Bandi Sanjay | హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు మూడు రోజులు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్లినట్టు సమాచారం. మంత్రి వ్యక్తిగత సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, ఆయన్ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, హైదరాబాద్, కరీంనగర్లోని ఆయన నివాసాల్లో అందుబాటులో లేరని బీజేపీ కార్యకర్తలు, కేంద్ర మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. పోక్సో కేసులో ఆయన కొడుకు అరెస్ట్ అయినప్పటి నుంచే కొంత ముభావంగా ఉంటున్నారని అంటున్నారు. ఆ ఘటన తర్వాత పార్టీ కూడా క్రమంగా దూరం పెడుతూ వస్తున్నదని, గత నెల చివరి వారంలో జరిగిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ బస్సుయాత్రలో పాల్గొనేందుకు కూడా ఢిల్లీ బీజేపీ నిరాకరించినట్టు చెప్తున్నారు.
దీనికి తోడు తాజాగా బీజేపీలోనే సంచలనమైన వివాదాస్పద ఫ్లెక్సీల కేసులో మంత్రికి అనుచరుడిగా గుర్తింపు ఉన్న బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి ముందుగా బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కావాలనే తమపై కుట్ర చేశారని, తనను అప్రతిష్ఠ పాలు చే సేందుకు ఈ కేసును వాడుకున్నారని కేంద్ర మంత్రి, ఆయన సన్నిహిత వర్గం అనేకసార్లు విమర్శలు చేసింది. అయితే భగీరథ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన ఆలోచనా విధానం మారిందని మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు, త్వరలోనే జరుగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ రేసులో ఉన్న ఎంపీలే తనపై కుట్రచేశారని, తన కొడుకు కేసును వాడుకున్నారని సదరు మంత్రి బలంగా నమ్ముతున్నారని సన్నిహితులు అంటున్నారు. సొంత పార్టీ నేతలు చేసిన కుట్రలపై ఆయన ప్రతీకారంతో రగిలిపోయినట్టు చెప్తున్నారు. ఆయన ఆవేదనను గమనించిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఫ్లెక్సీ వ్యూహాన్ని పన్నినట్టుగా చెప్తున్నారు.
ఇద్దరు ఎంపీల మీద పగ తీర్చుకోవడానికి, వారిద్దరి మధ్య గొడవలు సృష్టించటానికే రామకృష్ణ ఉద్దేశపూర్వంగా ఫ్లెక్సీలు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు మంత్రి పాదయాత్ర చేసిన నాటి నుంచి ఎంపీ ఎన్నికల్లో గెలిచేదాకా దగ్గరుండి టెంట్లు వేయించారని, ఆయనకు పె ద్ద టెంట్హౌస్ ఉన్నదని చెప్తున్నారు. పోక్సో కేసు వివాదంలో డ్యామేజ్ చేసింది వారిద్దరే అనే ఆలోచనతో మలాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను టార్గెట్ చేసినట్టు చెప్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. ‘బీజేపీ నీ కో సం నిలబడితే నువ్వు బీజేపికి చేసింది ఏంటి?’ అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. ‘టీఆర్ఎస్కు ఓనర్ను నేనే.. అంటేనే కదా కేసీఆర్ మెడపట్టి నిన్ను బయటకు నెట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీలో తెచ్చుకోకు’ అని మరో ఫ్లెక్సీలో హెచ్చరించారు. ఈ చర్యను బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్రావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేరొన్నారు. కాగా, పోలీసుల దర్యాఫ్తులో కేంద్ర మంత్రి అనుచరుడే ఈ పనిచేశారని తేలటంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది.
గత నెలలో ‘రైతు గోస బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ బస్సుయాత్ర చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి చేసిన ఈ యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కూడా ఆసక్తి చూపినట్టు తెలిసింది. దీనికి ఢిల్లీ దూతను అభ్యర్థించినట్టు సమాచారం. అప్పుడే భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావటంతో కేంద్ర పార్టీ ఆయన్ను అనుమతించనట్టు తెలిసింది. ఈ పరిణామాలతో బస్సుయాత్ర కరీంనగర్లో జరిగినప్పటికీ ఆయన పాల్గొనకపోవటం గమనార్హం.