గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వరం.. అంగన్వాడీ కేంద్రం
పోషకాహార లోప నివారణకు కార్యాచరణ
అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీగార్డెన్స్
గిరిజన ప్రాంతాల్లో స్థానికంగా ‘మిల్లెట్స్’ సాగు
నిర్వహణపై కలెక్టర్ అనుదీప్ నిరంతర పర్యవేక్షణ
అంగన్వాడీ కే్ంరద్రాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వరం.. వాటి ద్వారా ప్రభుత్వం నెల నెలా పౌష్టికాహారం అందిస్తున్నది.. అందుకే ఒక్కో కేంద్రం ఆరోగ్య నిలయం.. సేవలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ సర్కార్ పారదర్శకంగా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేస్తున్నది.. ప్రతి టీచర్ వారికి అందిస్తున్న సేవలను మొబైల్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు.. గిరిజన ప్రాంతాలకు చెందిన పిల్లలకు స్థానికంగా పండిన ‘మిల్లెట్’ ఆహారాన్ని అందిస్తున్నారు.. అందుకు ప్రభుత్వం స్థానిక రైతులకు ఉచితంగా విత్తనాలు అందించి చిరుధాన్యాల సాగు చేయిస్తున్నారు.. అంగన్వాడీ కేంద్రాలో ్లన్యూ ట్రీన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి అక్కడ పండిన కూరగాయలు, ఆకుకూరలను వండి లబ్ధిదారులకు అందిస్తున్నారు.. ఈ సేవలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కలెక్టర్ అనుదీప్ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మిల్లెట్స్ పండిస్తూ వారికి పోషకాహారం అందించే ఉద్దేశంతో కేంద్రం ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేయగా పైలట్ జిల్లాగా భద్రాద్రి ఎంపికైంది. ఈ ప్రాజెక్టును కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లాలో అమలు చేస్తున్నారు. 11 ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలపై దృష్టి సారించారు. ఇప్పటికే సమీప ప్రాంతాలకు చెందిన రైతులకు 54 క్వింటాళ్ల మిల్లెట్ విత్తనాలు అందజేశారు. ఇప్పటికే 1,120 ఎకరాల్లో మిల్లెట్ సాగవుతున్నది. కూరగాయలు ఆకుకూరలు పండించేందుకూ ప్రణాళిక అమలవుతున్నది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటైంది. పోషకాహరలోపం తీవ్రంగా ఉన్న వారు, సాధారణ పోషకాహార లోపం ఉన్న వారికి ఇప్పుడు బాలామృతం ప్లస్ ఫీడింగ్ అందుతున్నది. కలెక్టర్ ప్రతి బుధవారం అంగన్వాడీ సేవలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాల్వంచ, అశ్వారావుపేట ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో కొర్రలు, జొన్నలు, పల్లీలతో చేసిన మిల్లెట్ అహారం అందుతున్నది.
అంగన్వాడీలకు కార్గో ద్వారా సరుకులు..
అంగన్వాడీ కేంద్రాలకు అందే పప్పు, వంట నూనెతో పాటు ఇతర పోషకాహారాన్ని ప్రభుత్వం ఆర్టీసీ కార్గో ద్వారా నేరుగా సరఫరా చేస్తున్నది. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అంగన్వాడీ టీచర్ మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా పంపిణీ చేస్తున్నది. రేషన్ షాపుల ద్వారా బియ్యం తీసుకునే పద్ధతికి స్వస్తి పలికి సరాసరి గోదాముల నుంచే బియ్యం సరఫరా చేస్తున్నది.
పోషకాహార లోప నివారణకు చర్యలు..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, బాలింతలు, గర్భిణుల్లో పోషకాహార లోప నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వారి కోసంగా ప్రత్యేకంగా మెనూ అమలు చేస్తున్నది. అవసరాన్ని బట్టి బాలామృతం ప్లస్, డబుల్ రేషన్ అందజేస్తున్నది. సూపర్వైజర్ ఫీడింగ్ ద్వారా ఐసీడీఎస్ అధికారులు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తున్నారు. లోటుపాట్లపై అంగన్వాడీ టీచర్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తున్నారు.
ప్రతి టీచర్కు స్మార్ట్ ఫోన్..
స్మార్ట్ పోషణ్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ టీచర్కు స్మార్ట్ ఫోన్ అందింది. వీటి ద్వారా అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సేవలను ఆన్లైన్ చేస్తున్నారు. ఏ సెంటర్లో రోజుకు ఎంత మంది హాజరవుతున్నారు.. వారికి ఏయే సేవలు అందుతున్నాయి.. అనే అంశాలను ప్రతి రోజూ నమోదు చేయాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులకు పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. సకాలంలో టీకాలు అందుతున్నాయి. 11 ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది 5,506 మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరారు.
పకడ్బందీగా సేవలు..
అంగన్వాడీ కేంద్రాల్లో పాత పద్ధతులకు స్వస్తి పలికాం. ఇప్పుడు స్మార్ట్ సేవలు అందిస్తున్నాం. మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన చిన్నారులకు మిల్లెట్ ఆహారం అందిస్తున్నాం. బాలామృతం ప్లస్ చేరవేస్తున్నాం. కలెక్టర్ అనుదీప్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీలకు వచ్చిన 5 వేల మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాం.
– ఆర్.వరలక్ష్మి, డీడబ్ల్యూవో, కొత్తగూడెం