ఖమ్మం :ఖమ్మం పెద్దాసుపత్రి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు సంబంధించిన నేషనల్ క్వాలిటీ కంట్రోల్ అస్సెస్మెంట్ బృందం సోమవారం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను సందర్శించింది. గతంలో మూడు దఫాలుగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దవాఖానాకు రోగుల తాకిడి, వారికి అందిస్తున్న వైద్య సేవలను క్షుణ్నంగా పరిశీలించింది.
ప్రధానంగా నాణ్యతా ప్రమాణాల విషయమై బృందం సభ్యులు అణువణువూ తనిఖీలు నిర్వహించారు. గత 2018లో ఎన్క్వాస్ సర్టిఫికెట్ లభించగా అప్పటి నుంచి దవాఖానాకు ఏటా రూ. 40 లక్షలు నిధులు సమకూరుతున్నాయి. వాటితో రోగులకు మౌళిక వసతుల కల్పన, హాస్పిటల్ అభివృద్ది పనులు చేపడుతున్నారు. అదేవిధంగా 20 శాతం నిధులను అత్యుతమ ప్రమాణాలు పాటించి రోగులకు అద్భుత సేవలు అందించే సిబ్భందికి ఇంక్రిమెంట్స్ ఇస్తుండటం గమనార్హం.