివృద్ధి జరుగుతున్నది.
గెలలను గానుగ ఆడిన తరువాత మిగిలిపోయిన టన్ను గెలల్లో(పీఈఎఫ్బీ- పామాయిల్ ఎమ్టీ ఫ్రూట్ బంచస్) సుమారు 52.75 శాతం సేంద్రియ పదార్థం ఉన్నట్లు మలేషియాలో జరిగిన పరిశోధనలో వెల్లడైంది. ఈ సేంద్రియ పదార్థంతో భూసారాన్ని పెంచి, మొక్కల పెరుగుదలకు దోహదపడే సూక్ష్మజీవుల అభివృద్ధి అతితక్కువ కాలంలోనే గణనీయంగా జరుగుతుంది.
దమ్మపేట రూరల్, ఆగస్టు 4 : పామాయిల్ కర్మాగారాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాల్లో అత్యధిక సేంద్రియ పదార్థాలున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. నిస్సారమవుతున్న భూమిని ఈ వ్యర్థాలతో తిరిగి సారవంతంగా మార్చుకోవచ్చని ఔత్సాహిక రైతులు నిరూపిస్తున్నారు. పామాయిల్ పంట సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తున్న విషయం తెలిసిందే. పామాయిల్ పండ్ల గెలలను గానుగ ఆడే క్రమంలో వెలువడే వ్యర్థాలను ఆయిల్పామ్ పంటలకు సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. పశువుల ఎరువుకు మించి పోషకాలు ఉండడంతో ఈ విధమైన ఎరువుల వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
కలుపును నివారిస్తూ.. తేమను కాపాడుతూ…
ఆయిల్పామ్ పండ్ల గెలలను గానుగ ఆడిన తరువాత ఖాళీ గెలలు, పండ్ల పీచును రైతులు కొనుగోలు చేసి తమ ఆయిల్పామ్ తోటల్లో ఎకరాకు సుమారు 30మెట్రిక్ టన్నులు మల్చింగ్గా పరుస్తున్నారు. మల్చింగ్గా వేయడం ద్వారా కలుపును పూర్తిస్థాయిలో నివారిస్తున్నారు. భూమిలోని తేమను కాపాడుకుని భూగర్భ జలాలను పొదుపు చేస్తున్నారు. సాగుకు అవసరమైన నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ పీచును మల్చింగ్ వేయడం ద్వారా ఆయిల్పామ్ పంటకు అవసరమైన నీటిని సరిపడా అందించవచ్చు. తోటల్లో పరిచిన పీచు సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కుళ్లిపోయి భూమిలో కలిసిపోతుంది. మల్చింగ్ భూసారాన్ని పెంచి కాపాడే సూక్ష్మక్రిములను వృద్ధి చేయడానికి, కాపాడేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రిములు పంటలకు అవసరమైన పోషకాలను అందిస్తున్నాయి.
స్థిరంగా పీహెచ్..: పామాయిల్ వ్యర్థాలను కలిపి 40రోజులు నిల్వచేసి కుళ్లడానికి వినియోగపడే మిక్సర్ను కలిపిన తరువాత మొక్కకు అవసరమైన పీహెచ్ 6.9 నుంచి 7.8 శాతం మధ్య ఉంటున్నది. 60 రోజుల నిల్వ పామాయిల్ మిల్ బయోగ్యాస్ స్లడ్జ్లో 3.6 శాతం, డెకెంటర్ కేక్లో(డీసీ), (డీమక్కు) 2.37శాతం నత్రజని ఉంది. పామాయిల్ ఫ్యూయల్ యాష్లో పాస్పర్ 2.17 శాతం, పొటాషియం 1.93 శాతం ఉన్నాయి.
ఎరువు తయారీ..: పీఈఎఫ్బీ, పీఓఎంఎస్, డీసీలను 0.50:0.25:0.25 నిష్పత్తిలో బయోగ్యాస్ ఎఫ్యులయింట్ను కలిపి 60రోజులు నిల్వ చేయాలి. 60రోజుల తరువాత ఈ మిశ్రమంలో అత్యధికంగా 31.75 శాతం నత్రజని ఉంటుంది. దీంతోపాటు పోషకాలు 3.26 శాతం నైట్రోజన్, 0.84 శాతం పాస్పరస్ ఉంటాయి.. మొక్కలకు 0.5శాతం చొప్పున నైట్రోజన్, పాస్పరస్ సరిపోతుంది. పోషకాలు పశువుల ఎరువులో లభ్యమయ్యే వాటికి మించి ఉన్నాయి.
నికరమైన దిగుబడులు..: మందలపల్లికి చెందిన ఔత్సాహిక యువ రైతు దేవరపల్లి హరికృష్ణ తన ఆయిల్పామ్ తోటకు ఏడేళ్లగా పామాయిల్ పీచు, డీమక్కును వినియోగిస్తూ స్థిరంగా ఎకరాకు సగటున 12మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తున్నాడు. రసాయనిక ఎరువులు, కలుపుమందు, పశువుల ఎరువుల వినియోగానికి స్వస్తి పలికాడు. పామాయిల్తోపాటు కొబ్బరి, వరి పంటలకు సైతం వీటిని వినియోగిస్తూ ఖర్చు లేకుండానే ప్రకృతి సేద్యం చేస్తూ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటున్నాడు. ఈ పద్ధతులను లింగాలపల్లిలో మద్దినేని వెంకట్ అనే రైతు మూడేళ్లుగా పాటిస్తూ స్థిరమైన దిగుబడులు సాధిస్తున్నాడు. మరికొంతమంది రైతులు కూడా ఎరువుగా వాడుతున్నారు.