పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. ఎంతోకాలంగా జఠిలంగా ఉన్న పోడు వ్యవహారానికి రాష్ట్ర సర్కారు పరిష్కారం చూపిం చింది. అర్హులైన పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రత్యేక జీవో 140ను జారీ చేయడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాను పరిగణనలోకి తీసుకున్న అటవీ, రెవెన్యూశాఖ అధికారులు ఇప్పటికే సర్వే ప్రారంభించారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న పోడు భూముల వ్యవహారం మరో రెండునెలల్లో కొలిక్కిరానున్నది. ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో మంత్రుల కమిటీని వేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోడు భూముల పట్టాల విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. దీంతో అధికారులు గ్రామస్థాయిలో వారంరోజులుగా పోడు భూములను ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, అదనపు కలెక్టర్లు సర్వేలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. త్వరలో పోడుకు పట్టాలు రానుండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ)/ఇల్లెందు రూరల్ : పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకు రావడం కోసం ఐటీడీఏ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే ప్రారంభించాయి. ఇందులో పంచాయతీ సెక్రటరీ, అటవీ, రెవెన్యూశాఖల అధికారులతోపాటు ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. రెండునెలలపాటు జరిగే ఈ సర్వేలో ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వివరాలను తెలుసుకుంటున్నారు. గత ఏడాది నవంబర్లో పోడు భూములు కలిగిన గిరిజన, గిరిజనేతర రైతులు మీ సేవా ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు సర్వే ప్రారంభించారు. సర్వే నంబర్ల ఆధారంగా సర్వే ప్రక్రియ కొనసాగుతున్నది. జీపీఎస్ సిస్టమ్ను కూడా సర్వేలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
2,94,890 ఎకరాల్లో పోడు భూములు
జిల్లావ్యాప్తంగా గిరిజనులు నివాసాలు ఉండే ప్రాంతాల్లో పోడు భూములను రైతులు ఇప్పటికే సాగుచేసుకుంటున్నారు. ఇందులో అటవీ హక్కుల చట్టం పరిధిలో కొంత ఉండగా మరి కొన్ని వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ సాగు చేసుకుంటున్న రైతుల వివరాలను పరిశీలిస్తూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇందులో 349 గ్రామ పంచాయతీల పరిధిలో 758 గ్రామాల్లో గిరిజనులు, గిరిజేతరులు పోడు సాగు చేసుకుంటున్నారు. గతంలో సర్వే రిపోర్టు ఆధారంగా జిల్లాలో భూమి విస్తీర్ణం 17,47,971 లక్షల ఎకరాలు ఉండగా, దీనిలో అటవీ విస్తీర్ణం 10,13,698 ఎకరాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో పోడు భూములు 2,29,229 ఎకరాలు సాగులో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 64,491 మంది గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారు. గిరిజనేతరులు 18,246 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా గుండాల, టేకులపల్లి, ఇల్లెందులో పోడు భూమి సాగులో ఉంది. గుండాలలో 20,396 ఎకరాలను పోడు రైతులు సాగు చేస్తున్నారు. ఎక్కువగా పినపాక నియోజకవర్గంలోనే పోడు భూమిని రైతులు సాగు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఆనందంలో గిరిజనం
ఎంతోకాలంగా పోడు భూముల వ్యవహారంలో ఇటు గిరిజనులకు అటు అటవీశాఖకు మధ్య రగులుతున్న పోడు పోరుకు సర్కారు చరమగీతం పలికింది. దీంతో పోడు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. క్యాబినెట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక జీవో-140 జారీ చేయడంతో వారి సమస్యకు పరిష్కారం లభించింది. దీంతోపాటు భవిష్యత్లో అటవీ భూముల జోలికి వెళ్లకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు గిరిజనులు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. గిరిజన సంఘాల నాయకులు కూడా దీనికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కూడా చేశారు.
సీఎం కేసీఆర్ పెద్దమనసుతో ఆలోచించారు
రాష్ట్రవ్యాప్తంగా పోడు సమస్యకు చక్కటి పరిష్కారం చూపారు సీఎం కేసీఆర్. అందుకే పోడు సర్వే వేగవంతంగా జరుగుతున్నది. అర్హులైన ప్రతిఒక్కరికీ పోడు పట్టాలు వస్తాయి. ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. గిరిజనులపై తెలంగాణ సర్కారుకు చిత్తశుద్ధి ఉందని నిరూపించారు. గిరిజన బిడ్డలుగా గర్వపడుతున్నాము.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే
గిరిజనుల సమస్యను అర్థం చేసుకున్నారు
గిరిజనుల సమస్యను అర్థం చేసుకున్న పెద్దమనసున్న నాయకుడు సీఎం కేసీఆర్. త్వరలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతాంగానికి పట్టాలు వస్తాయి. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మంచి నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేశారు. గిరిజనులు రుణపడి ఉంటారు. అందుకే దేశానికి మన నేత కావాలి. అంతటా ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది.
– కోరం కనకయ్య, జడ్పీ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం
కేసీఆర్కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అటవీశాఖ అధికారులకు మాకు జరుగుతున్న వివాదం శాశ్వతంగా సద్దుమణిగింది. నేను కూడా దరఖాస్తు చేసుకున్నా. అడవితల్లిని నమ్ముకుని బతికే మాకు పట్టాలిచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నందుకు శతకోటి ధన్యవాదాలు. అడవి నుంచి మమ్మల్ని దూరం చేయకుండా చూస్తున్న కేసీఆర్ సార్కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.
– సనప వీరభద్రం, ధనియాలపాడు, ఇల్లెందు మండలం
మంచి రోజులు వచ్చాయి
తాతముత్తాల నుంచి మేము పోడు భూమిలో సాగు చేసుకుం టున్నాం. ఇదే మాకు జీవనాధారం. వేరే దిక్కు లేదు. తల్లి లాంటి మా పోడు భూమిని వదిలివెళ్లలేం. జీవో-140 అమలుతో మాకు మంచిరోజులు వచ్చాయి. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. గిరిజనుల కష్టాలు తెలిసిన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం.
– ఊకే మల్లయ్య, సుదిమల్ల పంచాయతీ కొత్తూరు, ఇల్లెందు
సర్వే ముమ్మరంగా చేస్తున్నాం
పోడు భూములపై సర్వే ముమ్మరంగా జరుగుతున్నది. దరఖాస్తులో పోడు రైతులు పొందుపరిచిన వివరాలన్నింటిని పరిశీలిస్తున్నాం. ఎఫ్ఆర్సీ కమిటీతో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి భూమి హద్దు వివరాలు తెలుసుకుంటున్నాం. త్వరలో సర్వే పూర్తిచేసి సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. పోడు భూములతోపాటు అటవీ భూముల హద్దులను కూడా గుర్తిస్తున్నాం.
– అప్పారావు, ఎంపీడీవో, ఇల్లెందు