దేవరుప్పుల, జూన్ 3: లక్ష్మీనర్సింహస్వామి వెలిసిన వానకొండయ్య గుట్టపై ఎట్టకేలకు మైనింగ్కు అనుమతులు రద్దయ్యా యి. ఈ మేరకు ఈనెల 7న లీజు రద్దు కోసం గనులశాఖకు కలెక్టర్ సిఫారసు చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా ధర్మాపురం రెవెన్యూ పరిధిలోని వానకొండయ్య గుట్టపై 12 ఎకరాల ప్రభుత్వ స్థలం (సర్వే నంబర్37)లో రోహిత్పాల్ మినరల్స్ 2018లో మైనింగ్ కోసం అనుమతులు తెచ్చుకున్నది. అప్పటి నుంచి మైనింగ్ పనులు నిర్వహిస్తూ వస్తున్నది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రజల కోరిక మేరకు మైనింగ్ అనుమతులు రద్దు చేయించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ మైనింగ్ పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ను నిర్వహిస్తున్నాడు. దీంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దాదాపు మూడేండ్లుగా పోరాటం చేస్తున్నది.
ఈ క్రమంలోనే గత మేనెలలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ మండల నాయకులు, లకావత్తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ జాటోత్ ఆనంద్ క్వారీ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ సందీప్కుమార్ ఝూకు ఫిర్యాదు చేశారు. దీంతో క్వారీ నిర్వహణపై విచారణ చేపట్టిన కలెక్టర్.. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించకపోవడంతోపాటు అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా గత బుధవారం క్వారీ కాంట్రాక్టర్, రోహిత్పాల్ మినరల్స్ సంస్థ యజమాని మురళి, ఎర్రబెల్లి, జాటోత్ ఆనంద్ను కలెక్టర్ పిలిచి విచారణ చేపట్టారు. ఈ విచారణలో క్వారీ యజమాని ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో క్వారీ రద్దుకు కలెక్టర్ మొగ్గుచూపారు. కాగా, మైనింగ్ రద్దు కోసం బీఆర్ఎస్ నాయకులు అనేక ఉద్యమా లు చేశారని బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
క్వారీ రద్దుకు ముఖ్య కారణాలివే..
కలెక్టర్ సందీప్కుమార్ ఝూ క్వారీ లీజు రద్దు చేస్తున్నట్టు ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. దేవునిగుట్ట కావడం, పర్యావరణకు విఘాతం కలిగించడంతోపాటు రోహిత్పాల్ మినరల్స్ సంస్థ గ్రామపంచాయతీ అనుమతి తీసుకోలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తహసీల్దార్ నుంచి ఎన్వోసీ తీసుకోకపోవడం, లీజు కు సంబంధించిన రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో లేకపోవడం, లీజు బకాయిలు ఉండటం తదితర కారణాలతో అనుమతులు రద్దు చేసినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. తహసీల్దార్ ప్రత్యేక సమావేశ పరచి లీజు భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.