నేలకొండపల్లి, నవంబర్ 4: కార్తీక మాసం సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, మోహినిదేవి జ్ఞాపకార్థం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో శుక్రవారం జాతీయస్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో తొలిరోజు పాలపండ్ల విభాగంలో ఏడు జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. ఏపీలోని నర్సారావుపేట మండలం ఇక్కుర్తికి చెందిన మాదనబోయిన పోతురాజు యాదవ్ ఎద్దుల జత బండను 3,539 అడుగుల దూరం లాగి ప్రథమస్థానం, ఎన్టీఆర్ జిల్లా చీమలపాడుకు చెందిన రామాంజనేయులు, గుంటూరు జిల్లాకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత ఎద్దుల జత 3,408 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి.
ఎడ్ల యజమానులకు నిర్వాహకులు వరుసగా రూ.20 వేలు, రూ.15 వేల నగదు బహుమతులను అందించారు. మరో మూడ్రోజుల పాటు పోటీలు జరుగనున్నాయి. నిర్వహణ, నగదు బహుమతులకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి రూ.4 లక్షలు సమకూర్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, మార్కెట్ చైర్మన్ శాంత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శాకమూరి సతీశ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గండు సతీశ్, సొసైటీ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి, ఎంపీటీసీ చంద్రమ్మ, మరికంటి రేణుబాబు, వెన్నబోయిన శ్రీను, నిర్వాహణ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.