ఖమ్మం, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండ్రోజులపాటు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 9గంటల వరకు గరిష్టంగా 50.50 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతున్నది. సాయంత్రం 7గంటలకు 47.80 అడుగులకు చేరింది. గోదావరి వరద నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హుటాహుటిన భద్రాచలం చేరుకుని పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో కలెక్టర్ ప్రియాంక ఆల, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ వినీత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి వరద ఉధృతి, తీసుకుంటున్న పునరావాస చర్యలపై సమీక్షించారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ అధికారులు, వరద సహాయక సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
బ్రిడ్జి నుంచి వరద ఉధృతిని పరిశీలించారు. భద్రాచలం రామాలయం ప్రాంతానికి చేరిన నీటిని అధికారులు సీతారామ ప్రాజెక్టు పనులకు వినియోగించే బాహుబలి విద్యుత్ మోటర్లతో గోదావరిలోకి వదిలారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే ప్రధాన రాష్ట్రీయ రహదారిపై గంగోలు వద్ద పెద్దఎత్తున వరద నిలిచిపోవడంతో ఆ ప్రాంత రాకపోకలకు అంతరాయం కలిగింది. గురువారం సాయంత్రం రాకపోకలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం- ఛత్తీస్గఢ్ రహదారిపై కూనవరం సమీపంలో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాచలం ప్రాంతంలో వరద సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. 70 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్లోని అన్ని మండలాల్లో పినపాక నియోజకవర్గంలోని వరద ప్రభావిత మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో వరద సహాయానికి సంబంధించి ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
తాగునీటికి, ఆహారానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పినపాక నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భద్రాచలంలో వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వైజాగ్, రాజమండ్రి నుంచి ప్రత్యేక బృందాలు భద్రాచలానికి చేరుకోనున్నాయి. మరోవైపు భద్రాచలంతోపాటు ఖమ్మం నగరంలోని మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మంత్రి పువ్వాడ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి పువ్వాడ సీఎం ఆదేశాలతో తక్షణం ఖమ్మం బయలుదేరి వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. నగరంలోని పద్మావతినగర్లో వరదలో చిక్కుకున్న రెండు కుటుంబాల వారిని రక్షించేందుకు హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయించి, ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు మనోధైర్యం కల్పించారు. మరోవైపు మున్నేరు వరద ముంపునకు గురైన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్..
ఖమ్మం నగరంలో మున్నేరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న తీరును తెలుసుకున్న సీఎం కేసీఆర్ భద్రాచలంలో ఉన్న మంత్రి పువ్వాడకు ఫోన్ చేశారు. భద్రాచలంలో గోదావరి వరద పరిస్థితి, తీసుకుంటున్న చర్యలను ఆరా తీసిన ముఖ్యమంత్రి ఖమ్మంలో మున్నేరు నీటిప్రవాహం పెరుగుతున్న తీరు, మున్నేరు వరదలో చిక్కుకుపోయిన వారి పరిస్థితిని మంత్రిని అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం ఖమ్మంలో మున్నేరు ఉధృతిని పరిశీలించానని, వరద ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేశామని మంత్రి సీఎం కేసీఆర్కు వివరించారు.
ఖమ్మం నగరంలోని పద్మావతినగర్లో వరద నీటిలో చిక్కుకుపోయిన కుటుంబాలను కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని, ఖమ్మం వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం మంత్రి పువ్వాడను ఆదేశించారు. హుటాహుటీన ఖమ్మం చేరుకున్న మంత్రి పువ్వాడ అజయ్ విశాఖపట్నం నుంచి భద్రాచలానికి వస్తున్న ఎన్డీఆర్ బృందాలను కొత్తగూడెం మీదుగా ఖమ్మానికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మున్నేరు వద్ద నీటిలో చిక్కుకున్న రెండు కుటుంబాలకు చెందిన 11మందిని రక్షించారు. త్రీటౌన్ ప్రాంతంలో ముంపునకు గురైన వెంకటేశ్వరనగర్, మోతీనగర్, బొక్కలగడ్డ, జలగంనగర్, ఎఫ్సీఐ గోడౌన్స్, దానవాయిగూడెం ప్రాంతాల్లోని ప్రజలను నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించి భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు.